పద్య కాదంబరి --- అష్టోత్తరశతం సేకరణ-విశ్లేషణ ... Dr. నందివాడ(భట్టిప్రోలు) విజయలక్ష్మి

 

 ప్రార్థనా శ్లోకములు 


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా

అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం 
ఆజానుబాహుమరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి

జయతు జయతు దేవో దేవకీనందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః 
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః



***************************************************

రచయిత్రి అభిభాష 

అందరికీ నమస్కారం. 24 జులై 2025 నుంచి రోజూ ఓ పద్యం, దాని భావం కూడా నా పాఠకులకు రాసి షేర్ చేస్తున్నాను. చదువుతున్న అందరికీ కృతజ్ఞతలు. కొన్నాళ్ల క్రితం మా సువర్చల అత్తయ్య చెల్లెలు శ్రీమతి భారతిగారు, 'రోజూ ఓ పద్యమో, సుభాషితమో పెడితే బావుంటుంది' అన్నారు. అలా మొదలైంది ఈ పద్య ప్రయాణం. నాకు చిన్నప్పటి నుంచీ తెలిసిన, విన్న, చదివిన గ్రంధాల నుంచి నాకు నచ్చిన పద్యాలను సేకరించి రోజుకొకటి చొప్పున వాటికి వ్యాఖ్యానం చెప్తూ వచ్చాను. 

బహుశా ఈ పద్యాలు, శ్లోకాలు ముందే తెలిసిన వారికి చర్వితచర్వణం అనిపించి ఉండవచ్చు లేదా పునశ్చరణ అనిపించీ ఉండవచ్చు. కొత్తగా తెలుసుకుంటున్న వారికి ఆసక్తి దాయకంగా అనిపించీ ఉండవచ్చు. నేను మాత్రం ఆపకుండా, నా పాఠకమిత్రులకు పట్టువదలని విక్రమార్కుడి ముదిమనవరాలి వలె, అపురూపమని నేను భావించిన ఈ పద్యాలను అందించాలనే ఆకాంక్షతో, వరుసగా 108 రోజులపాటు నా బ్లాగ్ లో రాస్తూ, అందరికీ షేర్ చేస్తూ వచ్చాను. ఓ డెబ్బై శ్లోకాలు పూర్తి అయ్యాక అనిపించింది, ఓ నూట ఎనిమిది శ్లోకాల వరకూ చేయాలని. శ్లోకం అంటే సంస్కృత పద్యం అని నిఘంటువులో చూసిన తరువాత, దీనికి "పద్యకాదంబరి-అష్టోత్తరశతం" అని పేరు పెట్టుకున్నాను. దీనికీ ఒక కారణం ఉంది. నా పాఠకదేవుళ్లకి నేను ప్రీతిగా సమర్పించే 'అష్టోత్తరశతపద్యమంజరి' ఇది. అందుకే నూటఎనిమిది పద్యాలు అని ఓ లిమిట్ పెట్టుకున్నాను. నవంబర్ 9, 2025 కి అవి పూర్తి అయ్యాయి. ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. కొందరు ఇవి అన్నీ పుస్తక రూపంలో కావాలని అడిగారు. అందుకే ఈ పుస్తకం వెలుగు చూస్తోంది.

ఈ మాధ్యమంలో ఎందరో పెద్దలు, పండితులు, భక్తులు, రచయితలు పరిచయం అయ్యారు. వారు చూపిన ప్రేమాభిమానాలకు, వారు అందించిన ప్రోత్సాహానికి, వారిచ్చిన సలహాలు, సూచనలకు నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. వారందరికీ నా నమస్కారాలు. 

ఈ ప్రయాణంలో నాకెంతో ప్రోత్సాహం ఇచ్చి, నిత్యం నా రచన చూసి వారి అభిప్రాయం పంపించిన శ్రీ ఎరగుడిపాటి రమణారావు గారికి, వారి శ్రీమతి, నేను ముద్దుగా నా 'బంగారు ఉడుత' అని పిలుచుకునే మా రాధికకూ నా కృతజ్ఞతలు. రమణారావుగారు నేను కోరగానే ఎంతో ప్రేమతో చక్కని ముందుమాట రాసి ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు. 

మా శ్రేయోభిలాషి, సోదరసమానులు శ్రీ కౌండిన్య శాస్త్రి గారు ఎంతో ఆత్మీయతతో, భావుకతతో వ్రాసి ఇచ్చిన పరిచయ వాక్యాలు అద్భుతం, అపూర్వం. వారి పాండిత్యం, సాహిత్యం పట్ల వారికి ఉన్న మక్కువ, ఆధ్యాత్మికతకు వారు వేసే పెద్ద పీట అమోఘం, అనిర్వచనీయం. కేవలం ముందుమాట వ్రాయడమే కాకుండా, మా దంపతులకు ఈ పుస్తకాలు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందించమని చేసిన సూచన శిరోధార్యం. ఈ విజ్ఞానం చిన్న పిల్లలకు చేరాలనే వారి ఆశయం మహత్తరం. వారికి మా దంపతులు సర్వదా, సర్వథా రుణపడి ఉంటాము. ఈ పద్యాలు విద్యార్థులకు ఒక కరదీపిక వలే మార్గదర్శి అవుతాయని ఆశిస్తాను. 

నిజమే కదా, సంస్కృతాంధ్ర సాహిత్య మధురిమ, ఉదాత్తత, ప్రయోజనము ఆబాలగోపాలానికీ కావలసినదే. ఆ సరస్వతీమాత కురిపించిన వేదవాహినిలో, విద్యాస్రవంతిలో అందరమూ తరించి  కృతార్థులవుదాం. పుస్తకాలు ఎప్పుడూ పూజనీయమే, అవి ఎల్లప్పుడూ పఠనీయం, అనుసరణీయం, ఆచరణీయం. వాటిలోని విశేషమైన విషయాలను ఆకళింపు చేసుకుని ఆచరిస్తే, ఉత్తమ జీవన నైపుణ్యాలను అలవరచుకుని, జీవనప్రమాణాలను మెరుగుపరుచుకుని, జీవితానందాన్ని, జీవితాశయాన్ని అందుకుంటాం. పద్యకాదంబరి-అష్టోత్తరశతం చదివినవారు మీ మీ స్పందనలను తెలియచేస్తే సంతోషం. సెలవు. 

మీ డా. నందివాడ (భట్టిప్రోలు) విజయలక్ష్మి 
9885010650  

***************************************************


ముందుమాట

వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం), వేదాంగాలు (శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం), ఉపనిషత్తులు, సూక్తాలు, రామాయణం, మహాభారతం, మహాభాగవతం వంటి ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, శ్రీ శంకర భాగవత్పాదులు రచించిన రచనలు (ఉదాహరణకి — సౌందర్యలహరి, భజగోవిందం, ఆత్మబోధ లాంటివి), భర్తృహరి చెప్పిన సుభాషితాలు, చాణక్యుని నీతిసూత్రాలు, సుమతీ శతకం, గువ్వల చెన్న పద్యాలు, వేమన పద్యాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము, ఇంకా ఎన్నో— ఇవన్నీ భారతదేశపు ఆధ్యాత్మిక, తాత్విక, నైతిక, సాంస్కృతిక సంపదగా ఎంతో గౌరవించబడుతున్న రచనలు. ఇవి మన సంప్రదాయాన్ని, సంస్కృతిని, ఆధ్యాత్మికతను మరియు జ్ఞాన వారసత్వాన్ని ప్రతిబింబించడమే కాదు, సమాజానికి దారి చూపే మార్గదర్శకాలు కూడా.

ఈ శ్లోకాలు ప్రాచీన సంస్కృతంలో గానీ లేక గ్రాంధిక భాషలో ఉండటంతో వల్ల గానీ, చాలా మందికి అవి అర్థం కావడం కష్టం. అందువల్ల, వాటి, గొప్పతనము, విలువ, అంతరార్థము చాలామందికి తెలిసి ఉండదు. ఈ నేపథ్యంలోనే, ఈ పుస్తక రచయిత్రి పైన చెప్పబడిన సాహిత్యగ్రంథముల నుంచి ఎంతో శ్రద్ధగా ఎన్నుకున్న నూటఎనిమిది శ్లోకాలకు, పద్యాలకు సరళంగా, సులభశైలిలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో వివరిస్తూ, వాటి ప్రాముఖ్యతను పాఠకులకు తెలియపరిచేలా కృషి చేశారు.

ప్రతి శ్లోకానికీ తాత్పర్యం మాత్రమే కాదు, దాని లోతైన అర్థం, జీవితానికి, సమాజానికీ ఎలా వర్తిస్తాయో కూడా విశదీకరించారు. అంతేకాక, ఈ శ్లోక సంకలనము ఆధ్యాత్మిక చింతన మరియు వేదాంత ధోరణులకు కూడా మార్గం చూపుతుంది.

ఈ రచయిత్రి ఒక ఆధ్యాత్మిక సాధకురాలు, మంచి విద్యావేత్త, మరియు అనుభవజ్ఞురాలు. ఆమె ఈ పుస్తకంలో తన అనుభవం, అధ్యయనం కలిపి, ఈ రచనను అందించారు. ఇదేకాదు, ఇందులో ఎంచుకున్న శ్లోకాలు మరియు వాటి అర్థాలు – ఏ కాలానికి అయినా సరిపోయే విలువలతో, సందేశాలతో, చైతన్యంతో నిండినవి. ఈ రచయిత్రికి నా హృదయపూర్వక అభినందనలు. పాఠకులు ఈ పుస్తకాన్ని అర్థంతో చదివి, అనుభవంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.


ఇట్లు, 12 నవంబర్ 2025
యరగుడిపాటి వెంకట రమణారావు
రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం,
గిండి ఇంజనీరింగ్ కాలేజి, అన్నా యూనివర్సిటీ, చెన్నై.


***************************************************

ధర్మనాటక మంజూష



శ్లో।। పద్యాని ధర్మబోధాయ, శ్లోకాని శాంతిదా యకమ్।
భక్తిం జనయతి జ్ఞానం,విజయలక్ష్మీకృతం సదా ॥


భావం: పద్యాలు ధర్మాన్ ని బోధిస్తాయి,శ్లోకాలు మనసుకు శాంతిని ఇస్తాయి; జ్ఞానం భక్తి ని పెం చుతుంది, విజయలక్ష్మి గారి రచన అలాంటిదే.

భారతీయ సంస్కృతి అనేది భక్తి , తత్త్వం , శాస్త్రం , నీతి, అనుభవం, సా హిత్యం అనే అనేక అంశాల సమాహారం. అటువంటి వాటినన్నింటిని ఒకే పుస్తకంలో, పద్య శ్లోక రూపంలో, ఏర్చి, కూర్చి ప్రతి దానికి అర్థవంతమైన విశ్లేషణ అందించారు భట్టిప్రోలు విజయలక్ష్మి గారు.

ఈ “పద్య కాదంబరి (అష్టోత్తర శతం)” పుస్తకం పద్యాల సమాహారం మాత్రమే కాదు—భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, నీతిశతకాలు, భక్తిసాహిత్యం, మరియు హాస్యం, తత్త్వం, చమత్కా రం కూడా. ఇవన్నీ ఒకే వేదికపై కనిపించే ధర్మనాటక మంజూష.

ఈ గ్రంథం లోని ప్రతి పద్యం భక్తి యొక్క శాంతి, నీతి యొక్క బలం, వేదాంతం యొక్క వెలుగు, 
సాహిత్యం యొక్క సౌరభం, జీవితం యొక్క గమ్యం , ఆధ్యాత్మికత యొక్క ఆనందం, ఆచరణ యొక్క ప్రయోజనాలను బోధిస్తాయి.

అంతేకాక - వేదాంతాన్ని మేలుకొల్పి, దేవుని దగ్గరికి   తీసుకెళ్లే దారిని చూపి, నడవాల్సిన మార్గం నేర్పి, జీవితానుభవాన్ని బోధించి, హృదయాన్ని పావనం చేస్తాయి.

ఈ గ్రంథంలో ఉన్న పద్యాలలో రచయిత్రి పాాండిత్యం, అనుభవం భక్తి స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె explanations చదివినపుడు అవి కేవలం అనువాదం కాదు - జీవితానుభవంతో వచ్చిన లోతైన అర్థవ్యాఖ్య. అందుకే ఈ పుస్తకం పాఠకుడి హృదయాన్ని మాత్రమే కాక, తన బుద్ధిని కూడా మేల్కొలుపుతుంది.

అందుకే నేనంటాను, ఈ గ్రంథం పాఠకునికి ఇస్తుం ది

ప్రతి పద్యంతో ఒక ఆధ్యాత్మిక జ్వాల
ప్రతి భావంతో ఒక నీతి శిక్షణ
ప్రతి శ్లోకంతో ఒక ధర్మబోధ
ప్రతి చమత్కా రంతో ఒక చింతన
ప్రతి వివరణతో వేదాంత బీజం
ప్రతి అక్షరంతో దైవానుభవం

            “పద్య కాదంబరి” అంటే కేవలం పద్యాల తోట కాదు —
             భక్తి పూదోట, వేదాంత ఫల వనం, నీతి వృక్షం , సా స్హిత్య మల్లెపూల మాలిక.

చివరగా
పద్యం ఒక దీపం, పఠనం ఒక మార్గం,
భక్తి ఒక పుష్పం, భావం ఒక యాగం.
విజయలక్ష్మి కలం నిండ దివ్య ప్రకాశం
పద్య కాదంబరి పాఠకునికి వరప్రసాదం.

కౌండిన్య శాస్త్రి




(ఈ పుస్తక ముద్రణకు దంపతులిద్దరు పార్వతీపరమేశ్వరుల్లా కార్తీకమాసంలో మా ప్రెస్ కి వచ్చినప్పుడు, అంతకుముందే అన్ని పద్యాలు, శ్లోకాలు వాట్సప్ లో చదవి ఉండడం వలన, ప్రింటు చెసి మంచి పనిచేస్తున్నా రు. వీలైతే ప్రతి స్కూ లులో తెలుగు ఉపాధ్యాయునికో లేదా తెలుగులో మొదటి ర్యాంకు వచ్చిన విదార్థికో ఒక పుస్తకం అందిస్తే బాగుంటుంది అన్నా ను, దానికి వారు అంగీకరించి నందుకు శతాధిక ధన్యవాదములు. )


***************************************************



పద్య కాదంబరి --- అష్టోత్తరశతం  

సేకరణ-విశ్లేషణ ... Dr. నందివాడ(భట్టిప్రోలు) విజయలక్ష్మి 


1
అలంకార ప్రియో విష్ణుః, 
అభిషేక ప్రియః శివః, 
నమస్కార ప్రియో సూర్యః, 
గణపతి స్తర్పణప్రియః. 

భావం: "అలంకారం చేస్తే విష్ణువుకి ఇష్టం. అభిషేకం చేస్తే శివుడికి ఇష్టం. నమస్కారాలు చేస్తే సూర్యుడికి ఇష్టం. తర్పణాలిస్తే గణపతికి ఇష్టం". విష్ణువు అలంకార ప్రియుడు. ఆయనకు ఎంత అలంకారం చేస్తామో అంతగా ప్రీతి చెందుతాడు. తన భక్తులు కూడా ఎప్పుడూ అలంకారం చేసుకుని ఉంటే చూడటం కూడా విష్ణువుకి ఒక ముచ్చట. ఈ రహస్యం తెలిసే, గోదాదేవి ధనుర్మాసంలో ముప్ఫయి రోజులూ రకరకాలుగా తనను తాను అలంకరించుకుని, విష్ణువుని మెప్పించి, విష్ణుపత్నియై, విష్ణు సాయుజ్యం పొందింది. శివుడు అభిషేకప్రియుడు. కాసిని నీళ్లు ఆయన మీద పోస్తే చాలు సంతోషించేస్తాడు. అల్పసంతోషి, శీఘ్రసంతోషీ కూడాను. ప్రయత్నించి చూడండి. భక్తీ, శ్రద్ధా మాత్రం ఆ నీటితో కలిపి అభిషేకం చెయ్యండి. సూర్యుడికి నమస్కారాలిష్ఠం. సూర్య నమస్కార భంగిమలన్నీ ఆరోగ్యాన్నీ, శరీరధృఢత్వాన్నీ ఇచ్చేవే. సూర్య కిరణాల నుంచి మనకు, మన చుట్టూ ఉన్న ప్రపంచానికీ పోషణ అందుతుంది. అందుకే సూర్యుణ్ణి పూషా అంటాం. మనకి హితకారి కనుక, సూర్యుడు మన సహజ మిత్రుడు. నమస్కారాలు చేస్తే, సంతోషపడి  ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు. గణపతికి తర్పణాలిస్తే ఇష్టం. గజముఖుడు కదా, నీటిలో జలకాలాడిస్తే మహా ఆనందపడిపోతాడు. గణపతి తృప్తి పడితే, విఘ్నములు రావు. రానివ్వడు.  విష్ణువును విశేషంగా అలంకరించండి. విష్ణుకటాక్షం పొందండి. ఆయన మెచ్చేలా మీరూ అలంకరించుకోండి. శివుడు తనివితీరా తడిసేలా రకరకాల ద్రవ్యాలతో, మీ చేతులతో అభిషేకం చేయండి. ఐశ్వర్యాన్ని పొందండి. సూర్యుడికి ఇష్టంగా నమస్కారాలు చేస్తూ, అర్ఘ్యమును ఇస్తూ ఆరోగ్యాన్ని పొందండి. గణపతిపై నీటిని చిలకరిస్తూ, తర్పణాలు ఇస్తూ సంతోషపెట్టండి. విఘ్నాలు నివారించుకోండి.  

***************************************************
2
ఐశ్వర్యం  ఈశ్వరాదిచ్ఛేత్ 
శ్రియమిచ్ఛేత్  హుతాశన 
ఆరోగ్యం  భాస్కరాదిచ్ఛేత్   
మోక్షమిచ్ఛేత్ జనార్దన. 

భావం: "ఐశ్వర్యాన్నిచ్చేది ఈశ్వరుడు. శ్రియమును ఇచ్చేది హుతాశనుడు, అంటే అగ్ని. ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు. మోక్షాన్నిచ్చేది జనార్దనుడు". ఐశ్వర్యం కావాలంటే శివుణ్ణి కోరండి. అందుకే శివుణ్ణి ఈశ్వరుడు అంటాం. శ్రియాన్ని కలుగచేసేది హోమాగ్ని లోనున్న హుతాశనుడు. అందుకే హోమం చేసిన తరువాత, శ్రియం దేహిమే హుతాశన అని ప్రార్థిస్తాం.  ఆరోగ్యాన్నిచ్చేది మాత్రం భాస్కరుడే. చక్కటి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఉదయ సూర్యుడికి నమస్కారాలు చేస్తాం. ఆ ఎండలో మనకు ఆరోగ్యాన్నిచ్చే కిరణాలు ఉంటాయి. ఇక చివరిగా అందరికీ కావలసినది మోక్షం. మోక్షం ఎవరికి వారే సంపాదించుకోవాలి. అటువంటి మోక్షాన్ని ఇచ్చేది మాత్రం జనార్దనుడే. అంటే శ్రీమన్నారాయణుడే.  ఓం నమో నారాయణాయ. 

***************************************************
3
వేదమూలమిదం జ్ఞానం,
కృషిమూలమిదం ధాన్యం, 
భార్యామూలమిదం గృహం, 
ధనమూలమిదం జగత్. 

భావం: "జ్ఞానానికి మూలం వేదం. ధాన్యానికి మూలం వ్యవసాయం. గృహానికి మూలం భార్య. ధనం ఈ జగత్తుకే మూలం". ఈ శ్లోకం నరసింహ సుభాషితం లోనిది. జ్ఞానం విద్య నుంచే వస్తుంది. విద్ అనే ధాతువు వేదం నుంచే వచ్చింది. వేదం నుంచే విద్య, విద్య నుంచే జ్ఞానం, కనుక జ్ఞానానికి మూలం వేదమే. కృషి అంటే సేద్యం చేస్తేనే కదా ధాన్యం వచ్చేది, అది తిని మనం బ్రతికేది, కనుక కృషి చెయ్యకపోతే, ధాన్యం రాదు, ధాన్యం లేకపోతే మనమూ ఉండము. కనుక ధాన్యానికి మూలం విపణివీధులు కావు, వ్యవసాయమే. భార్యని ఇలాలు, గృహిణి అంటారు. ఇంట్లో ఎంత మంది ఉన్నా ఇంటికి దీపం ఇల్లాలే. ఇంట్లో దీపం పెట్టేదీ ఆ ఇల్లాలే.  నాలుగు గోడలతో కడితే అది ఒక కట్టడం అవుతుందేమో కానీ, దానిని గృహంగా మార్చేది మాత్రం గృహిణే. కనుక గృహానికి భార్యయే మూలం. ఇక చివరి పాదంలో, ఎప్పటికీ పనికి వచ్చే ఒక గొప్ప సత్యం చెప్తున్నాడు కవి. ధనమే ఈ జగత్తుకంతా ఆధారం అని. 'డబ్బు లేనివాడు డుబ్బుకైనా కొరగాడు' అని సామెత. డబ్బుంటే గారు అంటారు, డబ్బు లేకపోతే గాడు అంటారు. అదీ లోకరీతి. కనుక నిస్సందేహంగా ఈ ప్రపంచానికి ధనమే మూలం.  

***************************************************
4
పత్రం పుష్పం ఫలం తోయం, 
యో మే భక్త్యా ప్రయచ్ఛతి,
తదహం భక్త్యుపహృతమ్, 
అశ్నామి ప్రయతాత్మనః. 

భావం: "భక్తుడు భక్తిగా ఇచ్చిన పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, తోయము అంటే జలము కానీ నేను స్వీకరిస్తాను" అని శ్రీమద్భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. ఈ శ్లోకం శ్రీమద్భగవద్గీత లోని రాజవిద్యా రాజగుహ్య యోగం అనే నవమ అధ్యాయం లోనిది. భక్తుడు శ్రద్ధాభక్తులతో ఏమి ఇచ్చినా స్వీకరిస్తాను అంటున్నాడు భగవానుడు. ఆఖరికి అది పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, తోయమైనా సరే, భేదమును చూపక భక్తితో సమర్పించిన దానిని నేను భుజిస్తాను అని భగవానుడు చెప్తున్నాడు అని ఈ  శ్లోకం అర్థం. 

***************************************************
5
లాలయేత్ పంచవర్షాణి, 
దశవర్షాణి దాసవత్ (తాడయేత్), 
ప్రాప్తేతు షోడశే వర్షే, 
పుత్రం మిత్ర వదాచరేత్. 

భావం: "పిల్లలని ఐదేళ్ల వరకు ముద్దుముద్దుగా లాలించి పెంచాలి. పదేళ్ల వరకూ తప్పు చేస్తే కాస్త దండన కూడా ఉండాలి. వారికి చిన్న చిన్న పనులు చేయడమూ నేర్పాలి. అదే పిల్లలకు పదహారేళ్లు వస్తే వాళ్ళను మిత్రుడు వలె చూడాలి" అంటోంది ఋషివాక్యం. పిల్లల పెంపకం ఏ వయసులో ఎలా ఉండాలో చెప్తోంది ఈ శ్లోకం. అనుసరిస్తే మంచిది. ఈనాటి మనస్తత్త్వశాస్త్రం కూడా అదే చెప్తుంది. 

***************************************************
6
ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్ష మెత్తగవలసెన్‌
దనవారి కెంత కలగిన
దనభాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ

భావం: ధనాధిపతి అయిన కుబేరుడు తనకు మంచి స్నేహితుడైనప్పటికీ, శివుడికి బిక్షమెత్తడం తప్పలేదు. అలాగే, మన బంధుమిత్రులకు ఏమి వున్నా, ఎంతవున్నా, మన దగ్గర వున్న సొత్తే మనది కానీ, ఇతరుల దగ్గర వున్న సొమ్ము మనది ఎప్పటికీ కాదు. ఇది సుమతీ శతకంలో బద్దెన, చెప్పిన నీతి పద్యం. మనకు ఎంతో ఆత్మీయులైన వారి దగ్గర ఏమి వున్నా, ఏది వున్నా, అది మనది ఎప్పటికీ కాదు. అది స్వయంగా వారు ఇస్తే తప్ప దానిని అనుభవించకూడదు. ఒకసారి వారు ఇచ్చాక, ఆ వస్తువు మనది అయిపోతుంది కనుక, దానిని వాడుకోవచ్చు. పరుల సొత్తుపై వ్యామోహం వద్దు అని సుమతీ శతకకారుడు హెచ్చరిస్తున్నాడు. నిజానికి కుబేరుని ధనాధిపతిని చేసింది సాక్షాత్తూ ఈశ్వరుడే. అయినప్పటికీ కుబేరుని సొత్తు శివునిది కాదు అంటున్నాడు కవి. ఎందుకంటే శివుడు ఆ అధికారాన్ని కుబేరునికి ఇచ్చేశాడు కదా. అంటే, ఒకసారి పరులకు ఇచ్చివేశాక ఆ వస్తువుపై ఇక ఇచ్చినవారికి హక్కు లేదు. 

***************************************************
7
కృషితో నాస్తి దుర్భిక్షం 
జపతో నాస్తి పాతకం 
మౌనేన కలహం నాస్తి 
నాస్తి జాగరతో భయం.  

భావం: "కృషి అంటే వ్యవసాయం చేస్తే దుర్భిక్షం, కరువు ఉండదు. కేవలం వ్యవసాయమే కాదు, ఏ పనైనా సరే చక్కగా చేస్తే ఆ విషయంలో లోటు ఉండదు. పాతకాలు అంటే మహాపాపాలు కూడా జపం చేస్తే నశిస్తాయి. అలాగే మౌనంగా ఉంటే కలహాలే రావు. చివరిగా ఎప్పుడూ మేలుకొని, అంటే జాగరూకతతో ఉండేవారికి భయమే ఉండదు". వ్యవసాయం వలననే ఆహారం దొరుకుతుంది కనుక, సేద్యం చేస్తూ ఉంటే కరువులు రావు. నిత్యం జపం చేస్తూ ఉంటే మహా మహా పాతకాలే ఆ జపాగ్నిలో భస్మం అయిపోతాయి. మౌనంగానే, మితభాషణం చేస్తే తగవులు వచ్చే అవకాశమే ఉండదు. అదేవిధంగా ఎప్పుడూ అన్నీ గమనిస్తూ, మెలకువగా ఉండేవాడికి భయమే ఉండదు. ఇది మన ఋషులు చెప్పిన ఒక సూక్తి. 

***************************************************
8
శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతం
శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః

భావం: శోకిస్తూ కూర్చుంటే ధైర్యము కోల్పోతాం. నేర్చిన జ్ఞానం కోల్పోతాం. శోకము అన్నిటినీ నాశనం చేస్తుంది. కనుక శోకము కన్నా శత్రువు లేడు. 

కోపో నాశయతే ధైర్యం కోపో నాశయతే శ్రుతం
కోపో నాశయతే సర్వం నాస్తి కోప సమో రిపుః

భావం: కోపము వలన ధైర్యము కోల్పోతాం. నేర్చిన జ్ఞానం కోల్పోతాం. కోపము అన్నిటినీ నాశనం చేస్తుంది. కనుక కోపము కన్నా శత్రువు లేడు. 

సుమతీశతకంలో దీనినే తన కోపమే తన శత్రువు అని చెప్పాడు సుమతీ శతక కారుడు 

తన కోపమే తన శత్రువు 
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ 
తన సంతోషమె స్వర్గము 
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ !

భావం: ఎవరి కోపం వారికే శత్రువు, ఎవరి శాంతం వారికి రక్ష. ఇతరుల పట్ల చూపించే దయనే వారి చుట్టం. ఎవరి సంతోషం వారికి స్వర్గం. ఎవరి దుఃఖం వారికి నరకం. కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోండి. దుఃఖాన్ని నివారించుకోండి. శాంతంగా ఉండండి, దయగా ఉండండి, సంతోషంగా ఉండండి.

***************************************************
9
ఆచార్యాత్ పాదమాదత్తే 
పాదం శిష్యః స్వమేథయా 
పాదం సబ్రహ్మచారిభ్యః 
పాదం కాలక్రమేణ చ 

భావం: "మొత్తం విద్యను నాలుగు భాగాలనుకుంటే, పావు భాగం గురువు నేర్పిస్తాడు. పావుభాగం శిష్యుడు తన బుద్ధి వివేకంతో ఆలోచించి తర్కించి నేర్చుకోవాలి. మరొక పావుభాగం సహ విద్యార్ధులతో చర్చలు జరిపి నేర్చుకోవాలి. మిగిలిన పావుభాగం జీవితంతో తనకెదురైన అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు".  మహాభారతం లోని ఉద్యోగపర్వం లోని శ్లోకం ఇది. ఎంత ధీమంతులైనా జీవితపర్యంతం విద్యార్థులే అంటోంది ఈ శ్లోకం. కొంత గురువు నేర్పిస్తే, కొన్ని తోటి విద్యార్థులతో కలసి నేర్చుకుంటే, ఇంకొన్ని తనంతట తానే నేర్చుకుంటాడు విద్యార్థి. ఎంత నేర్చినా, ఎప్పటికీ ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఆ విద్యను జీవితాంతం తనకు ఎదురైన సంఘటనలు, సందర్భాల ద్వారా నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు నేర్చుకోవడం మానేస్తామో, అప్పుడు ఆ జీవనయానం ముగిసినట్లే. అన్నీ నేర్చేసుకున్నాను అని అనుకునేవాడు అజ్ఞాని. నేర్చుకున్నది కొంత, నేర్చుకోవాల్సినది ఎంతో అని గ్రహించిన వాడు జ్ఞాని. 

***************************************************
10
పసరంబు పంజైన బసులకాపరి తప్పు. ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు. 
భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు. తనయుడు దుష్టయిన తండ్రి తప్పు. 
సైన్యంబు చెదిరిన సైన్యనాథుని తప్పు. కూతురు చెడుగైన మాత తప్పు. 
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు. దంతి దుష్టయిన మావంతు తప్పు. 
ఇట్టి తప్పులెరుంగక ఇచ్చ వచ్చినటుల, మెలగుదురిప్పుడీ యవని జనులు.
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! దుష్టసంహార! నరసింహ దురితదూర!"

భావం: 'పశువు సరిగా పని చేయకపోతే పశులకాపరిదే తప్పు. ప్రజలు చెడ్డవారైతే పాలకునిది తప్పు భార్య గయ్యాళిదైతే భర్తదే తప్పు. కొడుకు దుష్టుడైతే తండ్రి తప్పు, సైన్యము బెదరి చెదిరితే సైన్యాధిపతి తప్పు. కూతురు చెడిపోతే తల్లి తప్పు. గుర్రం మాట వినకుంటే దానిని ఆరోహించిన వానిదే తప్పు. ఏనుగు దుష్టు అయితే మావటి తప్పు. జనులు తమ తప్పులు ఇన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వుంటున్నారు", అని ధర్మపురి నివాసుడైన నరసింహునితో చెప్తున్నాడు కవిశేషప్ప. పశులకాపరి తన పశువులను చెప్పుచేతలలో ఉంచుకోలేకపోతే ఆతనికి పశుపాలన చేతకానట్లే.  ప్రభువాజ్ఞ మీరి ప్రజలు ప్రవర్తిస్తుంటే, ఆ రాజుకు రాజ్యపాలన రానట్లే. సైన్యం తాను ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోతే, ఆ సైన్యాధిపతిదే చేతకానితనం. భార్యను తన మాట వినేలా చేసుకోలేని భర్త, కొడుకు తండ్రి మాట మీరి తిరుగుతుంటే ఆ తండ్రి, తల్లి మాటను  లెక్కించని కూతురున్న ఆ తల్లి కూడా పనికిరానివారే. గుర్రం రౌతు మాట వినకుంటే ఆ రౌతుదే దోషం. తన సూచనల్ని పట్టించుకోని ఏనుగు ఉన్న మావటి కూడా అంతే. జనం ఇన్నిన్ని రకాలైన తప్పులను తమలో పెట్టుకుని, వాటిని సరి చేసుకోకుండా జీవనం సాగించేస్తున్నారు. ఓ ధర్మపురి నరసింహా, కాస్త చూడవయ్యా అంటున్నాడు ఈ పద్యంలో కవిశేషప్ప.  

***************************************************
11
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.   

భావం: ఎవరైనా తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వారి మధ్య చక్కని స్నేహం కొనసాగుతుంది. ఎపుడయితే ఆ హద్దులు దాటుతారో ఆ మిత్రులే శత్రువులుగా మారతారు. ఉదాహరణకు "కమలము నీటిలో ఉన్నప్పుడే సూర్యకాంతికి వికసిస్తుంది. ఎపుడైతే నీటిలో నుంచి బయటకు వస్తుందో ఆ ఎండకే అది వాడిపోతుంది. నీటిలో ఉన్నప్పటి మిత్రుడే బయటకు రాగానే శత్రువు వలె పువ్వు వాడిపోవడానికి కారణం అవుతున్నాడు". కనుక ఎంత స్నేహితులైనా కూడా హద్దులు చూసుకుని మెలగాలి అని సుమతీ శతకకారుడు చెప్తున్నాడు. ద్రోణుడు, ద్రుపదుడు బాల్యంలో గురుకులంలో సహాధ్యాయులు. కానీ పెరిగి పెద్దవారైన తరువాత, తమ తమ స్థితిగతులలో ఏర్పడిన అంతరాల వలన స్నేహం పోయి శత్రుత్వం ఏర్పడింది. ఎంత మిత్రుడైనా, మన తాహతు చూసుకుని, పరిస్థితులను గమనించి, అప్పటి సందర్భాన్ని అర్థం చేసుకుని మెలిగితే మంచిది.  

***************************************************
12
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః 
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ 

భావం: "సమస్త జీవుల ఉదరములలోను నేను వైశ్వానరుడనే జఠరాగ్నివలె ఉండి, వారు భుజించే ప్రాణ, అపానములతో కూడిన భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములనే నాలుగు రకములైన ఆహారమును జీర్ణము చేస్తున్నాను." ఇది గీతా వాక్యం. భోజనం చేసే ముందు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తున్న ఆ భగవానుడికి నమస్కరిస్తూ ఈ శ్లోకం స్మరిస్తే మంచిది. ప్రతిజీవికి కడుపులో ఒక అగ్నిహోత్రం ఉంటుంది. అదే జఠరాగ్ని. అందుకే తెలిసో, తెలియకో, ఆకలి వేస్తే, కడుపు కాలిపోతోంది, కడుపు మండిపోతోంది అంటూ ఉంటాం. ఆ జఠరంలో ఉండే అగ్నిహోత్రుడే వైశ్వానరుడు. గీతాచార్యుడు చెప్తున్నాడు, మీరు తినే అన్ని రకములైన ఆహారాన్ని జీర్ణము చేసి, దానిని శక్తిగా మార్చి అందించేది నేనే అని. ఈ శ్లోకం శ్రీమద్భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమనే  పంచదశోధ్యాయములో ఉన్నది. 

***************************************************
13
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ 
న బ్రూయాత్ సత్యమప్రియం 
ప్రియంచ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతనః 

భావం: "సత్యమే పలుకు. ప్రియమే పలుకు. అప్రియమైన సత్యాన్ని పలుకకు. ప్రియం కదా అని అసత్యం పలుకకు. ఇదే సనాతనధర్మం", అని మనుస్మృతి చెప్తోంది. ఈ శ్లోకం చూస్తూ ఉంటే, మనువు మనుష్యులను ఎంత విశ్లేషించి మనుస్మృతిని చెప్పాడో కదా అనిపిస్తుంది. మనిషికి కేవలం ప్రియమైనవే కావాలి. ప్రేయస్సు, శ్రేయస్సు అనేవి రెండు విషయాలు. మనశ్శరీరాలకు ప్రియమైనవి ప్రేయస్సైతే, మనిషికి అసలైన హితమునును చేకూర్చేది శ్రేయస్సు. సత్యం ఇచ్చేది శ్రేయస్సేతే, ప్రియం కూర్చేది ప్రేయస్సు. మనిషికి ఎప్పుడూ ప్రీతి కూర్చే మాటలే కావాలి, కనుక సత్యమే చెప్పు, ప్రియమే చెప్పు, సత్యమైనా సరే, అప్రియమైన మాటలు చెప్పకు అంటున్నాడు మనువు. 
 
***************************************************
14
"సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః, 
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః"

భావం: "ఓ రాజా, నిత్యమూ నీకు ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా దొరుకుతారు. కానీ అప్రియమైనా పథ్యమైన మాటలు చెప్పేవారూ, వినేవారూ కూడా దొరకటం కష్టం". ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ ప్రారంభంలో, సీతను రాముడికి ఇచ్చేయమని చెప్తూ విభీషణుడు రావణుడితో అంటాడు. ప్రేయస్సును కూర్చే మాటలు, అంటే మెచ్చుకోలు మాటలు చెప్పేవారు, వాటిని విని ఆనందించేవారూ కొల్లలు. కానీ శ్రేయస్సును కూర్చే మాటలు అప్రియమైనవైతే చెప్పేవారూ భయపడో, మౌనంగా ఉండో చెప్పరు. అలాగే అటువంటి హితకరమైన, అప్రియమైన మాటలు వినేవారూ వినడానికి ఇష్టపడరు. అంటే, ఎప్పుడూ పొగడ్తలనే వినేవారు, విమర్శలను తట్టుకోలేరు. 

***************************************************
15
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ 
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః 

భావం: "ఎవరైనా తమ ఆత్మను తామే ఉద్ధరించుకోవాలి. అంతేకానీ ఆత్మను దిగజారనీయకూడదు.
అంటే ఆత్మను పతనం కానివ్వరాదు. ఆత్మకు ఆత్మే మిత్రుడు, శత్రువు కూడా". ఈ వాక్యాలు శ్రీమద్భగవద్గీతలో ఆత్మసంయమయోగంలో గీతాచార్యుడు చెప్పాడు. ప్రతివారికీ మనస్సు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి కష్టమైనా ధర్మం వైపు వెళ్ళమంటే, మరొకటి తేలిక కనుక అధర్మం వైపుకి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. అందుకే మన ఆత్మ మనకే ఒక్కోసారి మిత్రుడు, ఒక్కోసారి శత్రువు అవుతోంది. కష్టమైనా నిలబడి ఋజుమార్గంలో, ధర్మమార్గంలో నడిస్తే మనల్ని మనమే పతనం కాకుండా కాపాడుకుని ఉద్ధరించుకుంటాం. మనస్సుని నియత్రించుకుంటే ఆత్మోద్ధరణ, లేకపోతే ఆత్మపతనం. ఈ ప్రక్రియలో ప్రతివారూ తమను తామే నిలబెట్టుకోవాలి. ఏ దేవుడైనా, ఏ గురువైనా ఆ మార్గం వరకూ దారి చూపిస్తారే కానీ, ఆ మార్గంలో స్థిరంగా నడవాల్సింది మాత్రం ఎవరికి వారే. అందుకే "ఉద్ధరేదాత్మనాత్మానం" అన్నాడు గీతాచార్యుడు.

***************************************************
16
అతి దానాత్ హతః కర్ణః 
అతి లోభాత్ సుయోధనః 
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్ 

భావం: "అతిగా దానం చేసి కర్ణుడు, మితిమీరిన లోభంతో దుర్యోధనుడు, అతి కామంతో రావణుడు ప్రాణాలు కోల్పోయారు". అందుకే అతిని ఎప్పుడూ వదిలెయ్యాలి. అడిగినవాడికి లేదనకుండా ఇవ్వాలనే అతి దాన గుణాన్ని వదులుకోలేని కర్ణుడు తన తండ్రి యైన సూర్యభగవానుడి వరంగా పుట్టుకతో ఇచ్చిన సహజ కవచ కుండలాలు వదులుకున్నాడు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయాడు. దుర్యోధనుడు అన్నీ తనకు మాత్రమే కావాలనే విపరీతమైన లోభంతో, తనది కాని రాజ్యాన్ని అతి లోభంతో కోరుకుని తదనంతరం జరిగిన యుద్ధంలో తన ప్రాణాలే కాక, తనతో ఉన్న అందరి మరణానికీ కూడా కారణమయ్యాడు. కోరిన ప్రతి స్త్రీ పొందూ తనకు కావాలనే మితిమీరిన కామం వలన రావణుడు సీతను అపహరించి రాముడి చేతిలో మరణించాడు. అందుకే ఎప్పుడూ అతిగా పోకూడదు. అతి పనికిరాదు, పైగా ప్రాణాంతకం. కనుక అతిని ఎప్పుడూ వర్జించాలి.
ఈ శ్లోకానికే మరో పాఠాంతరం కూడా ఉంది.
అతి దానాత్ బలిర్నష్టః,
అతి మానాత్ సుయోధనః,
అతి కామాత్ దశగ్రీవః,
అతి సర్వత్ర వర్జయేత్.
భావం: "అతిగా దానం చేసి బలిచక్రవర్తి, మితిమీరిన అభిమానంతో దుర్యోధనుడు, అతి కామంతో రావణుడు ప్రాణాలు కోల్పోయారు". అందుకే అతిని ఎప్పుడూ వదిలెయ్యాలి.     

***************************************************
17
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః 
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః 
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ 
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ 

భావం: "ప్రాణులన్నీ అన్నము వలననే జీవిస్తున్నాయి. ఆ అన్నము మేఘము వలన వస్తున్నది. ఆ మేఘము యజ్ఞము వలన ఏర్పడుతున్నది. ఆ యజ్ఞము కర్మ వలన జరుగుతున్నది. ఆ కర్మలు వేదములో చెప్పబడినవి. ఆ వేదములు పరమాత్మ చేత చెప్పబడినవి. అందువలన యజ్ఞములో పరమాత్మయే ప్రత్యక్షంగా వున్నాడు". ఈ శ్లోకములు శ్రీమద్భగవద్గీతలో కర్మయోగంలో భగవానుడే స్వయంగా చెప్పాడు. యజ్ఞములన్నీ ఆ పరమాత్మ సాక్షి గానే, ఆ పరమాత్మ సమక్షం లోనే జరుగుతున్నాయి. ఆ యజ్ఞముల విధివిధానములు గురించి కూడా ఆ పరమాత్మే వేదముల ద్వారా చెప్పాడు. ఆ వేదములలో చెప్పిన విహిత కర్మల ఆధారంగానే యజ్ఞములు నిర్వహించ బడుతున్నాయి. అటువంటి వేదవిహితములైన యజ్ఞముల వలన మేఘములు ఏర్పడి, అవి వర్షిస్తున్నాయి. ఆ వర్షముల వలన పంటలు పండి జీవులన్నిటికీ అన్నము అందుతున్నది. ఆ అన్నము తిని జీవులన్నీ జీవిస్తున్నాయి. కనుక వేదవిహితములైన యజ్ఞకర్మల వలన జీవులకు ఆహారము అందుతోంది. ఆ ఆహారము వలన పొందిన శక్తి వలన మిగిలిన అన్ని కార్యములూ చేయగలుతున్నాము. ఉదాహరణకు అన్నము తినడం ఒక యజ్ఞం. ఆ యజ్ఞం వలన కడుపులో వున్న వైశ్వానరుడనే జఠరాగ్ని తృప్తి చెంది, ఆ యజ్ఞఫలితాన్ని మనకు అందిస్తున్నది. తద్వారా రక్తమాంసములు, శుక్లశోణితములు ఏర్పడి జీవనచక్రము ముందుకు సాగుతున్నది.

***************************************************
18

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః 
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి
నీతిశతకం---భర్తృహరి

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై,
యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్,
ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై,
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞా నిథుల్ గావునన్ 
తెలుగు అనువాదం---ఏనుగు లక్ష్మణకవి 

భావం: "అధములు ఎప్పుడు ఏవిఘ్నాలు వస్తాయో అని భయంతో అసలు ఏపనినీ మొదలే పెట్టరు. మధ్యములు పనిని మొదలుపెడతారు కానీ, విఘ్నాలు ఎదురుకాగానే ఆ పనిని ఆపేస్తారు. ఇక ధీరులైనవారు ఎన్ని విఘ్నాలు వచ్చినా దాటుకుంటూ, ఆ ఆటంకాలని పరిష్కరించుకుంటూ, రెట్టించిన ఉత్సాహంతో పనిని దిగ్విజయంగా పూర్తిచేస్తారు". ఈ సంస్కృత శ్లోకం భర్తృహరి తన నీతిశతకంలో చెప్పాడు. మనుష్యులలో అధములు, మధ్యములు, ధీరులు అని మూడు రకాలు వుంటారు. వారి లక్షణాలు ఇవి అని భర్తృహరి చెప్పాడు. అవే శ్లోకాలను తెలుగులోకి ఏనుగు లక్ష్మణకవి చాలా సరళంగా అనువదించాడు. అధములు ఎక్కడ పని ఆగిపోతుందో అనే సాకు చూపి, ఏపనీ చెయ్యకుండా పరాన్నభుక్కులై జీవితం గడిపేస్తారు. మధ్యములు వారికన్నా కొంచెం నయం. వారు కొద్దిసేపు పనిచేసి, అడ్డంకి ఏదైనా రాగానే ఆ పని ఆపేసి చతికిలబడతారు. కానీ ధీరులు ప్రజ్ఞానిధులు కనుక, వారికి ఎదురైన విఘ్నాలను చూసినా ఏ భయమూ లేకుండా, వాటిని ఉత్సాహంతో ఎదుర్కొని ఆ విఘ్నాన్ని  పరిష్కరించి ఆ పనిని సాధించి గెలుస్తారు.

***************************************************
19
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః 
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ 

భావం: "మనుష్యులందరు వారి వారి గుణ, కర్మలను అనుసరించి నాలుగు వర్ణములుగా విభజించబడ్డారు. వారిని నేనే ఆ విధంగా విభజించినా, ఆ కర్మకు సనాతనుడైన నేను కర్తను కాను", అని భగవానుడు శ్రీమద్భగవద్గీతలో జ్ఞానయోగంలో చెప్పాడు. గుణాలు మూడు, సత్వ, రజో, తమో గుణాలు. ఈ మూడు గుణములను బట్టి మనుష్యులు వివిధ కర్మలు చేస్తూ వుంటారు. కేవలము సత్వగుణమే కలవారు శాంతి, ఇంద్రియనిగ్రహం కలిగి వుండి, జపము, తపము, బోధన వంటి పనులు చేస్తూ వుంటారు. వీరు మొదటి వర్ణము వారు. వీరిని బ్రాహ్మణులు అంటారు. అంటే ఈ లక్షణములు వున్నవారినే బ్రాహ్మణులు అంటారు, అని శ్రీమద్భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. సత్వగుణము కొద్దిగా, రజోగుణం ఎక్కువగా వున్నవారు రెండవ వర్ణం వారు. వీరిని క్షత్రియులని అంటారు. వీరు ధైర్యము, శౌర్యము, సాహసముతో, పాలన చేయగలిగే శక్తి సామర్ధ్యములను కలిగి వుంటారు. కనుక ఈ లక్షణములు ఎవరిలో ఉన్నవో వారే క్షత్రియవర్ణం వారు. సత్వగుణము కొద్దిగా, రజోగుణము, తమోగుణము కూడా  వున్నవారు మూడవ వర్ణం వారు. వీరిని వైశ్యులంటారు. వీరు వాణిజ్యము, వ్యవసాయము చేస్తూ, పశుపాలన, ముఖ్యంగా గో సంరక్షణ చేస్తూ వుంటారు. ఈ లక్షణములు కలవారు వైశ్యులు అని గీతాచార్యుడు చెప్పాడు. ఇక నాలుగవవర్ణం వారైన శూద్రులు రజోగుణము తక్కువగా, తమోగుణము ఎక్కువగా కలిగి వుండి, ఇతర సేవా కార్యక్రమాలను చేస్తూ వుంటారు. ఈ విధంగా మనుష్యులను వారి వారి గుణము, కర్మములను బట్టి నాలుగు వర్ణములుగా తానే  విభజించినప్పటికీ, తాను సనాతనమైన పరబ్రహ్మము కాబట్టి, ఆ కర్మకు తాను కర్తను కాను అని గీతాచార్యుడు అంటున్నాడు. అంటే పరమాత్మకు ఏ కర్మలూ అంటవు, ఏ గుణములూ వుండవు. మొత్తం మీద అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ నాలుగు వర్ణాలు నాలుగు రకాలైన లక్షణాలు కల వ్యక్తులు అని. ప్రతివారు తమలో ఏ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయో గమనించుకుని తమని తాము ఆ వర్ణం వారు అని గుర్తించాలి. అంతేకాదు, తమను తాము నియంత్రించుకుంటే, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే శాంతి, సహనము అలవరచుకుంటే, విశ్వామిత్రుడి వలె వర్ణమును కూడా మార్చుకోగలుగుతారు. కానీ ఈ మూడుగుణములూ కూడా జీవనం కొనసాగించడానికి ఎంతో అవసరం. ఏ గుణము ఉపయోగము ఆ గుణానిదే.  భగవంతుని సృష్టిలో నిరర్ధకమైనది ఏదీ లేదు.

***************************************************
20
సీసము:
కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగ,
నురికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల,
చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార,
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ,
తేటగీతి:
కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువుమర్జునాయంచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు

భూమిక: కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. భీష్ముడు అర్జునుడు మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. కురువృద్ధుడైన భీష్ముడు విజృంభించి బాణాలు సంధిస్తున్నాడు. ఆ బాణవృష్టి అర్జునుడినే కాకుండా ఒక్కోసారి రథసారథి యైన శ్రీకృష్ణుడినీ తాకుతున్నాయి. దానితో కృష్ణుడికి కోపం వచ్చింది. ఆయుధం పట్టను, సారథ్యం మాత్రమే చేస్తాను అని ముందే చెప్పిన శ్రీకృష్ణుడు చేతిలో చక్రం పట్టుకుని కోపంతో, "ఈ భీష్ముడిని చంపేసి నిన్ను కాపాడతాను అర్జునా", అంటూ రథం పైనుంచి కిందకు దూకాడు. ఈ సన్నివేశం పోతన రాసిన భాగవతం లోనిది. ఈ పద్యం ముందు జరిగిన సన్నివేశం అది. ఇప్పుడు పద్యభావం చెప్పుకుందాం. 
భావం: ఒక్కసారి వేగంగా ఊపిరి బిగబట్టి రథం మీద నుంచి దూకుతున్నపుడు, శ్రీకృష్ణుని కర్ణ కుండలాలు వేగంగా ఊగాయి. వాటి కాంతి ధగద్ధగాయమానంగా ఆకాశమంతా విస్తరించింది. వేగంగా దూకడం వలన ఉదరం అంతా కదిలి, కడుపు లోపల వున్న జగత్తులన్నీ అల్లల్లాడిపోయాయి. చక్రం పట్టుకుని దూకే హడావుడిలో భుజం పైనుంచి పీతాంబరం కాస్త జారింది. "మాట తప్పద్దు కృష్ణా, యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను అన్నావు. నా శక్తి మీద నాకు నమ్మకం వుంది. నన్ను నగుబాటు చెయ్యకు" అంటూ అర్జునుడు కూడా ఆ వెనుకే రథం దిగి శ్రీకృష్ణుని బ్రతిమాలుతున్నాడు. అప్పుడు భీష్ముడికి శ్రీకృష్ణుడు, ఏనుగు మీదకు ఆవేశంగా దూకబోతున్న సింహం వలె కనిపించాడు. "ఏమైనా సరే, ఈనాడు భీష్ముడిని చంపి నిన్ను రక్షిస్తాను అర్జునా" అంటూ ముందుకు ఉరుకుతున్నాడు కృష్ణుడు. ఇది చూసి, "ఆ జగన్నాథుని చేతిలో మరణించడం కన్నా ఉత్తమమరణం ఏముంటుంది. ఆ దేవదేవుడే దిక్కు నాకు" అని భీష్ముడు అస్త్రాలు వదిలేసి, చకచకా రథం దిగి శ్రీకృష్ణుడి ముందు కైమోడ్చి, మోకాళ్లపై కూర్చుని నమస్కరించాడు, "దేవాదిదేవా, నీవే దిక్కు" అంటూ. ఈ సీస, తేటగీతి పద్యాల భావం ఇది. భీష్ముడికి తండ్రి శంతనుడు ఇచ్ఛామరణ వరం ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికీ ఇటువంటి వరం లేదు. మరణాలు నియంత్రించే విద్య ఇంకా మనకు అందలేదు. ప్రకటన కాస్త ముందో, వెనుకో చేయచ్చేమో కానీ, మరణాన్ని నియంత్రించలేము. అయినప్పటికీ శంతనుడు పుత్రవాత్సల్యంతో ఈ వరం భీష్ముడికి ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు స్వయంగా పరమాత్మ కనుక, ఈ వరం భీష్ముడికి ఉపయోగపడకుండా చూడాలి, లేకపోతే, ఇప్పుడే నా చేతిలో మరణిస్తే, ఈ అష్టమ వసువు తన పాపపుణ్యాల ఋణం తీర్చడానికి తిరిగి జన్మ ఎత్తాలి కదా, అని ఆలోచించి, అర్జునుని ప్రార్థనకు తగ్గినట్టు నటిస్తూ, నిదానపడ్డాడు. కానీ భీష్ముడయితే శ్రీకృష్ణుడి చేతిలో మరణం కావాలన్న కోరికను ప్రకటించి, తన ఇచ్ఛామరణ వరాన్ని వాడేసుకున్నాడు. ఎవరికీ లేని ఇటువంటి వరాన్ని, భీష్ముడికి పనికి రాకుండా చేయడానికి గాను ఇది అంతా శ్రీకృష్ణుడు చేసిన లీల కావచ్చు. మొత్తానికి తన తండ్రి శంతనుడిచ్చిన వరాన్ని భీష్ముడు వాడుకున్నప్పటికీ అది నిష్ప్రయోజనం అయింది. అంతా శాంతపడ్డాక తిరిగి ముగ్గురూ యధావిధిగా తమ తమ స్థానాలకు వెళ్లి యుద్ధం కొనసాగించారు. తరువాత భీష్ముడు అంపశయ్యపై చాలా బాధను అనుభవించి, అంత బాధ తాను  తనకు ఎందుకు అనుభవించవలసి వచ్చిందో చెప్పాడు కూడా.

***************************************************
21
అమంత్రం అక్షరం నాస్తి, 
నాస్తి మూలమ్ అనౌషధమ్, 
అయోగ్యః పురుషో నాస్తి, 
యోజకః తత్ర దుర్లభః

భావం: "మంత్రం కాని అక్షరం లేదు. ఔషధం కాని వేరు లేదు. అయోగ్యుడైన వ్యక్తి లేడు. కానీ ఏ అక్షరం ఏ మంత్రమో, ఏ వేరు దేనికి ఔషధమో, ఏ వ్యక్తి దేనికి యోగ్యుడో, గుర్తించే సామర్ధ్యం కల వ్యక్తి  దొరకడం మాత్రం ఎంతో కష్టం". అక్షరము అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షరాలన్నీ మాతృకా వర్ణాలే. కనుక ప్రతి అక్షరమూ మంత్రమే. అదేవిధంగా ఈ భగవంతుని సృష్టిలో ఉన్న ఏ ఒక్క వనస్పతీ వ్యర్థము కాదు. అన్నీ ఏదో ఒక వ్యాధికి ఔషధముగా పనికి వచ్చేవే. అలాగే, ఏ వ్యక్తీ అయోగ్యుడు కాదు. ప్రతివారూ ఏదో ఒక కార్యానికి ఉపయోగపడేవారే. అందరూ కారణజన్ములే, కాకపోతే ఆ కారణాలే వేర్వేరు. కానీ అసలు కష్టమైన విషయం ఏమిటంటే, అక్షరమే మంత్రమని, ప్రతి వేరూ ఔషధమని, ప్రతి వ్యక్తీ యోగ్యుడని గుర్తించి, వాటిలో ఆ యా ప్రత్యేకతలను గుర్తించే మనుష్యులే అరుదు.  

***************************************************
22
సహసా విదధీత న క్రియాం
అవివేకః పరమాపదాం పదమ్ 
వృణుతే హి విమృశ్యకారిణం
గుణలుబ్ధాః స్వయమేవ సంపదాః 
 
భావం: "ఏపనీ తొందరపడి చేయకూడదు. అలా తొందరపడే అవివేకులకు పెద్ద పెద్ద ఆపదలు కలుగుతాయి. కనుక తొందర పడకుండా విషయాన్ని చక్కగా విమర్శపూర్వకంగా తరచి చూసి ఏ పనైనా చేయాలి. అటువంటి తెలివైన వాణ్ణి సంపదలు వాటంతట అవే వరించి చేరతాయి". ఈ శ్లోకం మహాకవి భారవి రాసిన కిరాతార్జునీయం లోనిది. ఈ శ్లోకం వెనుక ఒక చిన్న కథ ఉంది. తనను ఏనాడూ పొగడని తండ్రి మీద క్రోధంతో, తన తండ్రినే బండరాయితో మోది చంపాలనుకుంటాడు భారవి. బిడ్డలని పొగిడితే వారికి ఆయుక్షీణమని, తండ్రి తనను పొగడలేదని తెలుసుకున్న తరువాత పశ్చాత్తపంతో, తండ్రి ఇచ్చిన శిక్షను స్వీకరించి కొన్నాళ్ళు తన అత్తవారింట్లో ఉంటాడు. ఆ రోజుల్లో, డబ్బు అవసరం వచ్చి, తాను రచిస్తున్న కిరాతార్జునీయం అనే గ్రంధం నుంచి ఈ శ్లోకాన్ని ఒక వైశ్యుడికి తాకట్టు పెడతాడు. కొన్నాళ్ల తరువాత ఆ వైశ్యుడు ఒకసారి తొందరపడి, తన భార్యను అపార్థం చేసుకుని, తన పుత్రుడిని వధించబోతాడు. ఆ సమయంలో ఈ శ్లోకం కంటపడి, ఆవేశంలో కొడుకుని చంపకుండా నిలకడగా వివరం తెలుసుకుంటాడు. ఆ కృతజ్ఞతతో భారవికి సన్మానం చేసి, కానుకలిచ్చి ఋణం తీర్చుకుంటాడు. ఓ ప్రాణాన్ని కాపాడిన ఘనత ఈ శ్లోకానిది. 

***************************************************
23
దేహో దేవాలయః ప్రోక్తో
జీవో దేవ స్సనాతనః 
త్యజేదజ్ఞాన నైర్మాల్యం 
సోహం భావేన పూజయేత్. 

భావం: "భాగవతుడు, అంటే భక్తుడు, తన దేహాన్నే దేవాలయంగా భావించాలి. అంతేకాదు, తనలో ఉన్న జీవుడే సనాతనమైన భగవత్ స్వరూపమని గ్రహించాలి. పూజా నిర్మాల్యమే అజ్ఞానం అని తెలుసుకోవాలి. ఆ అజ్ఞానమనే నిర్మాల్యాన్ని వదిలి, పరమాత్మను, నీవే నీను అనే అద్వైత  భావంతో పూజించాలి". ప్రతివ్యక్తీ తన దేహాన్నే ఆ భగవంతుడు కొలువున్న దేవాలయమని తెలుసుకోవాలి. తనలో ఉన్న జీవుడే సాక్షాత్తూ ఆ భగవంతుడని అర్థం చేసుకోవాలి. తన అజ్ఞానమే భగవత్ నిర్మాల్యమని గ్రహించి ఆ అజ్ఞానమనే నిర్మాల్యాన్ని వెంటనే వదిలేసుకోవాలి. జీవుడే దేవుడనే సత్యం తెలుసుకుని పూజించుకోవాలి. 

***************************************************
24
భరతఖండంబు చక్కని పాడియావు 
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి 

భావం: "చక్కగా పాలిచ్చే గోమాత పాల కోసం లేగదూడలు అంబా అని అరుస్తుంటే, తెల్లవారుతూనే గడసరి గొల్లవాళ్ళు, తమ వ్యాపారం కోసం, లేగదూడలని కట్టేసి, ఆవుపాలు పితుక్కుని అమ్ముకుని డబ్బు చేసుకుంటున్నారు". స్థూలంగా చెప్పాలంటే ఈ పద్యభావం ఇదే. కానీ ఈ పద్యరచయిత దేశభక్తుడైన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు. ఆయన ఎంతో గడుసుగా తన మనోభావాలను పద్యరూపంలో వెల్లడించారు. ఆయన ఈ పద్యాన్ని 1907 లో రాశారు. ఆ రోజుల్లో మనం తెల్లవారు అని పిలుచుకునే బ్రిటిష్ వారి పాలన జరుగుతోంది. ఏమి చెప్పాలన్నా, చెప్పుకోవాలన్నా, అడగాలన్నా స్వేచ్ఛ, స్వతంత్రత లేని రోజులు. అప్పుడు ఈ కవి 'చక్కగా పాలిస్తున్న ఆరోగ్యంగా వున్న గోమాతను మన భరతఖండంతో పోలుస్తూ, పాల కోసం గగ్గోలు పెడుతున్న లేగదూడలను హిందువులతో పోలుస్తూ, లేగదూడల మూతుల వలె, మన మూతులు కూడా బిగియగట్టి, మన దేశ సంపదలను తెల్లవారు పాలవలె పితుక్కుని వ్యాపారం చేసుకుంటున్నారు' అని మహా గడుసుగా చెప్పిన భావన ఇది. ముఖ్యంగా "తెల్లవారను గడసరి గొల్లవారు" అనే పదం ఇటు తెల్లవారగానే అనే భావం, అటు బ్రిటిష్ వారు అనే భావం రెండూ స్ఫురించేలా రాయడం రచయిత గొప్పదనం. 
జై హింద్. జై భారత్.

***************************************************
25
చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, 
బంగారు మొలత్రాడు, పట్టుదట్టి, 
సందె తాయత్తులు, సిరిమువ్వ గజ్జెలు, 
చిన్న కృష్ణా నిన్ను చేరి కొలుతు.

భావం: "చేతిలో వెన్నముద్ద పట్టుకుని, మెడలో చిన్న చెంగలువల మాల వేసుకుని, నడుముకి కాసెపోసి కట్టిన పట్టు పంచ, ఆపై బంగారు మొలత్రాడు ధరించి, చేతులకు రక్ష కోసం తాయతులు, కాళ్లకు చిరు సవ్వడి చేసే చిన్ని చిన్ని గజ్జెలతో, మనవైపుకి గునగునా పరుగున పాకుతూ వస్తున్న ఆ ముద్దు కృష్ణుని కొలుచుకుందామా". ఈ పద్యం అన్నమాచార్యుడు రాశాడని అంటారు. ఈ రూపంలో వుండే బాలకృష్ణుడిని ఉత్తరాదివారు లడ్డూగోపాల్ అంటారు. ఇస్కాన్ మందిరాల్లో ఈ లడ్డూగోపాల్ కే అన్ని రకాల అభిషేకాలు, ఊయల సేవలు, అలంకరణలు. అటువంటి ముద్దు గొలిపే కృష్ణుడి రూపాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. హాయిగా ఆనందంగా లేదూ. జై శ్రీకృష్ణ! 
కృష్ణాష్టమి ఎప్పుడు?
ఇది చాలా మంది అడిగే ప్రశ్న. కృష్ణుడు శ్రావణమాసంలో, కృష్ణపక్షంలో, అష్టమితిథి నాడు, రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. వామనద్వాదశి, రామనవమి జరుపుకున్న విధంగానే తిథుల ప్రకారం  కృష్ణుడికి శ్రావణ బహుళ అష్టమి నాడు పుట్టినరోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఏరోజు సూర్యోదయ సమయానికి అష్టమి ఉంటుందో, ఆ రోజే కృష్ణాష్టమిగా నిర్ణయించి పండుగ చేసుకోవడం ఒక ఆనవాయితీగా ఆచరించబడుతోంది. ఈ కృష్ణాష్టమినే జన్మాష్టమి, గోకులాష్టమి, అనడం కూడా వుంది. కానీ తిథులన్నవి పితృకార్య నిర్ధారణకు వాడాలి. జయంతులు వంటి శుభకార్యాలకు, దైవకార్యాలకు నక్షత్రం ముఖ్యం అనే వాదన కూడా వున్నది. చాలామంది వైష్ణవులు రోహిణీ నక్షత్రం ఏ రాత్రి వస్తుందో ఆ రాత్రి కృష్ణుడు పుట్టినట్టు భావించి ఆ మరునాడు కృష్ణుడికి పూజలు చేసి ఊయలలో వేసి సంబరం చేసుకుంటారు. అందువలన, తిథి ప్రకారం జరుపుకునేవారికి, నక్షత్రం ప్రకారం జరుపుకునేవారికి 2,3 రోజులు, ఒక్కోసారి 4 రోజులు కూడా తేడా వస్తుంది. ఎవరి పద్ధతి, ఆచారం వారిది. కాబట్టి ఏరోజు ఎవరికి ముఖ్యమో ఆరోజు చక్కగా  శ్రీకృష్ణుని పుట్టినరోజు జరుపుకోవచ్చు. జై శ్రీకృష్ణ.

***************************************************
26
ప్రత్యక్షే గురవే స్తుత్యః,
పరోక్షే  మిత్ర బాంధవాః, 
కార్యాంతే దాస భృత్యస్య, 
పుత్రః స్తుత్య కదాచన!

భావం: "గురువుని ప్రత్యక్షంగా ఎదురుగా నిలబడి స్తుతించాలి. మిత్రులని కానీ, బంధువులని కానీ వారి వెనుక పొగడాలి. పనివారిని, దాసదాసీలను పని అయిపోయినా తరువాతే మెచ్చుకోవాలి. కానీ, తాను కన్నపిల్లలను ఎప్పుడూ, ఎక్కడా పొగడకూడదు". ఇది మహాకవి భారవి తన తండ్రి ద్వారా తెలుసుకున్న జీవితసత్యం. దైవసమానుడైన గురువుకి కానీ, దైవానికి కానీ ఎదురుగా నిలబడి స్తోత్రం చేయాలి. దైవం ప్రసన్నుడై వరాలిస్తే, గురువు శిష్య వాత్సల్యంతో మంచి విద్యను బోధిస్తాడు. స్నేహితులని, బంధువులని వారి ముఖాన్నే మెచ్చుకుంటే ఇరువురికీ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే పొగడ్త వారు మరొకరి ద్వారా తెలుసుకుంటే, తమ మంచితనం, గొప్పదనం మన ద్వారా ఇతరులకు కూడా తెలిసిందని ఎంతో ఆనందపడతారు. పనివారిని, భృత్యులను, వారు పని చేశాక, ఆ పని ఎంత బాగా చేశారో చెబితే, వారు ఎంతో సంతోషపడి, మనం మళ్ళీ పనికి పిలిచినా వెంటనే ఇష్టంగా వచ్చి ఆపని చేసి వెళతారు. అదే పొగడ్త మాత్రం కన్నపిల్లల విషయంలో ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే, ఆవిధంగా పిల్లల్ని పొగిడితే, వారు తృప్తిపడి ఆపైన ఏమీ నేర్చుకోరు, ఎదగరు. పైగా తల్లితండ్రులు తమ బిడ్డల్ని పొగిడితే బిడ్డలకు ఆయుక్షీణం అని ఒక నమ్మకం. అందుకే బిడ్డల్ని, పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ పొగడరాదు.

***************************************************
27
సీసము:  
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు,
లక్షాధికారియైన లవణమన్నమె కాని, మెరుగు బంగారంబు మ్రింగబోడు, 
విత్తమార్జన జేసి విర్రవీగుటె కానీ, కూడబెట్టిన సొమ్ము తోడరాదు, 
పొందుగా మెరుగైన భూమి లోపల బెట్టి, దానధర్మము లేక దాచి దాచి, 
తేటగీతి:  
తుదకు దొంగల కిత్తురో దొరలకవునో, 
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! 
దుష్టసంహార! నరసింహ దురితదూర!

భావం: "ఎంతటి గొప్ప ధనవంతుడైనా తల్లి గర్భము నుంచి రక్తమాంసాలు తప్ప ధనము కానీ, బంగారము గానీ తీసుకురాలేడు. అలాగే ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు కూడా కనీసం తాను స్వయంగా ఆర్జించిన సంపదలు కూడా తనతో తీసుకుపోనూ లేడు. ఎంత లక్షాధికారియైనా మామూలు భోజనమే కానీ, బంగారుకణికలు మింగలేడు కదా. నేను కదా ఇంత డబ్బు గడించాను, అని ఎంత విర్రవీగినా ఈ దాచిన సొమ్మేదీ వెళ్ళేటప్పుడు తనతో రాదు. ఎవరైనా సంపాదించిన సొత్తు ఏ దానధర్మాలూ చేయకుండా జాగ్రత్తగా భూమి లోపల గుంతలు తవ్వి దాచిపెడితే, ఏమవుతుందో కవి చెప్తున్నాడు. ఏవిధంగా అయితే తేనెటీగ పువ్వు పువ్వు నుంచీ తేనె సేకరించినా ఆ తేనె దానికి కాకుండా, ఆ తేనెపట్టు కొట్టినవాడికే  దక్కుతోందో, ఈ విధంగా సేకరించి, దాచి దాచి ఉంచిన సొత్తు దాచినవారికి దక్కకుండా దొంగలకో, దొరలకో దక్కుతోంది. ఇది కవి శేషప్ప రాసిన నరసింహశతకంలో పద్యం. ఈ శతకం యొక్క మకుటం  "భూషణవికాస! శ్రీధర్మపురనివాస! దుష్టసంహార! నరసింహ దురితదూర!"

***************************************************
28
హస్తస్య భూషణం దానం 
సత్యం కంఠస్య భూషణం
కర్ణస్య భూషణం శాస్త్రం 
భూషణైః కిం ప్రయోజనమ్ 

భావం: ఇది ఒక సంస్కృత సుభాషితం. "చేతికి అసలైన అలంకారం దానం చేయడం. కంఠానికి నిజమైన భూషణం సత్యం పలకడం. చెవికి చక్కని ఆభరణం శాస్త్రాలు వినడం. ఇవి కదా అసలైన అందాన్నిచ్చే ఆభరణాలు. ఇంతకన్నా ఇతర ఆభరణాల ప్రయోజనం ఏముంటుంది?" చేతిని దానం చేయడానికి, గళాన్ని సత్యం పలకడానికి, చెవిని శాస్త్రాలు వినడానికి వాడితే, అవి ఆ వ్యక్తికి అలంకారాలుగా భాసిస్తాయి. అంతే కానీ మామూలుగా భూషణాలు అని చెప్పుకునే వాటికి ప్రయోజనం ఏముందీ.   అన్నీ 

***************************************************
29
సర్వౌషధానాం అమృతం ప్రధానం 
సర్వేషు సౌఖ్యేష్వశనం ప్రధానం 
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం

భావం: "అన్ని ఔషధాల్లోకీ అమృతం ముఖ్యమైనది. అన్ని సుఖాలలోకీ రుచికరమైన భోజనసుఖం ముఖ్యం. అన్ని ఇంద్రియాల లోనూ కళ్లు ముఖ్యమైనవి. అన్ని అవయవాలలో కెల్లా శిరస్సు ప్రధాన అవయవం". ఈ శ్లోకం చాణక్యనీతి లోనిది.
ఈ శ్లోకానికే మరో పాఠాంతరం కూడా ఉంది.
సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం 
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం 
షణ్ణం రసానాం లవణం ప్రధానం 
భావవే నదీనాం ఉదకం ప్రధానం 
భావం: అన్ని ఇంద్రియాలలోనూ కళ్లు ముఖ్యమైనవి. అన్ని అవయవాలలో కెల్లా శిరస్సు ప్రధాన అవయవం. ఆరు రుచుల్లోకీ ఉప్పు ముఖ్యం. ఉప్పుని రుచి అని కూడా అంటారు. నదికి ఉండవలసిన అనేక ధర్మాలలో దానిలో నీరుండటం అనేది ముఖ్యమైన ధర్మం.

***************************************************
30
వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య వి 
శ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడున్, సద 
సభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ 
గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయసింగధీమణీ!

భావం: ఇది పెమ్మయసింగధీమణీ అనే మకుటంతో వున్న చాటు పద్యం. ఈ పద్యంలో కొన్ని విషయాలు పనికిరానివి అని కవి చెప్తున్నాడు.  
1. వాసన లేని పువ్వు: పువ్వుకి వాసన లేకపోతే, పూజకు పనికిరాదు. సువాసన లేదు, కనుక ఆహ్లాదమూ ఇవ్వదు. 
2. బుధవర్గము లేని పురము: చక్కని వివేక విజ్ఞానము గల పౌరులు లేని వూరు. 
3. నిత్య విశ్వాసము లేని భార్య: ఇక్కడ భార్య అంటే జీవితభాగస్వామి అని అర్ధం చేసుకోవాలి. కలిసి జీవితం అంతా గడపవలసిన భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే కాపురం చేయడమే కష్టం. 
4. గుణవంతుడు కాని కుమారుడు: ఇక్కడ కూడా కుమారుడు అంటే సంతానము అని అర్ధం చేసుకోవాలి. పిల్లలు గుణవంతులు కాకపోతే ఆ తల్లీతండ్రుల బాధ వర్ణింపలేనిది. 
5. సదసభ్యాసము లేని విద్య: విద్య నేర్చుకోవడమే కాదు, దాన్ని వాడుకలో పెట్టకపోతే వ్యర్థం. నిత్యమూ దానిని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. స్థిరంగా ఉండే వ్యాపారమో, ఉద్యోగమో దొరికినా సరే, ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి  ఆ విజ్ఞానాన్ని పునరధ్యయనం చేసుకుంటూ ఉండాలి. 
6. పరిహాస ప్రసంగము లేని వాక్యము: విజ్ఞానంతో పాటు వినోదం కూడా కాస్తంత లేకపోతే, ఆ ప్రసంగం ఆకట్టుకోదు. కనుక హరికథల్లో పిట్టకథ ల్లాగా విజ్ఞానంతో పాటు వినోదం కూడా అవసరం. 
7. గ్రాసము లేని కొల్వు: జీతం, భత్యం లేని ఉద్యోగం ఎంత పనికిమాలినదో, ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా. ఎవరైనా జీతం, భత్యం కోసమే కదా ఉద్యోగం చేసేది. 
కనుక ఇవన్నీ దేనికీ పనికిరానివని కవి చెప్తున్నాడు.

***************************************************
31
న చోరహార్యం, న చ రాజహార్యం,
న భాతృ భాజ్యం , న చ భారకారీ,
వ్యయే కృతే వర్ధత ఏవ విద్యా,
విద్యాధనం సర్వధన ప్రధానం.

భావం: "దొంగలు దోచుకోలేనిదీ, రాజులు తమ బలము ద్వారా సంగ్రహించలేనిదీ, అన్నదమ్ములు పంచుకోలేనిదీ, ఏమాత్రమూ భారముగా ఉండనిదీ, ఖర్చు పెడుతున్న కొద్దీ అభివృద్ధి చెందే లక్షణములు కల విద్యాధనమే, అన్ని సంపదల కన్నా ప్రధానమైన సంపద". ర్తృహరి రాసిన ఈ శ్లోకానికి తెలుగు అనువాదం కూడా వుంది. 'లలిత సుగుణజాల తెలుగుబాల' అనే మకుటంతో కరుణశ్రీ అనే కలం పేరుతో శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రచించారు. 
దొరలు దోచలేరు, దొంగ లెత్తుకపోరు,
భ్రాతృజనము వచ్చి పంచుకోరు,
విశ్వవవర్ధనంబు విద్యాధనంబురా,
లలిత సుగుణజాల తెలుగుబాల. 
భావం: విద్య అనే సంపదను పాలకులు దోచుకోలేరు. దొంగలు దొంగలించనూ లేరు. సోదరులు, సోదరీమణులు ఆ సంపదను పంచమని ఎప్పటికీ అడగలేరు. ప్రపంచంలో అన్ని సంపదలలోకీ విద్యాధనం ఒక్కటే ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది.

***************************************************
32
స్వగృహే పూజ్యతే మూర్ఖః,  స్వగ్రామే పూజ్యతే ప్రభుః,
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. 

మూర్ఖుడికి ఇంట్లో మంచి గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ఎంత మూర్ఖుడైనా మనవాడు కదా అని ముద్దు. ప్రభువుకి తన గ్రామంలో మాత్రమే గౌరవం దక్కుతుంది. ఎందుకంటే ఆ వూరిలో పరిపాలన చూసేది ఆ ప్రభువే కనుక ఆ గౌరవం. రాజుకు తన స్వదేశంలో మాత్రమే గౌరవం ఉంటుంది. ఆ ఎల్లలు దాటితే ఈ రాజు ఎవరో కొద్దిమందికి తప్ప, పక్క రాజ్యం వాళ్లకు కూడా తెలియదు. విద్వాంసుడికి మాత్రం ఎక్కడకు వెళ్లినా గౌరవం దక్కుతుంది. ఎందుకంటే విద్వత్తు అనేది ఎక్కడైనా పనికొస్తుంది, ప్రకాశిస్తుంది. ఎందుకంటే 'రవి కాంచని చోట కవి కాంచున్' అని శ్రీకృష్ణదేవరాయలు తన భువనవిజయంలో అన్నాడు కదా. ఇది భర్తృహరి సుభాషితం. 

***************************************************
33
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేఽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

భావం: "ఏ పురుషునికైనా కేయూరాలు, చంద్రకాంతి సమానమైన ఉజ్జ్వలంగా మెరిసే హారాలు, పన్నీటిస్నానాలు, ఆపైన సుగంధలేపనాలు, కేశాలకు అలంకారంగా సౌగంధికా పుష్పాలు వంటి వేవీ అసలైన భూషణములు, అలంకారములు కాలేవు. పురుషునికి నిజమైన అలంకారము సంస్కరించబడిన వాణి (భాష) మాత్రమే. అంటే చక్కటి సంస్కృత భాష ఒక్కటే వాగ్భూషణం. ఇది తప్ప ఈ ప్రపంచంలో మిగిలిన ఏ భూషణములైనా నశించిపోయేవే". మనిషి ఎన్ని విలువైన ఆభరణాలు ధరించినా, ఎంత సుగంధాలు విరజిమ్మే లేపనాలు పూసుకున్నా, ఎంత గొప్ప సువాసనలను చిమ్మే పుష్పాలు ధరించినా, అవేవీ ఆ వ్యక్తికి మర్యాదను తేలేవు. ఎందుకంటే అవి ఎప్పటికీ అసలైన ఆభరణాలు కాలేవు. అసలు సిసలైన ఆభరణం ఆ వ్యక్తి మాట్లాడే భాష. సంస్కరింపబడిన భాషకే సంస్కృతం అని పేరు. వ్యక్తికి కేవలం తాను వాడే సంస్కారవంతమైన భాష మాత్రమే అసలైన ఆభరణం. ఈ ప్రపంచంలో మిగిలిన అన్ని అలంకారాలూ నెమ్మదిగా వాటి విలువను కోల్పోతాయి. ఇది భర్తృహరి నీతిశతకం లోనిది. 

***************************************************
34
నానృషిః కురుతే కావ్యం, 
నా రుద్రో రుద్రమర్చయేత్, 
(పాఠాంతరం:నాగంధర్వ స్పురూపధృత్)
నాదేవాంశో దదాత్యన్నం, 
నావిష్ణుః పృథివీపతిః.  

భావం: మొదటిపాదం: ఋషి కానివారు కావ్యాలను రచించలేరు. కావ్యాలను రచించే పరిణతి రావాలంటే ఋషిత్వం కావాలి. అప్పుడే లోకహితానికి పనికొచ్చే కావ్యాలు రాయగలరు. రెండవపాదం: అలాగే రుద్రాంశ లేనివారు రుద్రుని పూజించలేరు. రుద్రుణ్ణి అర్చించాలంటే రుద్రతత్త్వం అర్ధం అయి, వారు స్వయంగా రుద్రుడిలా మారాలి. (ఈ పాదానికి ఒక పాఠాంతరం కూడా ఉంది. అదేమిటంటే గంధర్వాంశ లేనివారు గంధర్వునిలా అందమైన రూపం పొందలేరు) మూడవపాదం: దేవుని అంశ లేనివారు అన్నదానం చేయలేరు. అన్నదానం చేయాలన్న మనసు కలగాలంటే, ఆకలిగొన్న వాడి క్షుద్బాధను అర్ధం చేసుకునే దైవత్వం ఉండాలి. నాలుగవపాదం: విష్ణ్వంశ లేనివారు ఎప్పటికీ పాలకులు కాలేరు. పరిపాలన చేయాలంటే స్థితి కారకుడైన విష్ణువు అంశ తప్పనిసరిగా అవసరం. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా పాలన జరపాలంటే ఆరాజుకి, లేదా ఈ రోజుల్లో అయితే మంత్రులకి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక ఉంటుంది.

***************************************************
35
వందే వందారు మందారమిందిరానందకందలమ్ 
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ 

భావం: "భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్ష సమానమైన మందారమొక్క వలె, శ్రీమహాలక్ష్మి ఆనందానికి కూడా మూలకారణమై, తన వారందరితో కలిసి ఆనందంగా క్రీడిస్తున్న ఆ గజముఖునికి నమస్కరిస్తున్నాను". ఈశ్లోకం, కనకధారను కురిపించమని శ్రీమహాలక్ష్మిని ప్రార్ధించే ముందు, విఘ్ననివారణకై శ్రీశంకరభగవత్పాదులవారు ఆశువుగా చెప్పిన కనకధారాస్తవం లోని గణేశప్రార్ధన.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ 
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే 

భావం: ఈ శ్లోకం విఘ్నేశ్వరస్తుతిగా ప్రసిద్ధి. కానీ శ్లోకంలో ఎక్కడా ఆ వినాయకుని పేరు ఉండదు. "తెల్లనివస్త్రములు (శుక్లాంబర) ధరించి, సర్వవ్యాపకుడై (విష్ణుం), చంద్రకాంతితో (శశివర్ణం), నాలుగు భుజాలతో (చతుర్భుజం), ఆహ్లాదకరమైన ముఖం కల ఆ గణేశుని (ప్రసన్నవదనం కల ఆ విఘ్నహర్తను) సర్వ విఘ్నములు ఉపశమించుటకై (సర్వవిఘ్నోపశాంతయే), ధ్యానిస్తున్నాను (ధ్యాయేత్)". గణపతి ప్రసన్నవదనుడు కనుక ఈ శ్లోకం గణపతికి ఆపాదించి ధ్యానం చేస్తున్నాం.
***************************************************
36
విశ్వామిత్రాహి పశుషు, 
కర్దమేషు జలేషు చ, 
అంధే తమసి వార్ధక్యే, 
దండం దశగుణం భవేత్.

భావం: దండం దశగుణం భవేత్ అనే మాట సాధారణంగా వింటూనే ఉంటాం. "పిల్లలను దండిస్తే, వాళ్ళు పది రకాలుగా భయపడతారు లేదా బాగుపడతారు" అని ఈ వ్యాక్యప్రయోజనంగా కూడా చెప్తూ వుంటారు. కానీ ఈ శ్లోకం అసలైన అర్ధం ఏమిటో తెలుసుకుందాం. దండం అంటే చేతికర్ర మనకు పది రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటి పాదంలో వి అంటే విహంగాలు, పక్షులు. పంటపొలాల్లో పక్షులను తోలడానికి, శ్వా అంటే శునకము, కుక్కలు, పిల్లులు వంటి జంతువుల నుంచి రక్షణకి, అమిత్ర అంటే మిత్రులు కానివారు, శత్రువులన్న మాట, వారి నుంచి కాపాడుకోవడానికి, అహి అంటే పాములు, కొండచిలువలు వంటి సరీసృపాల నుంచి రక్షించుకోవడానికి, పశుషు అంటే ఎద్దులు, దున్నలు, ఆబోతులు, ఆవులు, గేదెలు వంటి పశువులను దారిలో పెట్టి మళ్లించడానికి దండాన్ని అయిదు రకాలుగా వాడుకోవచ్చు. రెండవ పాదంలో కర్దమేషు అంటే బురద, ఊబి నెలల్లో నడిచేటప్పుడు, జలేషు నీటిచెలమలు, ఏర్లు మొదలైనవి దాటవలసి వచ్చినప్పుడు దండం చేతి ఊతకర్రగా ఉపయోగపడుతుంది. ఇక మూడవ పాదంలో అంధే కళ్ళు కనిపించని వారికి, తమసే చీకటిలో వెళ్లవలసి వచ్చినప్పుడు, వార్ధక్యే ముసలితనంలోనూ దండం సహాయం అవసరం. మొత్తం మీద దండం మనకు ఈ పది రకాలుగా పనికివస్తుంది. అందుకే అన్నారు దండం దశగుణం భవేత్ అని. మొత్తం శ్లోకం చెప్పకుండా కేవలం నాలుగో పాదం మాత్రమే చెప్పుకుంటే, అర్ధాలు మారిపోతాయి. 

***************************************************
37
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం,
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః, 
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో,
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్. 

భావం: "యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా", కనుక నాలో వున్న ఆ బుద్ధి మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ గిరిజాదేవియే. భావం: ఆదిశంకరుడు శివునితో ఇలా అంటున్నా డు. “హే శంభో, నేను అంటే నువ్వే. సాక్షాత్తూ నాలో బుద్ధి స్వరూపంగా వున్నది గిరిజా దేవియే. నా పంచ(దశ) ప్రాణములే నీ సహచరులైన ప్రమథ గణములు. నా శరీరమే నీ గృహం, నువ్వు కొలువుండే దేవాలయమే ఈ దేహం. ఈ శరీరంతో నేను ఏయే పనులు చేసినా, ఏయే భోగములు అనుభవించి నా అవి అన్నీ నీకు నేను చేసే అర్చనే. నేను నిద్రలో వున్నప్పటికీ, అది అంతా యోగ సమాధిస్థితియే. నా పాదములతో నేను నడుస్తున్న నడక అంతా నేను నీకు చేసే ప్రదక్షిణయే. నేను ఉచ్చరించే ప్రతి పలుకూ, పదమూ నీ స్తో త్రమే. నేను చేసే ప్రతి కర్మా నీ ఆరాధనే.” ఇది ఆది శంకరాచార్యుడు చెప్పిన శ్లోకం. భక్తులందరూ అనుసరించవలసిన మోక్షమార్గం. మనం ఏ పని చేస్తున్నా, ఆయా కర్మలన్నీ ఆ సదాశివుడికి మనం చేస్తున్న కైంకర్యాలుగా భావించి చేయాలి. నిత్యమూ కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా అవి అన్నీ ఆ పరమాత్మకు చేస్తున్న పూజ అని చేస్తుంటే, ఆ సేవలన్నీ ఆ దేవదేవుడికే చెందుతాయి. ఆ అనుభూతి కేవలం అనుభవైకవేద్యం. జీవితానికి ఇంతకన్నా ధన్యత ఇంకేముంటుందీ. ఓం నమఃశివాయ. భగవంతుని
ఆరాధనలో మమేకం అవడం అంటే, తాను స్వయంగా ఆ భగవత్ స్వరూపుడు కావాలి. “నా రుద్రో రుద్రమర్చయేత్” కదా. కనుకనే ఆత్మా త్వం. “యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా”, కనుక నాలో వున్న ఆ బుద్ధి మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ గిరిజా దేవియే. శివుడు ఏవిధంగా ప్రమథగణ పరివేష్టితుడై ఉంటాడో, అదే విధంగా మన శరీరంలో “ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ” అనే దశప్రాణాలు మన సహచరులు. అవి లేకపోతే జీవించలేము. “దేహో దేవాలయ ప్రోక్తః” అని కదా అనుకుంటాం. కనుక ఈ దేహమే శివాలయం, శివ నివాసం. ఏ పని చేస్తున్నా, నిరంతరం శివ నామస్మరణే మనసులో వుంటే, “నామస్మరణా ధన్యోపాయం, నహి పశ్యా మో భవతరణే” అన్నట్టు చేసే ప్రతి కార్యమూ, అనుభవించిన ప్రతి భోగమూ, ఈ భవసాగరాన్ని దాటడానికి చేసిన ప్రతి ప్రయత్నమూ ఆ శివునికే సమర్పణం. నిద్ర పోయేది శరీరం మాత్రమే, లోపల ఉన్న ఆత్మకు నిద్ర ఏదీ. అది నిత్యమూ మెలకువగా ఉంటూ శివునితో రమిస్తూనే ఉంటుంది కదా. అంతకన్నా గొప్ప సమాధి స్థితి లేదు. కనుక నిద్రే అత్యున్నతమైన సమాధిస్థితి. శివుడు లేని స్థలమేదీ. కనుక ఎటు నడచినా, ఎప్పుడు నడచినా, ఆ సంచారమంతా నేను నీకు చేస్తున్న ప్రదక్షిణములే శివా. నేను ఎల్లప్పుడూ పలికే పదములూ, పాటలూ, మాటలూ అన్నీ నీ(నా) స్తుతులే. ఈ జ్ఞానం వలన ఎల్లప్పుడూ పలికేది ఆ స్తో త్రాలే. హే శంభో, కనుక నేను ఏమి చేసినా, ఆ కర్మ సమస్తం నీ ఆరాధనమే. ఆదిశంకరుడు సాక్షాత్తూ శంకరునితో చేసిన సంభాషణ ఇది. ఆదిశంకరుడు ఈనాటికీ అందరికీ గురువు, మార్గదర్శి. ఆ శంకర మార్గంలో పయనిస్తే దొరికేది ఆత్మస్వరూపమైన శంకరుడే.

***************************************************
38
అచ్యుతానంతగోవింద, నామోచ్ఛారణ భేషజాత్, 
నశ్యంతి సకలరోగాః, సత్యం సత్యం వదామ్యహం

భావం: శ్రీమహావిష్ణువుకు ఉన్న నామాలలో అచ్యుత, అనంత, గోవింద అనే నామాలు ప్రత్యేక మహత్తు కలవి. "ఈ నామాలు ఉచ్చరించినంత మాత్రాన అవి భేషజాత్, భిషక్కు (ధన్వంతరి) వలె పనిచేసి, సకలరోగాలను నశింపచేస్తాయి, ఈ మాట సత్యం, సత్యం" అని స్వయంగా అగ్నిదేవుడే చెప్పాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మహాదౌషధం ఈ మంత్రం. "ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః" అనే నామాలను నిత్యమూ స్మరిస్తూ ఉండటమే తరుణోపాయం. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. స్థిరంగా ఉండేవాడు, నాశము లేనివాడు. అనంతుడు అంటే అంతము లేనివాడు. అనంతశేషుడు. గోవిందుడు అంటే గోవులను రక్షించేవాడు, శ్రీకృష్ణుడు. ఈ నామాలన్నీ శ్రీ విష్ణుసహస్రనామాలలో వున్నవే. రోగంతో దిక్కు తోచక వున్నవారికి ఈ నామాలు అమృతంతో సమానం. అగ్నిపురాణం సిద్ధ ఔషధాలు, మంత్రరూప ఔషధాల గురించి వివరంగా చెప్పింది. ఈ "అచ్యుతానంతగోవింద" మంత్రం అగ్నిపురాణం లోనిది. కనుక రోగబాధ ఉన్నవారు నిత్యమూ "అచ్యుతానంతగోవింద" అనో, "ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః" అనో స్మరించడం ఔషధసేవనంతో సమానము. కనీసం రోజుకి 108 సార్లు 48 రోజులు చేయడం మంచిది. 

***************************************************
39
విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం
పాత్రత్వాద్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్‌
భావం: ఇది ఒక సుభాషితం. "విద్య వలన వినయం లభిస్తుంది. వినయము వలన యోగ్యత వస్తుంది. యోగ్యత వలన ధనము లభిస్తుంది. ఆ ధనమును ధర్మ కార్యాలకు ఉపయోగించితే సుఖం కలుగుతుంది". ఏ వ్యక్తికైనా తుదకు కావలసింది సుఖమే కదా. చదువు వలన మనిషికి నమ్రత రావాలి. వినయంతో ప్రవర్తించేవారికి ఏపనైనా చేయగలిగే యోగ్యత, సమర్థత వస్తుంది. ఈ లక్షణాల వలన మంచి గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తూ వీరు ధనం సంపాదిస్తారు. వినయం కలిగిన ఈ యోగ్యులు, ఆ ధనాన్ని ధర్మకార్యాలకి వినియోగిస్తే, ఫలితంగా సమాజంలో మర్యాద, సుఖం కలుగుతాయి. ఎవరైనా గౌరవం, సుఖమే కదా కోరుకునేది. ఈ విధంగా విద్య వలన వినయం రానివారికి, అదే విద్య వలన గర్వం, అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. ఆ అహంకారం వలన, ఇక ఆపైన రావలసిన మిగిలినవన్నీ రావు, ఆ విద్య వలన ఉద్యోగాలు, జీతాలు వచ్చినా, ఆ తరువాత సమాజంలో దక్కవలసిన ఆదరాభిమానాలు దక్కవు. అందువలన నిత్యం అసంతృప్తితో వేగిపోతూ శాంతం, సుఖం దొరక్క అసహనంతో దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటారు.

***************************************************
40
ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ, 
దాన మానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః

భావం: ఏ వ్యక్తికైనా తొమ్మిది విషయాల్లో గోప్యత అవసరం అంటాడు చాణక్యుడు. "అవి తన వయసు, సంపాదన, గృహకలహాలు, సాధన చేసే మంత్రం, తపస్సు వివరాలు, సేవించే ఔషధము, తమ దంపతుల సమాగమ విశేషాలు, తనకు ఎదురైన సన్మాన, అవమానాలు రహస్యంగా ఉంచాలి" అని జాగ్రత్త చెప్పాడు చాణక్యుడు. వయసు వివరాలు, ఆస్తిపాస్తుల వివరాలు అందరికీ చెప్పకూడదు. అందువలన ఎవరైనా అప్పులు, ఆస్తిపాస్తులు ఆశిస్తే, వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. అంతేకాక, బైటవారికి మన గృహకలహాలు కూడా తెలియనీయకూడదు. సమాజంలో మర్యాద పోతుంది. జనం చులకనగా చూస్తారు. అలాగే, తాను తీసుకునే మందుల గురించీ అందరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఆ మందు ద్వారా వ్యాధి గురించి తెలిసి, లేనిపోని సమస్యలు వస్తాయి. తాను ఉపాసన చేస్తున్న మంత్రం కానీ, చేస్తున్న తపస్సు, దేవత గురించి కూడా బహిర్గతం  చేయకూడదు. శత్రువులకు ఈ వివరాలు తెలిస్తే, ఒక్కోసారి జపంలో అనుకోని ఆటంకాలు ఎదురై సాధన కుంటుపడచ్చు. అంతేకాదు, దాంపత్య సంబంధ విశేషాలు కూడా గుప్తంగా ఉంచాలి అని మరో జాగ్రత్త చెప్తున్నాడు. మన భారతీయ సంప్రదాయంలో పడకటిల్లు కేవలం భార్యాభర్తలకు మాత్రమే చెందిన ఏకాంతప్రదేశం. ఆ విశేషాలు బహిరంగం చెయ్యకూడదు. అంతే కాదు తనకు జరిగిన సన్మానాలు గురించి నలుగురితో చర్చిస్తే, ఈర్ష్య పడేవారి సంఖ్య పెరుగుతుంది. ఆ వెనుకే గుప్త శత్రువులూ పెరుగుతారు. అదే విధంగా తనకు కలిగిన అవమానాల గురించి చెప్పుకుంటే నలుగురిలో నగుబాటు అవుతుంది. పైగా శ్లోకంలో మనీషి అనే పదం వాడబడింది. మనీషి అంటే తెలివైనవాడు, విజ్ఞుడు అని అర్ధం. విజ్ఞుడైనవాడు తనకు సంబంధిన ఈ తొమ్మిది విషయాలూ గుప్తంగా ఉంచుకోవాలి అంటాడు చాణక్యుడు. 

***************************************************
41
ఉత్తమం స్వార్జితం విత్తం, 
మధ్యమం పితురార్జితం, 
అధమం భాతృవిత్తం చ, 
స్త్రీ విత్తమధమాధమం. 

భావం: "స్వంతంగా సంపాదించిన ధనమే ఉత్తమమైనది. తాతతండ్రుల నుంచి సంక్రమించిన ధనము మధ్యమం. అన్నదమ్ముల సంపాదన ద్వారా సమకూరిన ధనం అధమం. స్త్రీల ధనాన్ని వాడుకుంటే అది అధమాధమం అని ఈ శ్లోకార్ధం. ఇది నీతిశాస్త్రం లోనిది". ఎవరికైనా తాము కష్టపడి సంపాదించిన సొమ్ము, అన్నివిధాలుగా ఉత్తమమైన సంపాదన అవుతుంది. ఎవరైనా స్వంతంగా డబ్బు సంపాదించుకుని జీవనం సాగించటం ఉత్తమమైన, మర్యాదపూర్వకమైన పధ్ధతి. కొంతమందికి ముందు తరాల వారు కూడబెట్టి ఇచ్చిన సంపద వారసత్వంగా వస్తుంది. ఆ సొమ్ముని ఈ శ్లోకంలో మధ్యమం అంటున్నారు. అంటే సొంత సంపాదన కన్నా కాస్త మర్యాద తగ్గుతోంది. వాళ్లకేంటి, పెద్దలు సంపాదించి ఇస్తే కూర్చుని తింటున్నారు అని నలుగురూ కాస్త చులకనగా చూస్తారు. కనుక ఇటువంటి బ్రతుకు మధ్యమం. ఇక మూడవ స్థానాన్ని అధమం అన్నారు. అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల ఆస్తిపై బ్రతికేవారిది. తనకు తానే సంపాదించుకున్నా, తల్లితండ్రులు ఇచ్చినా అదో మర్యాద. కానీ అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల ఆస్తిని దోచి దానిపై బ్రతికేవారిది అధమవర్గం. ఈనాటి సమాజంలో ఎంతమంది ఇటువంటి వారు కనిపిస్తారో కదా. ఇటువంటి ధనం అధమం. ఆ సంపాదనతో బ్రతికేవారు జీవితం కూడా అధమమే. ఇంతకన్నా అధమాధమమైన జీవితం ఏమిటంటే, స్త్రీ విత్తం పైన బ్రతికేవారిది. ఏపనీ చేయకుండా, తల్లో, చెల్లో, అక్కో, భార్యో, కూతురో సంపాదించి తెచ్చిన సొమ్ముని, లేదా వారికి సంబంధించిన ఆస్తినో అనుభవించే వారిది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసి ఇద్దరి సంపాదనా కలుపుకుని వాడుకుంటే, ఆ సంపాదనను వారి స్వార్జితం కిందనే లెక్క వేయాలి. అది కేవలం స్త్రీవిత్తం అనిపించుకోదు. కానీ ఏపనీ చేయకుండా, ఏమాత్రమూ సంపాదించకుండా తిని కూర్చునే వారి బ్రతుకు మాత్రం అధమాధమం అని ఈ శ్లోకార్ధం. 

***************************************************
42
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా

భావం: పైన చెప్పిన ఏడు పురాలూ మోక్షదాయికమైనవి అని గరుడపురాణం చెప్తోంది. అయోధ్య శ్రీరాముని జన్మభూమి. మథుర శ్రీకృష్ణుని జన్మభూమి. మాయా అంటే నేటి హరిద్వార్ నగరం. కాశీ నగరం విశ్వనాథుని క్షేత్రం. కాంచీపురం కామాక్షీ దేవి వెలసిన శక్తిపీఠం. కాంచీపురంలో ఎంతో ప్రభావవంతమైన శివ, విష్ణు ఆలయాలు కూడా యుగాల నుంచీ ఉన్నాయి. అవంతికా నగరం అంటే నేటి ఉజ్జయిని. ద్వారవతీ అంటే నేటి ద్వారకానగరం. ఈ ఏడు పురములూ మోక్షాన్నిచ్చే పుణ్యక్షేత్రాలు అని గరుడపురాణం చెప్పింది. ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువే స్వయంగా తన వాహనమైన గరుడుడికి చెప్పాడు. అయోధ్యలో సరయూనది, మథురలో యమునానది, హరిద్వార్ లోనూ, కాశీలోనూ గంగానది, ఉజ్జయినిలో క్షిప్రానది, ద్వారకానగరంలో గోమతీనదిన్నాయి. ద్వారకలో సముద్రం కూడా ఉన్నది. ఈ ఏడు పురాలనూ దర్శించి, అక్కడ ఉన్న పుణ్యనదులలో స్నానమాచరించి, ఆ క్షేత్రాలలో వున్న దేవీ దేవతలను దర్శించి, అర్చిస్తే మోక్షం లభిస్తుంది, అని గరుడపురాణం చెప్తోంది. ఈ ఏడింటిలో ఆరు ఉత్తరభారతదేశంలో ఉంటే, కాంచీపురం దక్షిణ భారతదేశంలో ఉంది. అవకాశమున్నవారు ఈ ఏడు క్షేత్రాలనూ దర్శిస్తే మోక్షం లభిస్తుంది.

***************************************************
43
గుహ‌ల‌లోన జొచ్చి, గురువుల వెద‌కంగ‌,
క్రూర‌మృగ‌మొకండు తార‌సిలిన‌,
ముక్తిమార్గ‌మ‌దియె ముందుగా చూపురా
విశ్వ‌దాభిరామ వినురవేమ.

భావం: ఎంతో సాధించేసిన గురువులు, గుహల్లో కూర్చుని, తపస్సు చేసుకుంటూ ఉంటారని భావించే అమాయకులను వేమన ఎగతాళి చేస్తున్నాడు. అవే గుహల్లో ఆకలితో వుండే క్రూరమృగాలు కూడా వుంటాయి, వాటి కంట పడితే, అవి వీరిని భోంచేసి, ఒకేసారి ముక్తిమార్గం చూపుతాయని హెచ్చరిస్తున్నాడు. క్రూరమృగాలంటే దొంగస్వాములు, దొంగగురువులు అని కూడా అర్ధం చేసుకోవాలి. అమాయకంగా ఇటువంటి దుష్టులను నమ్మితే ధన, మాన, ప్రాణాలకు నష్టం సుమా అని వేమన వెటకారంగా చెప్తున్నాడు. దొంగ గురువుల పట్ల తస్మాత్ జాగ్రత.

***************************************************
44
"రామః పరశురామశ్చ నృసింహా విష్ణురేవచ త్రివిక్రమః"

ఈ ఐదు నామాలను జపిస్తూ ఉంటే అన్ని రంగాలలో విజయం కలుగుతుంది అని అగ్నిపురాణంలో చెప్పారు. రాముడు, పరశురాముడు, నృసింహుడు, విష్ణువు, త్రివిక్రముడు ఈ నామాలను జపించడం ద్వారా కలిగే ఫలితం 'విజయం', అని అగ్నిపురాణంలో ఉంది. ఇవి అన్నీ విష్ణురూపాలే. త్రిమూర్తులలో విష్ణువు స్థితి కారకుడు, కనుక విష్ణునామ సంకీర్తన చేస్తే, విష్ణునామం జపిస్తే, విష్ణువును పూజిస్తే సర్వత్రా విజయం కలుగుతుంది. భక్తులను, ఆర్తులను ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకునివెళ్లే శక్తే విష్ణుశక్తి. ఈ విష్ణునామాలను జపించండి. జపిస్తూనే ఉండండి. విజయాలను పొందండి.

***************************************************
45
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, 
నిర్మోహాత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః

భావం: సత్సంగత్వం అంటే సజ్జనులతో సంగం, స్నేహం చేయడం. సతతమూ సజ్జనుల సాంగత్యంలో ఉండటం వలన, ఇతర వ్యర్ధ విషయాల పట్ల  క్రమేపీ ఆకర్షణ నశిస్తుంది. నెమ్మదిగా అనవసర విషయాల పట్ల ఆసక్తి నశించి నిస్సంగత్వం అలవాటు అవుతుంది. తనలో తానే శాంతం, తద్వారా సుఖం పొందడంలో గల ఆనందం అర్ధం అవుతుంది. ఆ శాంతస్థితి యొక్క విలువ తెలుస్తుంది. ఆ స్థితిలో అన్నింటి పట్ల మోహం నశిస్తుంది. అటువంటి నిర్మోహత్వం  ఒకసారి రుచి చూస్తే, ఈ భవసాగరంలో మిగిలిన విషయాలు అన్నీ ఎంత నిస్సారమైనవో తెలుస్తుంది. మోహనష్టం గురించి భగవద్గీతలో కూడా భగవానుడు స్వయంగా చెప్పాడు. అటువంటి నిర్మోహత్వంలో, నెమ్మదిగా దేనికీ, వేటికీ, ఎవరికీ చలించని ఒక స్థితి వస్తుంది. సంసారంలో ఉంటూనే దేనికీ అంటకుండా ఉండగలిగే, లేదా ఉండే ఒక నిరామయ స్థితి, అంటే నిశ్చలతత్వం వస్తుంది. ఆ నిశ్చలతత్వమే నెమ్మదిగా జీవన్ముక్తికి దారి తీస్తుంది. అందరికీ కావలసిందీ, అందరూ ఆశించేదీ జీవన్ముక్త స్థితి ఒక్కటే. ఆ స్థితి పొందడం ఏమాత్రమూ సులభం కాదు. అటువంటి దుర్లభ స్థితిని పొందడానికి ఈ సోపానాల ద్వారా ప్రయత్నించండి అని ఈ శ్లోకం చెప్తుంది. ఈ సోపానాలు తెలిసినంత మాత్రాన ఆ స్థితిని సాధించడం అనుకున్నంత తేలిక కాదు. భగవంతుని పాదాలు నమ్ముకుని, ఇదంతా ఒక తపస్సులా చేస్తే, లభించేది జీవన్ముక్తి. శంకరాచార్యుడు చెప్పిన మోహముద్గరలో ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకంలో శంకరుడు మనిషి 
జీవన్ముక్తి పొందడానికి ఒక అద్భుతమైన మార్గాన్నిసూచించాడు.  

***************************************************
46
గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు
ఆత్మ కలుష పంకమడుగు బట్ట
తెలసి విరిచెనేని దివ్యామృతము తేరు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: కుండలో ఉన్న బురద నీటిని శుభ్రపరచడానికి చిల్లగింజ వేస్తాము. ఆ చిల్లగింజ అడుగంటా పేరుకున్న కల్మషాన్ని విరిచి నీటిని తేటపరచి దానిని అమృతం వలె మారుస్తుంది. వేమన ఈ పద్యంలో కుండని మనిషి తోనూ, కుండలోని బురద నీటిని కలుషమయమైన ఆత్మ తోనూ, గురువును చిల్లగింజ తోనూ పోల్చాడు. కల్మషమైన ఆత్మని శుద్ధి చేయాలంటే, గురువు అనే చిల్లగింజ కావాలి. బురద నీటిలో చిల్లగింజ వేస్తే అది హంస పాలు, నీరుని వేరు చేసినట్టు, నీటిలోని బురదని నీటి నుంచి వేరు చేస్తుంది. అప్పుడు బురద కుండ అడుగున పేరుకుపోయి, జీవాధారమైన దివ్యామృతము వంటి స్వచ్ఛమైన మంచినీరు పైకి తేరుకుంటుంది. ఆత్మకు అంటుకున్న కల్మషాన్ని తొలగించడానికి గురువును ఆశ్రయించాలి. అప్పుడు గురువు చిల్లగింజ బురద నీటిని శుభ్రపరచినట్లు, కలుషాత్మను శుద్ధిచేసి అమృతాత్మను చేస్తాడు అని వేమన అంటున్నాడు.
***************************************************
47
ఉద్యమేనైవ  సిద్ధ్యంతి  కార్యాణి న మనోరథైః 
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః

భావం: ఏ కార్యమైనా కష్టపడి సాధించుకుంటేనే సాధ్యపడుతుంది. అంతేకానీ, కోరుకున్నంత మాత్రాన పనులు అయిపోవు. మనస్సు ఏది కోరుకుంటే అది జరిగిపోదు అని గ్రహించాలి. గొప్ప మనోరథాలు సిద్ధించాలంటే, ఉద్యమం చేసినట్టు పరిశ్రమించాలి. నిజమే కదా, ఎంత సింహాని కైనా గుహలో నిద్రపోతుంటే, దాని నోట్లోకి జింకలొచ్చి పడిపోవు. కనుక సింహానికైనా వేటాడితేనే ఆహారం దొరుకుతుంది. గుహల్లో సోమరిగా పడుకుంటే భోజనం దొరకదు. కనుక ఎవరైనా సోమరిగా కూర్చుని ఏ పనీ చెయ్యకుండా ఉంటే, వాళ్ళ కోరికలేవీ ఎప్పటికీ తీరవు. కోరికలు కోరుకోవడం దగ్గరే అంతా ఆగిపోతుంది. అవి సిద్ధించాలంటే మాత్రం, తప్పనిసరిగా నడుం బిగించి ఉద్యమంలా పని చెయ్యాలి. ఈ పద్యం హితోపదేశం లోనిది.

***************************************************
48
యాత్ర బోయిన వాడు ఎన్నాళ్ళు తిరిగినా, 
పారమైన ముక్తి  పదవి లేదు, 
మనసు నిల్చినవాడు మహనీయ మూర్తిరా,  
బాలచక్రవేమ భవ్యనామ. 

భావం: యాత్రల పేరుతో ఎన్నాళ్ళు ఎన్నెన్ని తీర్థాలు తిరిగినా, పారలౌకిక ముక్తి మాత్రం దొరకదు. ఆ భగవంతుని మీద మనసు స్థిరంగా నిలుపగలిగిన వాడే అసలైన మహనీయమూర్తి అని వేమన ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ పద్యాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే దీని మకుటం. వేమన పద్యాలు అన్నీ సాధారణంగా "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో ఉంటాయి. కానీ ఇతర మకుటాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ఈ "బాలచక్రవేమ భవ్యనామ" మకుటం కూడా ఒకటి. దీనిని రచించినవాడు వేమన కాదు, అదే పేరుగల మరొక రచయిత అని కూడా పేరు ఉంది.   
***************************************************
49
మూర్ఖస్య పంచ చిహ్నాని  గర్వీ దుర్వచనీ తథా, 
హఠీ చా అప్రియవాదీ చ పరోక్తం నైవ మన్యతే.   

భావం: ఈ పద్యంలో మూర్ఖుల లక్షణాలు చెప్పారు. 
1. గర్వీ: గర్వంగా ఉండటం. ఏ ప్రత్యేకతలు లేకపోయినా, తామేదో ఎక్కువ అన్నట్టు పొగరు చూపటం. 
2. దుర్వచనీ: చెడ్డమాటలు మాట్లాడుతూ ఉండటం. ఎప్పుడూ చెడు విషయాలు మాట్లాడటం, ఇతరుల గురించి చెడు చెప్పటం, దాని వలన ఆనందం పొందటం
3. హఠీ: మొండితనం. పట్టు పట్టటం, మంకుతనం 
4. అప్రియవాదీ: ఎప్పుడూ అప్రియమైన, హితకరం కాని మాటలు పలుకుతూ ఉండటం. అందరికీ దుఃఖం, కోపం కలిగే విధంగా మాట్లాడటం. ఇతరులకు నిరాశ కలిగేలా మాట్లాడటం  
5. పరోక్తం నైవ మాన్యతే: ఇతరులు చెప్పిన దాన్ని గౌరవించకపోవడం, వినకపోవడం 
మూర్ఖులను గుర్తించడానికి ఈ ఐదు లక్షణాలూ గమనించండి. మీలో ఈ లక్షణాలు ఉంటే వెంటనే వదిలించుకోండి. 

***************************************************
50
ప్రియములేని విందు పిండివంటల చేటు, 
భక్తిలేని పూజ పత్రి చేటు,       
పాత్రమెఱుగని ఈవి బంగారు చేటురా, 
విశ్వదాభిరామ వినురవేమ !

భావం: మనసులో ఏ ప్రేమాభిమానాలు లేకుండా పై పై చిరునవ్వులతో ఎంత గొప్ప విందు ఇచ్చినా, ఆ విందు వండి వడ్డించిన పిండివంటలకి చేటు, అంటే వృధా చేసినట్లే. అవే పిండివంటలు నిండు మనసుతో పెడితే సార్ధకం అవుతాయి. అదే విధంగా భక్తి లేకుండా, పైకి విపరీతమైన భక్తి  ప్రదర్శిస్తూ ఎన్నెన్ని ద్రవ్యాలతో, ఎంతెంత పత్రితో పూజ చేసినా, అది అంతా కూడా దేనికీ పనికిరాదు. పత్రి చేటు అంటే, పత్రిని దండుగ చేయడమే. ఈ రెండింటితో పాటు ఇంకొక చేటు పని అని ఏమిటంటే, పాత్రత లేనివారికి బంగారు దానం చేసినా అది వృధా అని వేమన చెప్తున్నాడు. అపాత్రులకు చేసిన దానం మహాపాపం అని మన ధర్మశాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మనసులో ప్రేమ లేకుండా చేసే విందులు, భక్తి లేకుండా చేసే పూజలు, అపాత్రులకు చేసే దానాలు పనికిరాని పనులు అని ఈ పద్యం చెప్తోంది.  

***************************************************
51
ఆరోగ్యమానృణ్యమవిప్రవాసః 
సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః  
స్వప్రత్యయా వృత్తిరభీతివాసః 
షడ్జీవలోకస్య సుఖాని రాజన్‍ 

భావం: ఈ శ్లోకం మహాభారతం లోని విదురనీతి లోనిది. ఈ ఆరు లక్షణాలూ ఉంటే లోకంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారని ఈ శ్లోకంలో చెప్పాడు. 
ఆరోగ్య: అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉండటం, 
అనృణ్య: అప్పులబాధ లేకుండా ఉండటం, 
విప్రవాస: జీవనోపాధి కోసం దేశాంతరం, లేదా గ్రామాంతరం వెళ్ళవలసిన అవసరం రాకపోవడం, 
సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః: సత్ప్రవర్తన కలవారితో స్నేహం చేయడం, కలసిఉండటం,  
స్వప్రత్యయా వృత్తి: స్వంతంగా జీవనోపాధి సమకూర్చుకుని బ్రతకటం, 
అభీతివాసః: ఏ భయమూ లేకుండా హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం.
కనుక ఈ ఆరు లక్షణాలూ పెంపొందించుకోండి. సుఖంగా జీవించండి.  

***************************************************
52
ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః 
క్రోధనో నిత్యశంకితః 
పరభాగ్యోపజీవీ చ 
షడేతే దుఃఖభాగినః

భావం: ఈ శ్లోకం నారాయణపండితుడు చెప్పిన హితోపదేశం లోనిది. ఈ ఆరు లక్షణాలూ ఉంటే లోకంలో వ్యక్తులు ఎల్లప్పుడూ దుఃఖితులై  ఉంటారని ఈ శ్లోకంలో చెప్పాడు. 
ఈర్ష్యీ: ఎప్పుడూ ఇతరులను చూసి ఈర్ష్యపడేవారు, 
ఘృణీ: రోతగా, జుగుప్స కలిగించేలా ఉండేవారు, 
త్వసంతుష్టః : ఎప్పుడూ అసంతృప్తితో ఉండేవారు,  
క్రోధనో: ఎప్పుడూ అందరిపై కోపంతో ఉండేవారు కోపిష్టులు, 
నిత్యశంకితః : ఎప్పుడూ అందరినీ అనుమానంతో చూసేవారు,
పరభాగ్యోపజీవీ: ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవారు, పరాన్నభుక్కుగా బ్రతికేవారు,    
ఈ ఆరుగురు ఎల్లప్పుడూ దుఃఖితులే. కనుక ఈ ఆరు లక్షణాలూ దరి చేరకుండా జాగ్రత్త పడండి. 

***************************************************
53
అర్చకశ్య తపోయోగాత్, అర్చకస్యాతి శ్యాయనాత్,
అభి రూప్యాచ్చ బింబానాం, దేవ సాన్నిధ్య మృచ్ఛతి.

తాత్పర్యము: :అర్చకుని తపస్సు, యోగము, వినయము, భక్తి ప్రపత్తులు, ఆచారము, మంత్ర సౌష్టవముల వలన దేవతా విగ్రహాములు దైవ సాన్నిధ్య శక్తిని గలిగి లోకానుగ్రహము కలిగించగలవు......మనుస్మృతి". ఈ శ్లోకం శ్రీశైలక్షేత్రం లోని శిఖరేశ్వర ఆలయంలో కనపడుతుంది. మనుస్మృతి లోనిదని తెలుస్తోంది. అర్చకునికి ఉండవలసిన లక్షణాలేవో ఈ శ్లోకంలో తెలుస్తుంది. అర్చకుడు తపస్సు చేయాలి. తపస్సు అంటే తపించడం, వేగిపోవడం. ఏ స్వామిని అర్చిస్తున్నారో ఆ స్వామి సేవలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ స్వామికి ఏమి కావాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే నిరంతర తపస్సులో ఉండాలి. యోగం లేకపోతే ఇవేవీ సాధ్యపడవు. ఆ యోగం పొందడానికి నిరంతరం కృషి చేయాలి. భగవంతుని పట్ల, భాగవతుల పట్ల వినయము కలిగి ఉండాలి. భక్తి, కలిగి ఉండాలి, భక్తి లేని పూజ పత్రి చేటు అని తెలుసు కదా. ప్రపత్తి కలిగివుండాలి. ప్రపత్తి అంటే శరణాగతి. ఏ స్వామిని సేవిస్తున్నారో ఆ స్వామిపట్ల 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అన్న భావాన్ని త్రికరణ శుద్ధిగాకలిగి ఉండాలి. ఆచారము పాటించాలి. శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలో 'ఆచార ప్రభవో ధర్మః' అన్నారు. సదాచారము నుండే ధర్మము ప్రభవిస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచారమును పాటించడం తప్పనిసరి. మంత్రాన్ని స్పష్ఠంగా ఉచ్చరించాలి. ఉచ్చారణలో దోషాలుంటే ప్రకంపనలలో తేడా వచ్చి, మంత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ మంత్రం సరిగా పనిచేయదు. కనుక ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. ఈ లక్షణాలన్నీ అర్చకునిలో ఉన్నప్పుడు, ఆ అర్చకుడు అర్చన చేసే బింబములో, అంటే విగ్రహములో, దైవసాన్నిధ్యం చేకూరుతుంది. అంటే, అర్చకుడి వలననే విగ్రహానికి ఒక ప్రత్యేకశక్తి వచ్చి చేరుతుంది. కొన్ని ఆలయాలలో అందుకే నిజమైన దైవసాన్నిధ్య అనుభూతి కలుగుతుంది. అందుకే, దైవం తరువాత ఆ స్థానం ఆలయాల్లో నిస్సందేహంగా అర్చకునిదే.

***************************************************
54
లోకంబులు లోకేశులు
లోస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్. 

భావం: ఈ శ్లోకం పోతన రాసిన భాగవతం లోని గజేంద్రమోక్షం ఘట్టం లోనిది. సంపూర్తిగా తన శక్తి నశించింది అని గ్రహించిన గజేంద్రుడు శరణాగతి కోరుతూ ఎవరో, ఏమిటో తెలియని ఆ జ్యోతి స్వరూపుడిని రక్షణ కోరుతూ చెప్పిన పద్యం ఇది. "ఈ సమస్త లోకాలన్నీ దాటి, ఆ లోకాలను పాలించే లోకేశులనూ దాటి, ఆయా లోకాలలో జీవిస్తున్న లోకస్థులనూ దాటి, ఆ పైన ఏదీ అగుపడని అలోకమైన ఆ గాఢాంధకారాన్ని దాటి, ఆపై ఎవడైతే ఏకాకృతిలో జ్యోతి స్వరూపుడై వెలుగుతున్నాడో వాడినే నేను సేవిస్తాను" అని గజేంద్రుడు అనుకున్నాడు. ప్రాణాల మీద ఆశ పోయింది, దేహబలమూ పోయింది, అండగా వున్న సహచర బృందమూ పోయింది. తన పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచ తన్మాత్రలూ, బుద్ధి, మనసు, చిత్తము, అహంకారము అన్నీ నశించాయన్న సంగతి అవగతం అయింది. ఇంక తనను ఈ లోకాలలో ఉన్న వారెవ్వరూ రక్షించలేరనే విషయం బోధపడిపోయింది. వీటన్నిటికీ పైనున్న ఆ ఖగోళమును దాటి మహా ప్రకాశవంతంగా వెలుగుతున్న ద్యుతి(కాంతి) ఏదున్నదో అదొక్కటే తనను రక్షించగలదన్న భావం ఏర్పడింది. అప్పుడు కలిగిన స్థితి, "అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ". ఆ వెలుగు స్త్రీ రూపమో, పురుష రూపమో, నపుంసక రూపమో తెలియదు. కానీ తనకు ఆ వెలుగు ఒక్కటే దిక్కన్న జ్ఞానం కలిగింది. అప్పుడు గజేంద్రుడు, "ఓ జ్యోతి స్వరూపమా, నేను నిన్ను సేవిస్తాను, నన్ను కాపాడు", అని ప్రార్ధించాడు. ఆ స్థితికి గజేంద్రుడు చేరుకోవడానికి ఎంత కష్టపడ్డాడో. 

***************************************************
55
దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే
ప్రీతిః సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవమ్‌ ।
శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టతా
యే చైవం పురుషాః కళాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః ॥

భావం: ఈ శ్లోకం భర్తృహరి చెప్పిన నీతిశతకం లోనిది. ఈ పద్యంలో ఎవరితో ఎలా ప్రవర్తిస్తే నీతి అనిపించుకుంటుందో, లోకమర్యాదను పొందుతారో చెప్పాడు. సుమారు 5వ శతాబ్దానికి చెందిన భర్తృహరి చెప్పిన నీతిసూత్రాలు ఈనాటికీ ఎంత చక్కగా సరిపోతాయో గమనించండి. "మన అనుకునే వారి పట్ల దాక్షిణ్యం అంటే కృపతో ఉండాలి. అంటే వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ, వారికి కావలసిన పనులు చేసిపెడుతూ ఉండాలి. మనకు సేవచేసే పరిజనుల పట్ల దయతో ఉండాలి. వారి పట్ల కఠినంగా ఉండరాదు. దుర్జనుల పట్ల ఎప్పుడూ కఠినంగానే ఉండాలి. పొరపాటున కూడా దుర్జనుల పట్ల మంచితనం కూడదు. సాధుసంతుల పట్ల ప్రీతిపాత్రంగా వ్యవహరించాలి. స్నేహంగా, ప్రేమగా ఉండాలి. నృపులతో అంటే నేతలతో,  నాయకులతో కాస్త నయముగా, మెత్తగా, లౌక్యంగా ప్రవర్తించాలి. విద్వాంసుల పట్ల పద్ధతిగా, సత్ప్రవర్తనతో, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. శత్రువుల పట్ల పరాక్రమాన్ని ప్రదర్శించాలి. నా జోలికి వస్తే జాగ్రత్త అని స్పష్టంగా తెలియచేయాలి. పెద్దల పట్ల క్షమతో ఉండాలి. పెద్దవాళ్ళు చాదస్తంతో ఏమి చేసినా ఓర్పు వహించాలి. పురుషులు స్త్రీల పట్ల (స్త్రీలు పురుషుల పట్ల) స్థిరంగా, దృఢంగా వ్యవహరించాలి. ఈ లక్షణాలన్నీ ఎవరైతే కలిగిఉంటారో వారికి ఈ లోకం మర్యాదని ఇస్తుంది." అటువంటి వారి వలననే ఈలోకం నిలబడుతుంది. వారికే ఈ లోకమంతా అనుకూలంగా ఉంటుంది. 

***************************************************
56
సంగీతమపి సాహిత్యం సరస్వాత్యా: కుచద్వయం
ఏకమాపాత మథురం అన్యదాలోచనామృతం

భావం: "సరస్వతీదేవికి ఉన్న రెండు స్తనములలో ఒకటి సంగీతాన్ని స్రవిస్తే, రెండవది సాహిత్యాన్ని స్రవిస్తుంది. మొదటిదైన సంగీతం పాతమధురం అయితే, రెండవదైన సాహిత్యం  ఆలోచనామృతం" అని ఈ శ్లోకం భావం. చక్కటి సంగీతాన్ని వింటూ ఉంటే, అది ఆపాతమధురం, అంటే ఎప్పుడు విన్నా మధురంగా ఉంటుంది, కర్ణపేయంగా ఉంటుంది. సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు. మంచి సాహిత్యం చదువుతూ ఉన్న కొద్దీ కొత్త కొత్త అద్భుతమైన ఆలోచనలు వచ్చి ఆ అమృతానందంలో మునిగి తేలుతూ ఉంటాం. ఈ శ్లోకంలో సరస్వతీదేవి తన పిల్లలకు ఇచ్చే స్తన్యమేమిటంటే, ఒక స్తనం నుంచి సంగీతం, మరో స్తనం నుంచి సాహిత్యం ఇస్తుంది అన్న భావన ఉంది. అందుకే, సంగీతకారులు, సాహిత్యకారులని సరస్వతీ పుత్రులని అంటూ ఉంటారు. ఆ జగజ్జనని స్తన్యం లభించడం ఎంతో అపురూపం. మహా భక్తుడు, జ్ఞాని, కవి జ్ఞానసంబంధర్ కి స్వయంగా పార్వతీదేవే తన స్తన్యం ఇచ్చి, మహాపండితుడిని చేసిందని గాధలు ఉన్నాయి. మూడోయేటి నుంచే కవిత్వం చెప్పిన కవి జ్ఞానసంబంధర్. అమ్మవారి స్తన్యం మహాత్మ్యం అది. సరస్వతీ పుత్రులకి అమ్మవారు ఇచ్చే వరం సంగీతం, సాహిత్యం. సరస్వత్యై నమః.     

***************************************************
57
పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే (పీడతే) 
తఛ్ఛాంతిః  ఔషధైః దానైః జప హోమ క్రియాదిభిః 

భావం: "పూర్వజన్మలలో చేసిన పాపం వ్యాధి రూపంలో బాధిస్తూ, పీడిస్తూ ఉంటుంది.  ఔషధములు సేవించడం, దానములు, జపములు, హోమములు చేయడం లేదా చేయించడం వలన ఆ బాధకు శాంతి కలుగుతుంది". ఎంతోమంది ఎప్పటికీ తగ్గని, బాగా వేధించి బాధపెట్టే అనారోగ్యంతో జీవితంలో ఎక్కువకాలం యాతన పడుతూ ఉంటారు. అటువంటివారు ఎప్పుడూ తమకే ఎందుకిలా అయిందీ అని దుఃఖపడుతూ ఉంటారు. ఏ పూర్వ జన్మల్లో చేసిన పాపమో ఈ విధంగా వ్యాధుల రూపంలో వేధిస్తుంది అని శాస్త్రవచనం. అదే శాస్త్రం ఆ పీడ నుంచి శాంతిని పొందడానికి నాలుగు ఉపాయాలూ చెప్పింది. అవి మొదటగా ఔషధాలు తీసుకోవాలి. ఇంకా ఆ వ్యాధి శాంతించకపోతే దానాలు, జపాలు, హోమాలు చేయాలి, లేదా చేయించాలి. ఇవి ఎవరి చేత్తో వారు చేసుకోవడమే శ్రేష్టం. ఎవరైనా రోగతీవ్రత వలన కానీ, మరొక ఇబ్బంది వలన కానీ స్వహస్తాలతో చేయలేకపోతే, ద్రవ్యము, ధనము ఇచ్చి ఈ సంకల్పంతో మరొకరి చేత చేయించుకున్నా కూడా ఫలితం వస్తుంది. 

***************************************************
58
వనే రణే శత్రు జలాగ్ని మధ్యే
మహార్ణవే పర్వత మస్తకే వా ।
సుప్తం ప్రమత్తం విషమ స్థితం వా
రక్షంతి పుణ్యాని పురాకృతాని ॥

భావం: కీకారణ్యంలో దిక్కుతోచక ఉన్నపుడు, యుద్ధభూమిలో పోరాడుతున్నపుడు, శత్రువులు చుట్టు ముట్టినపుడు, నీటి ప్రవాహం మధ్యలో చిక్కుకున్నప్పుడు, అగ్నికీలలు చుట్టూ వ్యాపిస్తున్నపుడు, మహాసముద్రం మధ్యలో నిస్సహాయంగా ఉన్నపుడు, ఎత్తైన పర్వత శిఖరాలపై ఉన్నపుడు, ఆదమరచి నిద్ర పోతున్నప్పుడు, అప్రమత్తంగా, అజాగ్రత్తగా ఉన్నపుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు, రక్షించేది కేవలం పురాకృతాని పుణ్యాని, అంటే గతంలో చేసుకున్న పుణ్యం మాత్రమే అని అర్ధం. కనుక ఎవరినైనా, ఎప్పుడైనా, ఎటువంటి ఆపత్కాలంలో అయినా రక్షించేది వారు పూర్వం చేసుకున్న పుణ్యమే. ఆ పురాకృత పుణ్యబలం మాత్రమే కష్టాల నుంచి కాపాడి గట్టెక్కిస్తుంది. ఈ శ్లోకం భర్తృహరి చెప్పిన నీతిశతకం లోనిది. 

***************************************************
59 
నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, 
అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్

భావం: చేసిన కర్మ శతకోటి కల్పాలైనా క్షీణించదు, అది శుభకర్మ అయినా, అశుభ కర్మ అయినా అని శాస్త్రవచనం. ఎప్పటికైనా కర్మ ఫలితాన్ని అనుభవించవలసినదే. దానినుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. సాక్షాత్తూ ఆ రామకృష్ణులకు, పార్వతీదేవికి కూడా కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. భృగుపత్నిని సంహరించిన కారణాన, భృగుశాపం వలన, రాముని అవతారంలో భార్యావియోగం అనుభవించాడు రాముడు. రాముని అవతారంలో వాలిని వేటాడినందుకు, కృష్ణావతారంలో బోయవాడి బాణం కాలి బొటనవేలికి తగిలి అవతారం చాలించాడు కృష్ణుడు. పార్వతి కేళిగా ఒక్కక్షణం శివుని కన్నులు మూసినందుకు,  భూలోకంలో పుట్టి శివుని కొరకు తపస్సు చేసి, ఆ కర్మ పరిపాకం అయిన తరువాతే శివుణ్ణి చేరుకుంది. ఎందుకంటే శివుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే విశ్వమంతా కొన్ని కల్పాల పాటు చీకటిలో మునిగిపోతుంది. కనుక ఎంతటివారు అయినా చేసిన ఏకర్మ అయినా అనుభవించి తీరవలసిందే. మానవమాత్రులం మనమెంత. 

***************************************************
60
కర్మణా జాయతే భక్తిః  భక్త్యా జ్ఞానం ప్రజాయతే
జ్ఞానాత్ప్రజాయతే ముక్తిః ఇతి శాస్త్రార్థ సంగ్రహః 

భావం: కర్మ వలన భక్తి , భక్తి వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి లభిస్తుంది అని సర్వశాస్త్ర సిద్ధాంత సారము. ఆ విధంగా ముక్తికి దారి తీసే కర్మ నిష్కామంగా ఉండాలి. కేవలము నిష్కామ కర్మాచరణ వలన మాత్రమే భగవద్భక్తి వస్తుంది. అప్పుడు భగవదనుగ్రహం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. అటువంటి ఆత్మజ్ఞానము మాత్రమే బంధాల నుంచి విముక్తులను చేసి మోక్షానికి దారి చూపిస్తుంది. మోక్షం లభించాలంటే ఈ మార్గాన్ని శ్రీమద్భగవద్గీత సూచిస్తోంది. కర్మను మానకూడదు, కానీ నిష్కామ కర్మ చెయ్యాలి. నిజమైన భగవద్భక్తిని పొంది ఆ అపూర్వ భగవత్విభూతిని అనుభవించాలి. అటువంటి భక్తి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మానందాన్ని అనుభవించాలి. ఆ స్వచ్ఛమైన ఆత్మానందమే మోక్షానికి మార్గమవుతుంది. సర్వ శాస్త్రాలూ చెప్పేది ఇదే. 

***************************************************
61 
మాతృవత్ పరదారేషు, పరద్రవ్యేషు లోష్టవత్,
ఆత్మవత్ సర్వభూతేషు, యః పశ్యతి స పండితః

భావం: ఈ శ్లోకం హితోపదేశం లోనిది. ఈ శ్లోకంలో అసలు సిసలైన పండితుడి లక్షణాలను చెప్పాడు కవి. పరదారలను అంటే పరస్త్రీలను, ఇతరుల భార్యలను మాతృవత్ అంటే తల్లి వలె గౌరవంగా చూడాలి. పర ద్రవ్యాలను, అంటే ఇతరుల సొత్తును లోష్టవత్ అంటే మట్టిముద్ద వలె భావించాలి. తనను తాను ఎలా భావిస్తాడో, ప్రేమిస్తాడో, అదే విధమైన ధోరణి సకల జీవుల పట్లా చూపాలి. ఈవిధంగా ఎవరైతే చూడగలరో వారే పండితులు. ఈ రోజుల్లో ఈ లక్షణాలేమీ లేనివారు కూడా పండితులుగా చలామణీ అవడం చూస్తూనే వున్నాము. పండితులను గుర్తించి గౌరవించండి. అపండితులనూ, కుపండితులనూ దూరం పెట్టండి. 

***************************************************
62
విద్యా మిత్రం ప్రవాసేషు, భార్యా మిత్రం గృహేషు చ, 
వ్యాధితః ఔషధం మిత్రం, ధర్మో మిత్రం మృతస్య చ. 

భావం: ప్రవాసంలో ఉన్నవారికి విద్యయే స్నేహితుడు. అంటే సంపాదించిన జ్ఞానమే పరాయి ప్రాంతాల్లో తోడుగా ఉండే స్నేహితుడు. అదే ఇంట్లో ఉన్న సమయాల్లో భార్య (భర్త) మిత్రుడు. ఇంట్లో ఎప్పుడూ కలసిమెలిసి ఉండవలసింది వీరే కదా. కొన్నేళ్ల సాహచర్యంలో భార్యాభర్తలు మంచిమిత్రులై పోతారు. అలా అయిపోవాలి కూడాను. ఆ విధంగా ఆలుమగలు స్నేహితులైతే, ఆ దాంపత్యం స్వర్గతుల్యం. వ్యాధితో బాధపడుతున్న వారికి ఔషధమే ఆత్మీయ మిత్రుడు. ఎంతమంది చుట్టూ ఉన్నా, రోగికి కావలసింది మందే కదా. అందుకే రోగికి ఉపయోగకరమైన మిత్రుడు ఔషధమే. మరణించిన వారికి వారు చేసుకున్న ధర్మమే సదా వెంట ఉండే మిత్రుడు. "చేసిన ధర్మము, చెడని పదార్ధము, చేరును నీ వెంటా" అంటుంది తత్త్వం. మరణం తరువాత కూడా ఆ జీవికి వెంట వచ్చేది ఈ ఒక్క ధర్మమే. ఇహం లోనే కాకుండా పరం లోనూ మనల్ని అంటిపెట్టుకుని ఉండేది మనం చేసుకున్న ధర్మమే. ఈ లోకం లోనే కాకుండా పరలోకం లోనూ చలామణీ అయ్యే ఏకైక దినుసు ధర్మం. కనుక ఎంత ధర్మబద్ధంగా జీవిస్తే, ధర్మం ఖాతా అంత పెరుగుతుంది. ధర్మంగా జీవించండి, ఇహ, పర లోకాలలో హాయిగా ఉండండి. ఈ శ్లోకం చాణక్యనీతి లోనిది. 

***************************************************
63
వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి 
లోకోత్తరాణాం చేతాంసి కో హి విజ్ఞాతు మర్హతి  

భావం: ఈ శ్లోకం రామాయణం లోనిది. కొంతమంది ఎప్పుడూ వజ్రం వలె కఠినంగా ఉంటారు. కొంతమంది ఎప్పుడూ కుసుమం వలె మృదువుగా ఉంటారు. ఎందుకు కొందరు కఠినంగా ఉంటారో, ఎందుకు కొందరు మృదువుగా ఉంటారో, సాధారణంగా సామాన్యులకు ఎవరికీ అర్ధం కాదు. కానీ  లోకోత్తరులైన మహానుభావులు కొందరు సందర్భాన్ని బట్టి కఠినం గానూ ఉండగలరు, మృదువు గానూ ఉండగలరు. సహజంగా మృదుస్వభావి అయిన సీత, రావణుడు పట్ల ఎంత నిష్కర్షగా, కఠినంగా ఉండాలో చూపించింది. రావణుడంతటి వాణ్ణి గడ్డిపరక వలె తీసిపారేసింది. కారణం: కొంతమందితో కఠినంగా మాత్రమే ఉండాలి. పొరపాటున కూడా వారి పట్ల జాలి చూపకూడదు. ఆ విధంగా జాలి చూపి, మృదువుగా ప్రవర్తిస్తే, ఫలితాలు భయంకరంగా ఉంటాయి. కనుకే రామాయణంలో సీత హృదయాన్ని 'వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి'  అని వర్ణించారు. ఇటువంటి గొప్పవారి మనసులను సామాన్యులు అర్ధం చేసుకోలేరు అని ఈ శ్లోకం చెప్తోంది. కానీ 'వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి' అనే తత్త్వం అందరూ అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. పాటించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కదా. కొంతమందితో కఠినంగా ఉండాలి, కొంతమంది పట్ల మృదువుగా ఉండాలి. ప్రతివారూ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని మసలాలి. 

***************************************************
64
యత్రనార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
యత్రై తాస్తు న పూజ్యంతే, సర్వాస్తత్రా ఫలాఃక్రియాః

భావం: "ఎక్కడ నారీమణులు పూజింపబడతారో, అక్కడ దేవతలు ఇష్టంగా క్రీడిస్తారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడరో, అక్కడ ఏపని చేసినా నిష్ఫలం అవుతుంది." ఈ శ్లోకం భావార్ధం ఇది. ఇది మనుస్మృతి లోనిది. ఇప్పటికీ లోకంలో శ్రుతులు, స్మృతులు అంటే చాందస భావాలను గురించి చెప్తాయని, తక్కువ చూపు ఉంది. మనుస్మృతి అంటే కొంతమంది ఆధునికులకు చదవకుండానే ఎందుకో  ద్వేషం. కానీ అందరూ ఏ గ్రంధమైనా సరే ఒకసారి మూలపాఠం కానీ లేదా కనీసం దానికి న్యాయం చేసిన ఏదైనా అనువాదం కానీ చదివి, అప్పుడు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే బావుంటుంది అనేది నా అభిప్రాయం. ఎక్కడ స్త్రీలకు గౌరవం ఉంటుందో, అక్కడ దేవతలు సుఖంగా, సంతోషంగా ఉంటారు అని మనుస్మృతిలో ఉంది. అంతేకాక, ఎక్కడైతే స్త్రీలు ఆనందంగా ఉండరో అక్కడ ఏ పనులు చేసినా ఫలితాన్నివ్వవు అని కూడా ఆ శ్లోకంలోనే చెప్పారు. మన సనాతన సంస్కృతి స్త్రీలకు ఎంత గౌరవనీయమైన స్థానం ఇచ్చిందో గమనించండి. "కలకంఠి కంట కన్నీరొలికితే తరగిపోవును సిరులు" అంటుంది మన సంప్రదాయం. స్త్రీ అంటే సత్వ, రజో, తమో (స త ర) గుణాలకు సుందర సమైక్య రూపం. నారీ ఏవ నారాయణీ. ఆ నారాయణికి నమస్కారం. 
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

***************************************************
65
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే 
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః 
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం

భావం: శ్రీ ఆదిశంకరాచార్య చెప్పిన అన్నపూర్ణా స్తోత్రం లోని శ్లోకాలు ఇవి. "తల్లీ, శంకర ప్రాణవల్లభీ, ఎప్పుడూ నిండుగా ఉండే అన్నపాత్రతో ఎవరు ఏమి కోరినా వారి ఆకలిని తీర్చే అన్నపూర్ణా దేవీ, జ్ఞాన, వైరాగ్యములనే భిక్షను నాకు నీ అనుగ్రహంగా ఇవ్వమ్మా". "పార్వతీ దేవియే నా తల్లి, మహేశ్వరుడే నా తండ్రి, శివభక్తులే నాకు బంధువులు. మీరు పాలిస్తున్న ఈ త్రిభువనాలూ నా ఇల్లేనమ్మా". ఆ జగత్పితరులైన శివపార్వతులనే స్వయంగా తల్లీ తండ్రిగా భావించే ఆదిశంకరుని వంటి వారికి, శివభక్తులే బంధువులు, స్నేహితులు. వారి సామ్రాజ్యమే వీరికి ఇల్లూ వాకిలీను. అన్నపూర్ణ తనను ఆశ్రయించిన వారందరి క్షుద్బాధను తెలుసుకుని, చేత పూర్ణ కుంభంతో, వారి కడుపు నింపడానికి సదా సిద్ధంగా ఉంటుంది. ఆ అన్నపూర్ణను, ఆది శంకరులు 'అమ్మా, నాకు కావలసింది జ్ఞానము, వైరాగ్యము తల్లీ, ఆ బిక్ష ప్రసాదించు' అని యాచిస్తున్నాడు. సాక్షాత్తూ అన్నపూర్ణయే ప్రసన్నమై, ప్రత్యక్షమైతే బిక్షగా ఏమి కోరుకోవాలో శంకరభగవత్పాదుడికి బాగా తెలుసు.

ఇదే భావాన్ని వేమన ఇలా చెప్పాడు.
తల్లి గౌరి తనకు దండ్రియే శంభుండు
ప్రమథగణము లఖిలబాంధవులు
తనకు బుట్టినిల్లు తనరు గైలాసంబు
విశ్వదాభిరామ వినర వేమ.

***************************************************
66
సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనా క్రమాంత్యా ఋషయో హ్యాప్తాకామా
యత్ర తత్ సత్యస్య పరమమ్ నిధానమ్

భావం: 'సత్యమేవ జయతే', సత్యము మాత్రమే జయిస్తుంది, 'న అనృతమ్' అంటే అసత్యము కాదు అని అర్థం. ఆ సత్యమార్గంలోనే దివ్యులు, దేవతలు పయనించిన పథం మనకు విదితం అవుతుంది. మన పూర్వ ఋషులు ఆ సత్యమార్గంలో పయనించే తమ అభీష్టాలను, తీర్చుకుని వారి గమ్యాలకు చేరారు. ఆ సత్యమార్గం ద్వారా మాత్రమే ఎవరైనా దేవతలు పయనించే మార్గాన్ని కనుగొని, పరమపదాన్ని చేరుకోగలరు. సత్యమార్గాన్ని విడనాడిన వారికి, ఆ దేవయానం దొరకక పరమపదాన్ని పొందలేకపోతారు. దాని వలన వారు కేవలం ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు. ఎవరైనా, ఎప్పటికైనా ఆ పరమపదాన్ని, ఆ పరమాత్మను చేరుకోవడానికి సాధనం ఒక్క సత్యమార్గం మాత్రమే. ఈ శ్లోకం ముండకోపనిషత్తు లోనిది. ఈ శ్లోకం లోని ప్రథమ పాదంలోని అర్ధభాగమైన సత్యమేవ జయతే  అన్న పదాలు తీసుకుని మన భారతదేశ జాతీయ చిహ్నంలో పొందుపరిచారు. న అనృతమ్ అనే ప్రథమ పాదంలోని ద్వితీయార్ద భాగాన్ని కూడా చేరిస్తే బాగుండేదేమో. అప్పుడు అసత్యం ఎప్పుడూ గెలవదు అనే సందేశం కూడా మన జాతీయచిహ్నం ఇచ్చినట్లయేది. చివరిగా ఎప్పటికైనా జయించేది సత్యమే, అసత్యం ఎప్పుడూ జయించదు. 

***************************************************
67
బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః 
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కోఽపి న సక్తః 

భావం: బాల్యంలో క్రీడలంటే ఇష్టం. యవ్వనంలో స్త్రీ పురుషులకు, ఒకరిపై మరొకరికి ఆసక్తి. వృద్ధాప్యం వచ్చేసరికి ఎక్కడ లేని చింతలన్నీ చుట్టుముడతాయి. ఇక ఆ పరబ్రహ్మ పట్ల ఆసక్తి చూపించేదెప్పుడు. ఈ శ్లోకం ఆదిశంకరుడు చెప్పిన భజగోవిందం అని ప్రాచుర్యం పొందిన మోహముద్గర లోనిది. చిన్నప్పుడేమో ఆటపాటలపై ఆసక్తి చూపించే పిల్లలు, యవ్వనం పొడ  చూపగానే సహచరుల పట్ల ఆసక్తి చూపిస్తారు. స్త్రీలైతే పురుషుల పట్ల, పురుషులైతే స్త్రీల పట్ల పరస్పరం ఆకర్షితులవుతారు. ఇక కొద్దిపాటి వృద్ధాప్య ఛాయలు కనిపించగానే, అనేక చింతలు మొదలవుతాయి. ఆరోగ్య చింత, ఆహార చింత, ఆర్ధిక చింత, గృహ చింత ఇలా ఎన్నో ఎన్నెన్నో చుట్టుముడతాయి. ఇవన్నీ సరే, మరి ఈ చింత, ఈ ప్రేమ, ఈ ఆసక్తి, ఈ ఇష్టం ఆ పరబ్రహ్మ వైపు ఎప్పుడు చూపిస్తావు, అని సౌమ్యంగానే అయినా నిర్మొహమాటంగా నిలదీస్తున్నాడు ఆదిశంకరుడు. తనవారిని సరైన మార్గంలో పెట్టడమే కదా సద్గురువు పని. అందరినీ మేల్కొల్పుతూ, 'ఈ చింతలు, ఈ ప్రేమాసక్తులూ ఇక చాలు, భజగోవిందం. గోవిందుణ్ణి భజించండి, అది మాత్రమే అవసర వేళల ఆదుకుంటుంది' అని బోధిస్తున్నాడు జగద్గురువు ఆది శంకరాచార్యుడు.  

***************************************************
68
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు, వినుత గుణశీల, మాటలు వేయునేల?

భావం: మందారపువ్వులోని మధువుకు అలవాటు పడ్డ తుమ్మెద ఉమ్మెత్తపువ్వుల వద్దకు పోదు.  నిర్మలంగా, శాంతంగా, చల్లగా, మందంగా గాలిని వీచే మందాకినీ నదిని వదిలి రాజహంస వేగంగా, 
ఉధృతంగా పారే సెలయేళ్ళ వద్దకు వెళ్ళదు. చక్కని లేలేత చిగుళ్లు తింటూ ఆనందించే కోయిల కొండమల్లె చెట్టుపై వాలదు. పూర్ణ చంద్రుని వెన్నెలను ఆస్వాదిస్తున్న చకోరపక్షి చిక్కని మంచుపై ఆనందపడలేదు. ఆ దామోదరుని దివ్యపాదాలనే మనస్సులో నిల్పుకొని, హరిభక్తి అనే అమృతాన్ని సేవించి తన్మయత్వంతో వున్న నాకు, ఇతరములైన ఏ విషయములూ సుఖమివ్వవు. వెయ్యి మాటలెందుకు తండ్రీ, నేను హరిని వదిలిపెట్టి ఇతరములపై మనసు పెట్టలేను. ప్రహ్లాదుడు తండ్రికి ఏవిధంగా గొప్పవాటికి అలవాటు పడ్డ పక్షులు కూడా ఇతర విషయాలపై ఆసక్తి చూపలేవో, అదేవిధంగా నేను కూడా హరిభక్తిని వదలలేను, అని ప్రహ్లాదుడు తండ్రితో ఎంతో వినయంగా, ఆర్ద్రంగా చెప్పుకున్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడు పోల్చిన ఇతర విశేషములు కూడా సామాన్యమైనవి కావు, అయినప్పటికీ తుమ్మెదకు మందారపువ్వు తేనే ఇష్టం, రాజహంసకు మందాకినీ గాలి అంటేనే ఇష్టం, కోకిలకు కమ్మని లేలేత చిగుళ్లే ఇష్టం, చకోరపక్షికి పండువెన్నెలే ఇష్టం, నాకు హరినామామృతమే ఇష్టం అని మృదువుగానే అయినా ఖండితంగా చెప్పాడు. ఈ పద్యం పోతన వ్రాసిన శ్రీమదాంధ్ర భాగవతము లోనిది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో  హరి భక్తి లోని గొప్పదనాన్ని చెప్పిన పద్యం. 

***************************************************
69
హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్ 
తత్ త్వం పూషన్  అపావృణు సత్యధర్మాయ దృష్టయే

భావం: 'సత్యం యొక్క ముఖాన్ని చూడనీయకుండా, ఒక ప్రకాశవంతమైన బంగరుపళ్లెం అడ్డుగా ఉంది. ఓ సూర్యుడా, సత్యధర్మ దర్శనార్థమై, ఆ బంగారు పళ్ళాన్ని అడ్డు తొలగించు' అని పూషన్ అనే మనకు పోషణ నిచ్చే సూర్యుడిని ప్రార్థించే శ్లోకమిది. సంపూర్ణంగా అంధకారం  అలుముకున్నప్పుడు, లేదా కనులు మిరుమిట్లు గొలిపే కాంతి కమ్మేసినప్పుడు కనులకు ఏమీ కనపడదు. మహా ప్రకాశవంతమైన సూర్యుని వెనుక ఒక గొప్ప బ్రహ్మసత్యం దాగి ఉంది. సూర్యుడు ధగద్ధగాయమానంగా వెలిగిపోతుంటే, కన్నులు మూసేసే అద్భుతమైన ఆ కాంతులను దాటి వెళ్లేదెప్పుడు, ఆ జిలుగువెలుగుల వెనుక ఉన్న సత్యం, ధర్మం ప్రకటితమయ్యేదెప్పుడు, దానిని మనం దర్శించేదెప్పుడు. తళుకుబెళుకుల వెనుక దాగి వున్న సత్యాలని దాచడానికి బంగారు పళ్ళాలు వంటి ప్రలోభాలు ఎన్నో ఉంటాయి. అటువంటి  ప్రలోభాలన్నీ అధిగమించి స్థిరమైన బుద్ధితో నిలబడి, సత్య ధర్మ దర్శనం చేయాలి. మొక్కవోని దీక్షతో సత్యాన్వేషణలో స్థిరంగా నిలబడాలి. ఈ ప్రక్రియలో సూర్యుణ్ణి ధ్యానించి దారి చూపమని ప్రార్ధించాలి. ఎందుకంటే, ఆ బంగారుమూతలను తొలగించవలసినది ఆ సూర్యుడే. ఈనాటికీ ప్రస్తుత ప్రపంచంలో సత్యాన్ని, ధర్మాన్ని దాచిపెట్టి ఉంచడానికి వాడేది సువర్ణమే, లేదా అటువంటి ధనం, అధికారం వంటి ప్రలోభాలనే. ఎంతో దృఢదీక్షతో నిలబడితేనే కానీ సత్య దర్శనం కాదు. కనులకు అంధకారం పులిమే కాంతితో వెలిగిపోయే, సూర్యుణ్ణి ఎంతో దీక్షగా, ధ్యానంగా ఉపాసిస్తేనే కానీ ఆ బంగారు మూతలన్నీ తొలగింపబడవు. అసలైన సత్య ధర్మ దర్శనం కాదు. కనుకనే తత్ త్వం పూషన్ అపావృణు. ఈ శ్లోకం ఈశావాస్య ఉపనిషత్తు లోనిది.

***************************************************
70
ఒరులేయని యొనరించిన 
నరవర! యప్రియము దన మనంబున కగు దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

భావం: రాజా, ఇతరులు ఏమి చేస్తే, ఎలా ప్రవర్తిస్తే, మనకు బాధ కలుగుతుందో, ఆ విధంగా మనము మరొకరితో ప్రవర్తించకుండా ఉండటమే అన్ని ధర్మాలలో కెల్లా గొప్ప ధర్మము అని భారతం చెప్పింది. చాలామంది ఇతరుల మాటలు, చేష్టలు వలన బాధపడతారు. కానీ తిరిగి అటువంటి సందర్భము వచ్చినపుడు తామూ అదే విధంగా ప్రవర్తిస్తే, అది ధర్మవర్తన కాదు. ధర్మములలో కెల్లా గొప్ప ధర్మము 'ఇతరులు ఏమి చేస్తే తమకు బాధ కలిగిందో, తాము ఆ విధంగా మరి ఒకరికి చేయకుండా ఉండటమే' అంటాడు వ్యాసుడు. అటువంటి సందర్భంలో నిగ్రహంతో, ఔచిత్యంతో ప్రవర్తించడమే అసలైన ధర్మనిరతి, పరిణతి. ఈ పద్యం ఆంధ్ర మహాభారతంలో శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన రాజనీతి.  

***************************************************
71
అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే 
త్వమిత్థముత్థాపిత పద్మయోనిః
అనంతభూమా మమ రోగరాశిం 
నిరుంధి వాతాలయవాస విష్ణో 

భావం: ":ఈ పద్మకల్పము యొక్క పాద్మకల్పుని పద్మయోనిలో సృష్టించి, గురువాయూర్ ఆలయంలో వెలసిన శ్రీమహావిష్ణూ, నన్ను వేధించే అనంతమైన రోగరాశిని దయతో సంపూర్తిగా నిర్మూలించు." ఇది శ్రీ మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారయణీయం లోని 8వ దశకంలోని, 13 వ శ్లోకం. నారాయణ భట్టతిరి తన గురువును చిరకాలంగా వేధిస్తున్న కీళ్లనొప్పిని  గురుదక్షిణగా  స్వీకరించి, తన గురువును రోగవిముక్తుణ్ణి చేస్తాడు. తరువాత నవగ్రహాలలో ఒకటైన గురువు, పంచభూతాలలో ఒకటైన వాయువు సేవిస్తున్న గురువాయూర్ ఆలయాన్ని చేరుకుంటాడు. అక్కడ నారాయణ భట్టతిరి భాగవతాన్ని శ్రీమన్నారాయణీయం అనే పేరుతో రచించి, ఆ దేవతానుగ్రహంతో తనకున్న రోగం నుంచి సంపూర్తిగా కోలుకుంటాడు. మొత్తం 100 దశకాలుగా, 1036 శ్లోకాలతో ఈ గ్రంథ రచన సాగింది. ఆ ఆలయంలో శ్రీమన్నారయణీయం మొత్తం పారాయణ చేసినా, కనీసం ఈ శ్లోకం 48 రోజులపాటు రోజూ 108 సార్లు, పారాయణ చేసినా అనంత రోగ రాశి కూడా నశిస్తుంది. వారిని శ్రీమన్నారాయణుడు, గురువు, వాయువు కటాక్షించి రోగనిర్మూలనం చేస్తారు అని ఒక గొప్ప విశ్వాసం. నారాయణ భట్టతిరి గారి వ్యాధి ఉపశమించటం వలన, ఈ నమ్మకం ఈనాటికీ నిలిచిఉంది. ఈ శ్లోకాన్ని 108 సార్లు, 48 రోజులు పారాయణ చేస్తే, ఏ ఆధి వ్యాధులైనా శాంతిస్తాయి అని కంచి కామకోటి పీఠం 68 వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి చెప్పారు. వారిని నడిచే దైవం అంటారు. 

***************************************************
72
అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.

భావం: "లక్ష్మణా, ఈ లంక ఎంత స్వర్ణమయమైనా నన్ను ఏమాత్రమూ ఆకర్షించడం లేదు. ఎంత చెప్పినా మాతృమూర్తి, మాతృభూమి స్వర్గాని కన్నా ఉన్నతమైనవి." ఈ శ్లోకం రామాయణంలో రాముడు లక్ష్మణుడితో చెప్పినట్టు ఉన్నది. రావణవధానంతరం విభీషణుడు రాముణ్ణి, నీవు యుద్ధం గెలిచావు కనుక వచ్చి లంకను ఏలుకో అంటాడు. అప్పుడు రాముడు విభీషణుడికి వద్దని చెప్తూ, లక్ష్మణుడితో ఈ మాట అంటాడు. లంక ఎంత బంగారు మయమైనా, నాకు జననీ, జన్మభూమీ అత్యంత ప్రియమైనవి అంటాడు. ఈనాటికీ నేపాల్ జాతీయచిహ్నంలో 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' అనే సందేశం ముద్రించి ఉంటుంది. 

***************************************************
73
సూర్యో యధా సర్వలోకస్య చక్షు
ర్నలిప్యతే చాక్షుహార్బాహ్యదోషైః
ఏకస్తథా సర్వభూతాంతరాత్మా 
న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః 

భావం: సూర్యుడు అన్నిటి మీద, అందరి మీద తన వెలుగు ప్రసరిస్తాడు. యదార్ధంగా చెప్పాలంటే ఈ లోకానికంతా లోకాన్నంతా చూపించే నిజమైన కన్ను సూర్యుడే. తాను అన్నిటిమీదా తన కాంతిని ప్రసరించినా ఆ యా పదార్ధముల యొక్క మంచి కానీ, చెడు కానీ సూర్యుడికి అంటదు. అన్నమయ్య అన్నట్టు, శునకము పైన ఏ సూర్యకాంతి పడిందో, ఏనుగు మీద కూడా అదే సూర్యకాంతి పడుతుంది. రాజు మీద వాలినా ఆ ఎండే, పేద మీద పడినా ఆ ఎండే. సూర్యుడికి రాజు మీద పడినందు వలన రాచరికమూ అంటదు, పేదవాని మీద పడితే దరిద్రమూ అంటదు. సూర్యుడికి అన్నీ ఒకటే. సూర్యుడు ఏ వస్తువు మీద ప్రతిఫలించినా, ఆ వస్తువు లక్షణాలేమీ సూర్యునికి అంటవు. అదేవిధంగా ప్రతిజీవి లోనూ అంతరాత్మగా ఉన్న ఆత్మకు కూడా ఆ జీవి లక్షణాలేవీ అంటవు. ఆ జీవి అనుభవించే కష్టసుఖాలు కానీ, బాధలు, బాధ్యతలు కానీ ఆత్మకు చెందవు. ఆత్మ అందరి లోనూ ఉన్నా, ఆత్మకు బాహ్యంగా ఉన్న ఏ కాలుష్యాలూ, కార్పణ్యాలూ అంటుకోవు. ఆత్మ సూర్యుడి వలె, ఏ జీవి వలనా ఏ మార్పూ చెందక, ఏ లక్షణమూ వహింపక, స్వచ్ఛంగా ఉంటుంది. ఈశ్లోకం కఠోపనిషత్తులో, నచికేతునికి యమధర్మరాజు వరంగా అందిస్తున్న
జ్ఞానబోధ.

***************************************************
74
చదవన్నేర్తురు పురుషుల్ వలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ 

భావం: ఈ పద్యం శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు వ్రాసిన నరకాసురవధ నాటకం లోనిది. సత్యభామ యుద్ధ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ శ్రీకృష్ణుడు చెప్పాడు.  స్త్రీలు పురుషుల వలెనే చదివిస్తే చక్కగా సకల శాస్త్రములూ చదవగలరు. నారీమణులు  ధనుర్విద్యలు, యుద్ధవిద్యలు నేర్పిస్తే, తమ శౌర్యప్రతాపాలతో శత్రుసేనలని అదిమి, దునుమాడగలరు. ఆడువారిని సింహాసనం పైన కూర్చుండబెడితే, నూతనోత్సాహముతో ఈ భూమినే నిరాటంకముగా ఏలగలరు. శ్రద్ధగా, ముద్దుగా, ముచ్చటగా నేర్పిస్తే ముదితలు నేర్వలేని విద్యయే లేదు. స్త్రీలు అబలలు కాదు, నేర్చుకునే అవకాశం వస్తే, ఇస్తే, వారు నేర్చుకోలేనిది అనేది ఈ లోకం లోనే లేదు. స్త్రీలు యుక్తిలో, శక్తిలో ఎంతో గొప్పవారు. ఈనాడు ఎందరో మహిళామణులు అనేక రంగాలలో ఎంతో తెలివైనవారన్న పేరు తెచ్చుకుని, ఉన్నతస్థానానికి చేరుకుని, ఈ విషయాన్ని రుజువు చేశారు.  

***************************************************
75
గుడి కూలును నుయి పూడును వడినీళ్లకుఁ జెరువు దెగును వనమిల ఖిలమౌను 
చెడనిది పద్యము సుమ్మీ కుడియెడమలు చూడకన్న గువ్వలచెన్నా

భావం: ఈ పద్యం గువ్వలచెన్నడు రచించిన గువ్వలచెన్నా శతకం లోనిది. సుమారు 17, 18 శతాబ్దంలో కడప ప్రాంతంలో గువ్వలచెన్నడు నివసించాడని తెలుస్తోంది. ఆతడు గువ్వలచెన్నా మకుటంతో రచించిన శతకం లోనిది ఈ పద్యం. సమాజంలో తాను చూసిన ఎన్నో రకాలైన అంశాలతో ఈ శతకరచన చేశాడు. చాలామంది ధార్మికులు గుళ్ళు కట్టిస్తూ ఉంటారు, వాపీ కూప తటాకాలు తవ్విస్తూ ఉంటారు. ఎంతో పెద్ద పెద్ద వనాలు, తోటలు నిర్మిస్తూ ఉంటారు. కానీ గుళ్ళు కొన్నేళ్ళకు కూలిపోతాయి. బావులు కూడా పాడయిపోయి, పూడిక చేరి,  పూడి పోతూ ఉంటాయి. వనాలు, తోటలు, తోపులు కొన్ని తరాలకు నాశనం అయిపోతూ ఉంటాయి. నగరీకరణ ప్రభావం వలన, గుళ్ళు, నూతులు, తోటలు మాయమైపోగా, ఒకప్పుడు ఇక్కడ గుళ్ళు, బావులు, తోటలు ఉండేవి అని చెప్పుకుంటూ ఉంటారు. వరద తాకిడికి చెరువులు కట్టలు తెగి, ఆ ప్రవాహం ఊళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవే. చెడిపోనిది ఏమైనా ఉన్నదీ అంటే, అనుమానం లేకుండా, కుడిఎడమలు చూసుకోకుండా, ఘంటాపథంగా చెప్పగలిగేది పద్యం ఒకటే అంటున్నాడు కవి గువ్వలచెన్నడు. నిజమే కదా, మనం కూలిపోయిన గుళ్ళు, పూడిపోయిన బావులు, కట్టలు తెగి వేగంగా ఊళ్లని ముంచేస్తున్న చెరువులు, నశించిపోయిన వనాలు, తోటలు చూస్తూనే ఉన్నాం. పద్యాలు, కావ్యాలు మాత్రం ఈనాటికీ అందరి నోళ్ళల్లో చిరంజీవిగా ఉన్నాయి. ఎన్నో యుగాల క్రితం వాల్మీకి రచించిన ఆదికావ్యం ఈనాటికీ స్థిరంగా నిలిచిపోయి ఉన్నది. ఆదికవి వాల్మీకి చెప్పిన  "మా నిషాద! ప్రతిష్ఠాం త్వం అగమ శ్శాశ్వతీః సమాః, యత్క్రౌంచ మిథునాదేకమ్ అవధీః కామమోహితమ్అనే మొదటి శ్లోకం ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నాం కదా. 

***************************************************
76
ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః  ఓం తదాత్మా
ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం  ఓం తత్ పురోర్నమః 
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు 
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వ మింద్రస్త్వగ్ం
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః
త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం  
బ్రహ్మ భూర్భువస్సువరోం

భావం: ఈ మంత్రం (మహా)నారాయణోపనిషత్తులో 68 వ అనువాకం లోనిది. యజుర్వేదము లోని తైత్తరీయ అరణ్యకంలో నుంచి గ్రహించారు. ఈ మంత్రాలను మంత్రపుష్పంలో కూడా వాడుతారు. "ప్రణవస్వరూపములో ఉన్న ఓ పరబ్రహ్మా, నీవే బ్రహ్మ, నీవే వాయువు, నీవే ఆత్మ, నీవే సత్యం, నీవే సర్వం, నీకు నా నమస్సులు. అన్ని భూతముల అంతరాలలో తిరుగాడుతూ, అనాహతమైన గుహలలో రహస్యముగా దాగున్న నీవే ఈ విశ్వమూర్తివి. నీవే యజ్ఞము, నీవే యజ్ఞములలో ఉచ్చరించే మంత్రము, నీవే ఇంద్రుడవు, నీవే రుద్రుడవు, నీవే విష్ణువు, నీవే ప్రజాపతివి ఐన బ్రహ్మవి. నీవే జలము, నీవే జ్యోతివి, అమృతాధారమైన రసమూ నీవే. బ్రహ్మలోకము, భూలోకము, భువర్లోకము, సువర్లోకముల స్వరూపమూ సాక్షాత్తూ నీవే." మననము చేస్తూ ఉంటే రక్షించేది మంత్రము. ఆ మంత్రమునే పుష్పముగా భావిస్తూ పరమాత్మ సేవలో సమర్పించేదే మంత్రపుష్పం. మంత్రపుష్పంలో భావించేది సర్వ భూతాంతరాత్ముడైన ఆ పరమాత్మనే. అందుకే పూజించేది ఏ దేవీ దేవతా స్వరూపమైనా మంత్రపుష్పం మాత్రం అందరికీ ఒక్కటే. అంతర్గతంగా అన్ని జీవుల హృదయకుహరాలలో గుహ్యంగా సంచరించే విశ్వమూర్తి అయిన ఆ పరమాత్మను అనేక రూపాలలో గుర్తించడమే మంత్రపుష్పం. ఆ విశ్వమూర్తే, ఆ ఆత్మ స్వరూపమే, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర రూపాలలో ఉన్నది. ఆ ఆత్మ స్వరూపమే సర్వమూ, సత్యమూ. అదే జీవాధారమైన వాయువు, జలము, అమృతోపమానమైన రసము, వెలుగు, ముల్లోకాలూ అదే. యజ్ఞమూ, యజ్ఞమంత్రమూ కూడా అదే. ఆ విశ్వాంతరాత్మకు నమస్సులు.

***************************************************
77
నరవర, నీచే నాచే
వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్
ధర చేతను భార్గవు చేతను
అరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్ 

భావం: ఇది మహాభారతం లోని కర్ణపర్వం లోనిది. కౌరవుల వైపు భీష్మ ద్రోణుల తరువాత కర్ణుడూ, ఆ తరువాత శల్యుడూ సారథ్యం వహించారు. పదిహేడవ రోజు కర్ణుడు కూలిపోయాడు. గొప్ప యోధుణ్ణి వధించానని అర్జునుడు ఆనందంగా ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, 'ఈ కార్యం కేవలం నీ ఒక్కడి వలననే కాలేదు, కర్ణుడి మరణం వెనుక ఆరుగురు ఉన్నారని అంటాడు. "కర్ణుడితో హోరాహోరీ యుద్ధం చేసిన నువ్వు, నీ రథాన్ని చాకచక్యంగా నడిపిన నేను, పాండవులను చంపవద్దని వరం కోరిన తల్లి కుంతి, జన్మసిద్ధమైన సహజ కవచకుండలాలను దానంగా కోరిన ఇంద్రుడు, యుద్ధ సమయంలో రథచక్రాలు కూరుకుని పోయేలా చేసిన భూమి, అవసర సమయంలో తాను నేర్పిన అస్త్రశస్త్రాలేవీ ఉపయోగపడవు అని శాపమిచ్చిన గురువు పరశురాముడు", మనం ఆరుగురం కలిసి కర్ణుని చంపాము అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అంతేకాక, యుద్ధసమయంలో కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ, అర్జునుడి పరాక్రమాన్ని పొగడుతూ సారథిగా చెయ్యకూడని పనులు చేసిన శల్యుడు కూడా ఒక కనబడని కారణం. ప్రత్యక్షంగా అర్జునుడు, శ్రీకృష్ణుడు కర్ణుడి మరణానికి కారకులు. యుద్ధానికి ముందు కుంతి కర్ణుడిని రహస్యంగా కలిసి, అతగాడి జన్మ రహస్యం చెప్తూ, పంచ పాండవులు సోదరులు కనుక వారిని యుద్ధంలో చంపే అవకాశం వచ్చినా వదిలెయ్యమని వరం అడిగింది. దానికి కర్ణుడు అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురినీ వదిలేస్తానని తల్లికి మాట ఇచ్చాడు. దాని వలన కర్ణుడు కొంత మానసికంగా నీరసపడ్డాడు. కర్ణుడు జన్మించినప్పుడు సూర్యప్రసాదంగా సహజంగా లభించిన కవచ కుండలాలను, యుద్ధానికి ముందు ఇంద్రుడు దానంగా పొంది, బదులుగా శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, దీని వలన కర్ణుడు తన సహజ రక్షణ కోల్పోయాడు. భూదేవి శాపం కూడా పనిచేసి యుద్ధంలో భూమిలో కృంగిన రథచక్రాలు పైకి లేవలేదు. ఒకసారి కర్ణుడు తన రథంలో వెళ్తున్నప్పుడు ఒక బాలిక చేతిలో ఉన్న నెయ్యిపాత్ర కింద పడిపోయింది. ఆ బాలిక తనకు ఆ మట్టిలో పడిపోయిన ఆ నెయ్యే తిరిగి ఇవ్వాలని పేచీ పెట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో కర్ణుడు తన బలంతో ఆ మట్టిని పిండి నెయ్యి తీసి బాలికకు ఇస్తాడు. అప్పుడు భూదేవి తనను ఇంతగా బాధించినందుకు కర్ణుడిని, 'యుద్ధంలో నీ రథచక్రాలు భూమిలో కృంగినప్పుడు అవి పైకి లేవవు', అని శపించింది. ఈ భూశాపం కూడా కర్ణుడి మరణానికి ఒక కారణం. చివరిగా కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ప్రత్యేకమైన అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకోవడానికి పరశురాముడి దగ్గర తాను బ్రాహ్మణపుత్రుడనని అసత్యం చెప్పి శిష్యుడిగా చేరతాడు. గురువుకి సత్యం తెలిసిన తరువాత, తన వద్ద అబద్దాలతో చేరి నేర్చుకున్న విద్య యుద్ధసమయంలో గుర్తు రాదని శపిస్తాడు. ఈ వరాలూ, శాపాలూ, దానాలూ అన్నీ కర్ణుడిని నిర్వీర్యం చేశాయి. కనుక పై పద్యంలో చివరగా కర్ణుడి మరణానికి ఆరుగురు కారణమని చెప్తూ కృష్ణుడు, "అరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్", అంటాడు. ఒక యోధుడు కూలడానికి కారణాలు ఇవి అన్నీ. వీటన్నిటికీ పైన కర్ణుడి అధర్మవర్తన అసలైన కారణం. 

***************************************************
78
                                           

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర 
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

భావం: ఈ శ్లోకం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం లోనిది. ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య అనే అణ్ణన్ స్వామి ఈ సుప్రభాతాన్ని సుమారు 15వ శతాబ్దంలో రచించాడు. 'కలౌ వేంకటనాయకః' అన్నట్టు ఒక్క వేంకటేశ్వరస్వామిలోనే దశావతారాలనూ దర్శిస్తూ కవి చెప్పిన శ్లోకం ఇది. స్వామి మత్స్యావతారం ధరించాడని 'మీనాకృతే', కూర్మావతారం ధరించాడని 'కమఠ', వరాహావతారం ధరించాడని 'కోల', నరసింహావతారం ధరించాడని 'నృసింహ', వామనావతారంలో బ్రహ్మచారిగా వచ్చాడని 'వర్ణిన్' అనే పదాలు కవి ఉపయోగించాడు. 'స్వామిన్ పరశ్వథ తపోధన' అంటూ స్వామీ, నీవే తపోధనుడైన పరశురాముడవు అని పరశురామావతారాన్ని, 'రామచంద్ర' అని కీర్తిస్తూ రామావతారాన్ని, 'శేషాంశరామ' అని వర్ణిస్తూ బలరాముడిని, 'యదునందన' అని తలుస్తూ శ్రీకృష్ణుడిని, చివరిగా 'కల్కిరూప' అని చెప్తూ యుగాంతంలో రాబోయే కల్కి అవతారాన్ని శ్రీవేంకటేశ్వరస్వామిమూర్తి లోనే కవి దర్శించాడు, మనకూ దర్శింపచేశాడు. కవి ఈ శ్లోకంతో ఒక్క శ్రీవేంకటేశ్వరస్వామిమూర్తి లోని దశావతారాలకూ మేలుకొలుపు పాడుతున్నాడు. వ్యాసుడు చెప్పిన ప్రకారం, "మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః  కల్కిరేవచ", దశావతారాలను తన సుప్రభాత శ్లోకంలో ఇమిడ్చి చెప్పాడు కవి అణ్ణన్ స్వామి. ఇదే రూపాన్ని కంటికి కట్టేలా ఒక చిత్రకారుడు గీచి 'దశావతార శ్రీవేంకటేశ్వరుడు' చిత్రంలో చూపాడు. స్వామికి హస్తాలలో ఎల్లప్పుడూ ఉండే గదా, శంఖం, చక్రం, అభయ వరద ముద్రలు మాత్రమే కాకుండా, స్వామి శరీరంలో పాదాలు, ఉదరం వద్ద మత్స్యం, కూర్మం చూపించాడు. వరాహ, నారసింహ, వేంకటేశ్వర రూపాలలో మూడు ముఖాలను చిత్రించాడు. ఇతర హస్తాలలో ఛత్రం, పరశు, ధనుస్సు, హలం, ఖడ్గం చూపాడు. కిరీటంలో శిఖి పింఛముతో శ్రీకృష్ణుణ్ణి గుర్తుచేశాడు. ఈ విధంగా దశావతారాలనూ ఒక్క మూర్తిలోనే చూపుతూ పై శ్లోకానికి చిత్రరూపం ఇచ్ఛాడు చిత్రకారుడు. 'ఓం నమో వేంకటేశాయ'. 

***************************************************
79
మిత్రుని విపత్తునందుఁ గళత్రమును దరిద్రదశను భ్రాతలగుణమున్‌
బాత్రాది విభక్తంబున గోత్రను గనుగొనఁగవలయు గువ్వలచెన్నా

భావం: ఈ పద్యం గువ్వలచెన్నడు రచించిన గువ్వలచెన్నా శతకం లోనిది. సుమారు 17, 18 శతాబ్దంలో కడప ప్రాంతంలో గువ్వలచెన్నడు నివసించాడని తెలుస్తోంది. ఆతడు గువ్వలచెన్నా మకుటంతో రచించిన శతకం లోనిది ఈ పద్యం. సమాజంలో తాను చూసిన ఎన్నో రకాలైన అంశాలతో ఈ శతకరచన చేశాడు. హితం కూర్చేవాడే స్నేహితుడు. ఎవరైనా నిజమైన స్నేహితులైతే మిత్రులకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి. కష్టంలో చేయూతనివ్వని వాడు స్నేహితుడే కాదు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడే అసలైన మిత్రులు బయటపడతారు. అలాగే, పేదరికంలో ఉన్నప్పుడు దంపతులు పరస్పరం సఖ్యంగా ఉంటూ ఆ ఇబ్బందిని దాటాలి. దరిద్రంలో సహకరించని భార్య(భర్త) ఉన్నవారి బ్రతుకు దుర్భరం. అదే డబ్బున్నప్పుడు భార్య(భర్త), ఆమె(అతడి) తరఫు బంధువులు, నీరున్నప్పుడు చెరువులో వేలాది కప్పలు చేరినట్టు, గుంపులు గుంపులుగా చేరతారు. కనుక దరిద్రంలో వీళ్ళ నిజ గుణాలు బయటపడిపోతాయి. అదేవిధంగా ఆస్తుల పంపకాలప్పుడు భ్రాతలు అంటే సోదరుల బుద్ధి బయటపడుతుంది.  ఈరోజుల్లో అన్నదమ్ములే కాక అక్కచెల్లెళ్లు కూడా వారి వారి లోభ, మోహ, మత్సర లక్షణాలను, ఇంకా శ్రుతి మించితే కామ, క్రోధ, మద లక్షణాలను కూడా చూపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మిత్రులు, కళత్రము, సోదరుల నిజబుద్ధి కనపడుతుంది అంటున్నాడు గువ్వలచెన్నడు. "కొడుకు గుణం పెళ్లి తరువాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు, భార్య గుణం భర్త పేదరికంలో, స్నేహితుని గుణం కష్టం వచ్చినప్పుడు, అన్నదమ్ముల గుణం ఆస్తి పంపకాలు జరిగినప్పుడు, పిల్లల గుణం తల్లితండ్రుల వృద్ధాప్యంలోను తెలుస్తాయి" అనే నానుడి కూడా ప్రచారంలో ఉంది. మనుష్యుల నిజమైన నైజం కొన్ని ప్రత్యేక సందర్భాలలో తెలిసిపోతుంది.  
 
***************************************************
80
సీ. అచట లే వని కదా యరచేతఁ జఱచెఁ గ్రుద్ధత సభా స్తంభంబు దానవేంద్రుఁ
డచట లే వని కదా యస్త్రరాజం బేసె గురుసుతుం డుత్తరోదరమునందు
నచట లే వని కదా యతికోపి ననిచెఁ బాండవు లున్నవనికిఁ గౌరవకులేంద్రుఁ
డచట లే వని కదా యాత్మీయసభను ద్రౌపది వల్వ లూడ్చె సర్పధ్వజుండు
తే. లేక యచ్చోటులను గల్గలేదె ముందుకలవు కేవల మిచ్చోటఁ గల్గు టరుదె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

భావం: ఈ శ్లోకం కాసుల పురుషోత్తమకవి "చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ" మకుటంతో రాసిన ఆంధ్రనాయక శతకము లోనిది. దానవేంద్రుడైన హిరణ్యకశిపుడు ఆ సభా స్తంభంలో నీవు కచ్చితంగా లేవని భావించే, దానిని ఒక గుద్దు గట్టిగా బలం కొద్దీ గుద్దాడు. ద్రోణసుతుడు అశ్వత్ధామ ఉత్తరాగర్భ రక్షగా నీవు లేవనే కదా, బ్రహ్మాస్త్రమును నిర్భయంగా ప్రయోగించాడు. కౌరవకుల దుర్యోధనుడు పాండవులకు నీ అండ అరణ్యాలలో ఉండదనే కదా, నిబ్బరంగా క్రోధభట్టారకుడైన దూర్వాసుడిని అరణ్యానికి ప్రత్యేకంగా పంపించాడు. కేవలం కౌరవుల ఆత్మీయులు మాత్రమే ఉన్న ఆ సభలో నీవు అక్కడకు రావనే ధైర్యంతోనే కదా, సర్పధ్వజుడైన దుర్యోధనుడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేయబోయాడు. నీవు లేవన్న చోట కూడా ఉంటావు, ఎప్పుడూ అన్ని చోట్లా ఉంటావు, కేవలము ఇక్కడిక్కడ మాత్రమే ఉంటావు అని చెప్పగలమా అంటాడు కాసుల పురుషోత్తమకవి. విష్ణుమాయ మామూలుగా ఉండదు. "అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ", అని ఎవరు ప్రార్ధించినా మనందరి స్థితిగతులు చూచి కాచే శ్రీమహావిష్ణువు తానొక్కడే, అన్నిచోట్లా కనపడి తన విశ్వవ్యాపకత్వాన్ని ఎన్నోమార్లు చూపాడు. స్తంభంలో ప్రత్యక్షమై ప్రహ్లాదుని మాటను నిలబెట్టాడు. ద్రౌపది ప్రార్ధన మన్నించి, ఉత్తరా గర్భాన్ని రక్షించాడు. ద్రౌపది కష్టంలో రక్షించమని వేడగానే, మానసంరక్షణకై వలువలు ప్రసాదించాడు. ద్రౌపది దూర్వాసునికి, ఆతని శిష్యులకు భోజనం పెట్టలేక పోతున్నాననే బాధతో పిలవగానే వచ్చి ఆ కష్టాన్ని తీర్చాడు. ఈ విధంగా ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, తన భక్తులను ఎంతో దాక్షిణ్యంతో కాపాడాడు శ్రీమహావిష్ణువు. అట్టి మహావిష్ణువు కొలువై ఉన్న శ్రీకాకుళంలోని, ఆంధ్రనాయకుణ్ణి ఈ శతకంలో ప్రస్తుతిస్తున్నాడు కవి. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో అద్భుతమైన, పురాతనమైన ఆంధ్రమహావిష్ణువు ఆలయం ఉంది.

***************************************************
81
కావ్యం రామాయణం కృత్స్నం, సీతాయాశ్చరితం మహత్, 
పౌలస్త్యవధమిత్యేవ, చకార చరితవ్రత:

భావం: రామాయణం అనే కావ్యంలో వాల్మీకి సమగ్రంగా రాముడి చరితం చెప్పాడు. అంతే కాక ఇది మహత్తైన సీతాచరితం కూడా చెప్పాడు. సంస్కృతంలో రామ అనేది పుం శబ్దం, రామా అనేది స్త్రీ శబ్దం. రామా అంటే ఈ కథలో నాయిక సీత అని అర్థం. కనుక ఈ కథను మహత్తైన సీతాచరితం అని కూడా అన్నాడు వాల్మీకి. ఈ కథకు మరొక మూడవపేరు కూడా పెట్టాడు, అది పౌలస్త్యవధ. అంటే పులస్త్యుని మనవడైన రావణుని వధ. జపము, తపము, రచన ఈ మూడూ వ్రతముగా ఆచరించే చకార చరితవ్రతుడైన, ప్రాచేతసుడనే వాల్మీకి రచించిన పై శ్లోకంలో రామాయణమనే ఈ కావ్యం కృత్స్నం, సమగ్రమైనది అని చెప్తూ, దీనికి మూడు పేర్లను ప్రతిపాదించాడు. 1.రామాయణం, 2.సీతాయాశ్చరితం, 3.పౌలస్త్యవధ. రాముడి పేరు ఎందుకు పెట్టాడు, సీత పేరు ఎందుకు పెట్టలేదు అని బాధపడేవారు ఒకసారి పై శ్లోకం చదివితే వాల్మీకి మనసు అర్థం అవుతుంది. మహాభారతానికి కూడా వ్యాసుడు ముందుగా 'జయం' అని పేరు పెట్టినా, ఆ గ్రంధం 'మహాభారతం' పేరుతోనే ప్రసిద్ధి కెక్కింది. అలాగే వాల్మీకి పెట్టిన మూడు పేర్లలో, 'రామాయణం' అనే పేరే ఎక్కువగా ప్రాచుర్యం లోకి వచ్చింది. "చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్." నారదుడు వాల్మీకికి చెప్పిన మూల రామాయణంలో రఘునాథుని చరిత్ర శతకోటి శ్లోకాలతో రాయబడి, ప్రతి ఒక్క అక్షరం చదివిన వారి మహాపాతకాలు కూడా నశింపచేస్తుంది అని శ్రీరామరక్షా స్తోత్రంలో చెప్పారు. అంటే రామాయణం మనసు పెట్టి చదివితే, మనిషి ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో తెలిసి, పాపాలు చేయడు, చేసినవి కూడా సరిదిద్దుకుంటాడు, అని అర్థం. 

***************************************************
82
మా నిషాద ప్రతిష్ఠాంత్వమగమ శాశ్వతీ: సమాః 
యత్క్రౌంచ మిథునా దేక మవథీ: కామమోహితమ్ 

భావం: ఇది ఆదికావ్యమైన రామాయణ కర్త వాల్మీకి నోటి వెంట వచ్చిన మొట్టమొదటి ఛందోబద్ధ శ్లోకం. కామమోహితులై ఉన్న క్రౌంచ మిథునంలో మగపక్షి నిషాదుని బాణం తాకి, మరణిస్తే, ఆడపక్షి దుఃఖిస్తూ పక్కనే పడి ఉంది. ఆ క్షణం వరకు సుఖంగా, ప్రేమగా ఉన్న ఆ పక్షుల జంటను చూసి వాల్మీకి, ఆతని శిష్యులూ ఆనందిస్తున్నారు. అదే సమయంలో బాణం ఎక్కుపెడుతున్న వేటగాడిని చూసి, వాల్మీకి, 'మా నిషాద', అంటూ ఓ వేటగాడా వద్దు, వద్దు, అని చెపుతూండగానే బాణం దూసుకెళ్లి ఆ పక్షిని చంపేసింది. అది చూసి రెండోపక్షి దుఃఖంతో నేలకూలింది. అప్పుడు వాల్మీకి నోటివెంట వచ్చిన పదాలే ఛందోబద్దంగా ఉండటం గమనించాడు. ఆ విధంగా శోకం నుంచి శ్లోకం పుట్టింది. అదే తొలి శ్లోకం. "ఓ నిషాదుడా, ఆగాగు, ప్రేమలో మునిగి నిన్ను పట్టించుకోకుండా, అజాగ్రతతో ఉన్న ఆ జంట క్రౌంచపక్షులను చంపి, శాశ్వతమైన అపకీర్తి మూట కట్టుకోకు" అన్నాడు వాల్మీకి. అలా మొదలైంది రామాయణ కావ్య రచన. ఈ శ్లోకం విని బ్రహ్మ "యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే, తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి." ఈ లోకంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలం ఈ రామాయణం శాశ్వతంగా ప్రచారంలో  ఉంటుందని దీవెన పలికాడు. అందుకే ఈ నాటికీ ఎన్ని యుగాలైనా రామాయణం ప్రజల మనస్సులో ఉంది. 

***************************************************
83
విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ
కామాక్షి పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ 

భావం: ఈ శ్లోకం మూకపంచశతి లోనిది. మూక శంకరుడు (మూక అంటే మూగ) అనే కవి కామాక్షీ అమ్మవారు నమిలి ఇచ్చిన తాంబూలం తిని, వెనువెంటనే వాక్కు వచ్చి అమ్మవారి గురించి 500 శ్లోకాలు అంటే 5 శతకాలు చెప్పాడు. ఇది మొట్టమొదటి ఆర్యాశతకము లోని 92 వ శ్లోకం. కామాక్షీదేవి అతని చేసిన ఈ స్తుతులకు మెచ్చి వరం కోరుకోమంటే, "అమ్మా, నిన్ను కీర్తించిన నోటితో మరింకేమీ పలకలేను, నాకు ఇక ఈ వాక్కు వద్దు" అని చెప్పాడు. కామాక్షిని సరస్వతిగా సంభావిస్తూ చెప్పిన శ్లోకం ఇది. సరస్వతీదేవి తెల్లగా ఉంటుందని అమ్మను 'సర్వశుక్లా సరస్వతీ' అంటాము. ధవళ వర్ణం, ధవళ వస్త్రం సరస్వతీదేవి ప్రత్యేకత. ఈ శ్లోకంలో విమలపటీ అంటే శుభ్రవస్తావృతా అని అర్థం. కమలకుటీ అంటే కమలాసనీ అని అర్థం. నాలుగు హస్తాలలో పుస్తకము, రుద్రాక్షమాల, కచ్ఛపీవీణ ధరించి ఉంది. పక్షి రెక్కలను పోలిన కనురెప్పల వలె కామాక్షీదేవి కన్నులు ఉన్నాయి. విరించి ఇల్లాలైన ఆ వైరించీదేవి అద్భుతమైన రోచిస్సుతో శోభిల్లుతోంది. కామాక్షీ అమ్మవారి కటాక్షం పొందిన ఈ మూక శంకరుణ్ణి, మూక శంకరేంద్ర సరస్వతీ స్వామిగా నామకరణము చేసి, కామకోటి పీఠానికి 20వ పీఠాధిపతిగా, అప్పటి కామకోటి పీఠం యొక్క 19వ పీఠాధిపతి శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర స్వామి  నియమించారు. 

***************************************************
84
సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే 
శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్

భావం: "అమృత సముద్రమధ్యంలో, దేవతా వృక్షాలైన కల్పవృక్ష సమూహం కంచె వలె చుట్టూ వ్యాపించిన, మణిద్వీపం అనే పేరు గల ద్వీపంలో, కదంబ వృక్షవనంలో, చింతామణులనే ఇటుకలుగా చేసి నిర్మించిన గృహంలో, శివాకారంలో ఉన్న మంచముపై, పరమశివుడే స్వయంగా పాన్పుగా అమరితే, ఆ పర్యంకముపై నిత్యమూ చిదానంద లహరులలో తేలియాడుతున్న నా తల్లీ, ఏ కొద్దిమంది ధన్యజీవులో నిన్ను భజించి తరించే భాగ్యం పొందగలుగుతున్నారమ్మా." ఈ శ్లోకం ఆదిశంకరులు చెప్పిన సౌందర్యలహరి లోనిది. లలితాత్రిపురసుందరి ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో, ఎవరికి ఆ తల్లిని భజించి తరించే భాగ్యం ఉన్నదో చెప్తున్నాడు శంకరుడు. అమ్మ అమృత సముద్రం మధ్యలో ఉన్నదీ అంటే, ఆయుష్షుని పెంచే అమృతం అమ్మ అధీనం. మందార, పారిజాత, పలాశ, మారేడు, తులసి, వట, అశ్వత్థ, శమీ, అమలక, ఔదుంబర, చందన, చంపక, అశోక, పున్నాగ వంటి దేవతా వృక్షాలు ఆ సముద్ర మధ్యంలో ఉన్న మణిద్వీపాన్ని అన్ని వైపుల నుంచీ కంచె వలె ఏర్పడి శ్రీలలితను సేవించుకోవడానికి పరివేష్టించి ఉన్నాయి. అటువంటి మణిద్వీపములో ఒక చక్కని, చిక్కని కదంబవృక్ష వనం ఉన్నది. ఆ కడిమి చెట్ల నడుమ ఒక అద్భుతమైన, అపురూపమైన, చింతామణులనే ఇటుకలుగా వాడి నిర్మించిన చింతామణీ గృహం ఉన్నది. చింతామణి అంటేనే తాను స్వయం ప్రకాశం కలిగి, తన చుట్టూ ఆ ప్రకాశాన్ని వెదజల్లేది. అంటే ఒక్క చింతామణి చాలు, జీవితాన్ని జ్ఞానమయం చేసి, అజ్ఞానపు చీకట్లు పారద్రోలడానికి. ఒక్క చింతామణి దొరికితేనే ఈ జీవితం ధన్యం అనుకుంటే, ఆ లలితా పరాభట్టారిక ఇల్లే ఆ చింతామణులతో నిర్మించబడి ఉన్నది, అంతటి మహత్తరమైన గృహంలో, పరమాద్భుతమైన శివాకారములో ఉన్న మంచముపై, సాక్షాత్తూ ఆ పరమశివుడే పాన్పువలె ఏర్పడి లలితాదేవిని తన ఎడమతొడపై కూర్చుండ బెట్టుకున్నాడు. అప్పుడు ఆ లలితాపరమేశ్వరి చిద్విలాసంగా చిదానంద లహరులలో పరమశివ పర్యంక నిలయయై జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటే, ఆ అద్భుత, అపురూప, అపూర్వ, మహత్త్వ మూర్తిని భజించి తరించే ధన్యాత్ములు అయ్యే అదృష్టం ఏ కొద్దిమందికో కదా.

***************************************************
85
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే 
ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః     

భావం: ఇది కష్టాలలో ఉన్న వారిని ఆదుకుని రక్షించే మహామంత్రం. గోవిందుడు గోపనం అంటే తనవారిని కాచి దాచి కాపాడేవాడు అని అర్థం. అటువంటి గోవిందుడికి నమో నమః అని రెండుసార్లు నమస్కరిస్తూ చేసే శరణాగత మంత్రం ఇది. హే కృష్ణా, వసుదేవతనయా, వాసుదేవా, హారీ, ఓ పరమాత్మా, నన్ను క్లేశములు అంటే కష్టములు బాధిస్తున్నాయి. నేను నీకు ప్రణతము చేస్తున్నాను. నీ శరణమే నాకు గతి. నీ ప్రణతే నాకు శరణ్యం, అని సంపూర్ణ శరణాగతి చెయ్యాలి. అప్పుడు ఆ గోవిందుడు క్లేశములు తీర్చి కాపాడతాడు.
"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్:
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్:
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్:
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా."
అంటూ నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు అని గజేంద్రుడు ఆర్తితో ప్రార్ధించాడు. అటువంటి శరణాగతి చెయ్యాలి. గోవిందుడు తప్ప మరొకరు ఆదుకోలేరనే కష్టం వచ్చినప్పుడు, పై మంత్రాన్ని 108 సార్లు చదువుకుని మన కష్టం ఆ దేవదేవునికి చెప్పుకుంటే, ఆ కష్టం తప్పక తీర్చబడుతుంది అని నమ్మకం. ఎంతోమందిని కాపాడిన మహామంత్రం ఇది. ఈ మంత్రాన్ని శ్రీభాగవతపురాణం నుంచి తీసుకున్నారని చెప్తారు. 

***************************************************
86
న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః 
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్

భావం: అమ్మా, నాకు మంత్రాలు, యంత్రాలు ఏమీ తెలియవు. అంతేకాదు తల్లీ, నిన్ను గొప్పగా స్తుతించడం తెలియదు, నీ స్తుతీకథలూ తెలియవు. నీకు ఎలా ఆహ్వానాలు పలకాలో తెలియదు, ఆవాహనము చేయడమూ తెలియదు. ధ్యానం చేయడమూ రాదు, ముద్రలూ రావు. గట్టిగా విలపిస్తూ నీ దృష్టి నావైపుకు తిప్పుకోవడం కూడా తెలియదు. ఇవి ఏవీ కూడా తెలియవు తల్లీ, తెలిసినదంతా ఒక్కటే, నిన్ను అనుసరిస్తూ ఉండటమే, అదే కష్టాలను నాశనం చేసే మహా తరుణోపాయం. ఈ శ్లోకం శంకరాచార్యుడు చెప్పిన దేవ్యపరాధ క్షమాపణా స్తోత్రం లోనిది. నిన్ను ఎలా పూజించాలో నాకేమీ తెలియదు, నన్ను క్షమించమ్మా అని అమ్మవారికి క్షమాపణ చెప్పుకుంటూ, నా కష్టాలు తీరడానికి దారి కేవలం నిన్ను నిరంతరం అనుసరిస్తూ ఉండటమే అంటున్నాడు. తల్లీ, నాకు మంత్రాలు, యంత్రాలూ తెలియవు. నిన్ను అనుసరిస్తూ నీవెంటే తల్లి వెనుక పిల్లవాడల్లే తిరుగుతూ ఉంటే, నువ్వే నన్ను ఉద్ధరిస్తావు అనే తంత్రం మాత్రం తెలుసమ్మా అంటున్నాడు. అంతేనా, నాకు నిన్ను స్తుతించడం రాదు అంటూనే, చక్కగా స్తోత్రం చెప్పేస్తున్నాడు. నాకు జప సమయంలో చేసే ముద్రలు రావు, నిన్ను ఆహ్వానించడం కానీ, నీకోసం ధ్యానం చేయడం కానీ రాదు అని చంటిపిల్లవాడు తల్లితో చెప్తున్నట్లు అమాయకంగా చెప్పుకుంటున్నాడు.
 అమ్మ దగ్గరే కదా పిల్లల మంకు చెల్లుతుంది. చివరిగా నాకు నీకోసం సరిగ్గా ఏడవడం కూడా రాదు అంటున్నాడు. ఇది మరీ గడుసుదనం. పిల్లలు ఏడిస్తే, తల్లి ఏ పనిలో ఉన్నా అన్నీ వదిలేసి పరుగెత్తుకుంటూ వస్తుందనే ధైర్యంతో, నమ్మకంతో చెప్తున్నాడు శంకరుడు. తల్లి కొంగు పట్టుకుని తల్లి ఎటు వెళితే అటు, బిడ్డ తన రక్షణ కోసం ఆమె వెంటే తిరిగినట్టు, శంకరుడికి ఖచ్చితంగా తెలుసు, అమ్మను శ్రద్ధాభక్తులతో అనుసరిస్తూ ఉంటే చాలు, శిశువుల రక్షణ బాధ్యత తల్లి చూసుకుంటుందని. జయ జయ శంకర, హర హర శంకర.

***************************************************
87
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ 
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః  
 
భావం: ఈ మంత్రం శ్రీ రుద్రనమకం నుంచి గ్రహించబడింది. ఇది ఏకాదశ రుద్రులకూ నమస్కరిస్తూ చేసే స్తుతికి సంబంధించినది. ఆ పదకొండు మంది రుద్రులూ, "విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్య్రంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్నిరుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు." విశ్వానికే అధిపతి అయినవాడు విశ్వేశ్వరుడు. దేవాదిదేవుడు, సర్వ దేవతలచే అర్చింపబడేవాడు మహాదేవుడు. చంద్ర అర్క వైశ్వానర లోచనుడైన రుద్రుడు త్య్రంబకుడు. తారకాసురుని పుత్రులు, త్రిపురాలకూ అధిపతులు అయిన కమలాక్షుడు, తారకాక్షుడు, విద్యున్మాలి లను సంహరించిన రుద్రుడు త్రిపురాంతకుడు. త్రికాలాల లోనూ వెలిగే అగ్నిరూపములో ఉన్న రుద్రుడు త్రికాగ్నికాలుడు. కాలమనే అగ్ని రూపములో ఉన్న రుద్రుడు కాలాగ్నిరుద్రుడు. హాలాహలమును కంఠములో నిలిపి, నీలకంఠుడైన రుద్రుడు నీలకంఠుడు. మార్కండేయుడిని రక్షించడానికి మృత్యురూపమైన యముడినే జయించిన రుద్రుడు మృత్యుంజయుడు. సర్వజీవులకూ రక్షణ నొసగే రుద్రుడు సర్వేశ్వరుడు. శివుడంటే శుభాన్నిచ్చేవాడు, ఎల్లప్పుడూ  శుభములను ప్రసాదించే రుద్రుడు సదాశివుడు. ఎందరో ఉత్కృష్టులైన దేవతాగణములచే ఎల్లప్పుడూ పూజింపబడే రుద్రుడు శ్రీమన్మహాదేవుడు. ఈ ఏకాదశ రుద్రులూ సకల భూతాలకూ రక్షకులు. ఆ రుద్రుల గొప్పదనాన్ని స్మరించుకుంటూ, వారికి నమస్కరించుకుంటూ చేసే స్తుతియే రుద్రనమకం లోని ఈ మంత్రము. ఈ మంత్రాన్ని ఏకబిగిన గుక్క తిప్పుకోకుండా చదవగలిగినవారి ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తున్నవని ఒక నమ్మకం. మధ్యలో ఊపిరి తీసుకోవడానికి ఆపవలసివస్తే, ఊపిరితిత్తులు కొంత బలహీనపడినట్లుగా సూచన. నిత్యమూ ఈ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే, ఊపిరితిత్తుల వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చుననేది ఒక విశ్వాసం. ఆరోగ్యాన్నిచ్చే శివుడు వైద్యనాథుడు. ఏకాదశ రుద్రులనూ ఏకవాక్య పరిచయం చెయ్యడం మాత్రమే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలలో ఈ పదకొండు మంది రుద్రులకూ సంబంధించిన పురాతన ఆలయాలు ఉన్నాయి.  
                                              

***************************************************
88
యా పశ్యతి న సా బ్రూతే యా బ్రూతే సా న పశ్యతి
అహో వ్యాధ స్వకార్యాథిన్కిం పృచ్ఛసి పునః పునః

భావం: "ఓ వ్యాధుడా, చూసే కన్ను మాట్లాడలేదు, చెప్పే నోరు చూడలేదు, ఎందుకు నీ పని కోసం అదే ప్రశ్న నన్ను పదేపదే అడుగుతావు", అని పై శ్లోకం అర్థం. శ్రీదేవీభాగవతంలో ఈ సత్యవ్రతుడనే వాడి కథ కనిపిస్తుంది. సత్యవ్రతుని అసలు పేరు ఉతథ్యుడు. మూర్ఖుడిగా అందరి చేతా చులకన కాబడి ఉతథ్యుడు అడవుల్లోకి వెళ్లిపోతాడు. నోరు తెరిస్తే తన మూర్ఖత్వం బయటపడుతుందని, మౌనంగా ఉంటూ కాలం గడిపేస్తున్నాడు. అప్పుడు అందరూ ఆతణ్ణి మౌనముని అనుకున్నారు. ఒక వరాహం వేటగాని బాణం దెబ్బ తిని "ఐ, ఐ, ఐ" అని అరుస్తూ ఉతథ్యుని వెనుక పొదల్లో దూరి దాక్కుంటుంది. ఉతథ్యునికి ఎందుకో ఈ "ఐ" అనే శబ్దం చాలా నచ్చింది. లోపల మనసులో "ఐ, ఐ, ఐ" అని జపిస్తూ కూర్చున్నాడు మౌనంగా. ఆ వెనుకే వేటగాడు వచ్చి ఉతథ్యుని దెబ్బ తిన్న పంది గురించి వివరం అడుగుతాడు. ఉతథ్యునికి వరాహం ఆచూకీ చెప్పి దానికి ప్రాణహాని కలిగించడం ఇష్టం ఉండదు. అందుకే, నోరు విప్పకుండా మనసులో మాత్రం "ఐ, ఐ, ఐ" అని జపిస్తూ ఉంటాడు. ఆ వేటగాడు పదే పదే అదే విషయాన్ని అడుగుతూ ఉంటే, అప్పటి దాకా ఏ విద్యా నేర్వలేక, మూర్ఖంగా, మౌనంగా ఉండే ఉతథ్యుడు ఉన్నట్టుండి, ఈ పై శ్లోకాన్ని అనాయాసంగా చెప్తాడు. "ఏది చూసిందో అది చెప్పలేదు, ఏది చెప్పగలదో అది చూడలేదు, ఓ వ్యాధుడా, ఎందుకు నీ పని కోసం నన్ను అదే ప్రశ్న పదే పదే అడుగుతావు" అన్నాడు. వ్యాధునికి ఈ సమాధానం అర్థం అయ్యీ అవనట్టు అనిపించింది. ఈ తాపసికి ఏమీ తెలియదు, తెలిసినా చెప్పడు అని మాత్రం అర్థం అయి, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తన నోటి వెంట మొదటిసారిగా ఇంత అద్భుతమైన వాక్కు వచ్చేసరికి ఉతథ్యుడూ ఆశ్చర్యపడతాడు. అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షం అయి, అప్పటివరకూ ఉతథ్యుడు జపిస్తున్న  అనే అక్షరానికి పూర్ణానుస్వారం చేర్చి, ఐం అనే వాగ్బీజం ఇచ్చి పండితుడిని చేస్తుంది. "చూసే కన్నుకు నోరు లేదు కనుక చెప్పలేదు, చెప్పే నోటికి కన్ను లేదు కనుక చూడలేదు" అనే గొప్ప సత్యాన్ని లౌక్యంగా చెప్పి వరాహాన్ని రక్షించినందుకు ఉతథ్యునికి సత్యవ్రతుడు అనే పేరు పెట్టి గొప్ప పండితుడు అవుతావని దీవిస్తుంది. ఐం బీజ మహాత్మ్యం అది. ఆ విధంగా ఉతథ్యుడు సత్యవ్రతుడు అయ్యాడు, విద్వాంసుడు అయ్యాడు.

***************************************************
89
యధా శిఖా మయూరాణాం, నాగానాం మణయో యధా,
తద్వద్వేదాంగ శాస్త్రాణం, గణితం మూర్ధని స్థితమ్. 

భావం: నెమళ్లకు శిఖిపింఛము వలె, నాగులకు తలపై మణుల వలె, వేదాంగ శాస్త్రాలన్నింటికీ  గణితము తలమానికము. శిఖిపింఛములు లేకపోతే నెమళ్లలో ఆ అందము, ఆ కోమలత్వమూ  కనబడవు. అదే విధంగా నాగుపాములకు తలపై మణులు లేకపోతే ఆ ఠీవీ, ఆ ఘనతా ఉండదు.  ఏవిధంగా శిఖి నెమళ్లకు, మణి నాగులకు శోభస్కరమో, తలపై సహజమైన మకుటముల వలె అమరి మరింత ఆకర్షణీయంగా ఉంటుందో, అదే విధంగా గణితము వేదాంగ శాస్త్రాలన్నింటిలో శిరోమణి వంటిది. ఏ శాస్త్ర అభ్యాసమైనా ఆ శాస్త్రముతో పాటు గణితము కూడా నేర్వనిదే సంపూర్ణము కాదు. గణితము అంత ఉత్కృష్టమైనది. మన భరతఖండము లోనే సంఖ్యా శాస్త్రము అంకురించింది. ఆ అంకురం ఎప్పుడు పడింది అని స్పష్టంగా చెప్పలేం. మన మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదం లోనే సంఖ్యలను వాడారు. రుద్రంలో బేసి సంఖ్యలను చెప్తూ, "ఏకా చమే, త్రిస్ర శ్చమే, పంచ చమే, సప్త చమే, నవ చమే, ఏకాదశ చమే...." అని సాగుతుంది. మన పూజల్లో,  స్తోత్రాలలో అష్టోత్తర శతం అంటే వంద తరువాత ఎనిమిది, నూట ఎనిమిది, సహస్రనామ స్తోత్రం అంటే వెయ్యి, లక్ష పత్రి పూజ, కోటి బిల్వ అర్చన, వంటి పదాల వాడుక అతి సామాన్యం. అంతే కాదు, తిథులు చెప్పడానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అంటూ లెక్కిస్తాం. వయసు చెప్పడానికి షష్ఠిపూర్తి మొదలైన సంఖ్యా పదాలు, ఎవరినైనా దీవించాలంటే, శతమానం భవతి వంటి సంఖ్యాధార ఆశీర్వాదాలు సర్వ సామాన్యం. ఈ విధంగా మన సనాతన సంస్కృతిలో సంఖ్యలు తద్వారా గణితము ఇమిడిపోయి ఉన్నాయి. గణితములో ఎంత పెద్ద సంఖ్యను చెప్పాలన్నా, వ్రాయాలన్నా,  కేవలం పది సంజ్ఞలతో "1, 2, 3, 4, 5, 6, 7, ,8 ,9, 0" రాయగల పధ్ధతి మన భారతీయులదే. వాల్మీకి తన రామాయణంలో దశాంశ పద్ధతిని, 10, 100, 1000, 10000 పది యొక్క ఘాతాలను కూడా సైన్యం ఎంతమంది ఉన్నారో చెప్పడానికి వాడాడు. అంత పురాతనం మన డెసిమల్ సిస్టమ్. సున్నని మన భాషలో శూన్యం అన్నాము. శూన్యం నుంచే సున్న అనే పదం వచ్చింది. ధన, ఋణ సంఖ్యల మధ్య ఉన్న "ఏదో తెలియని శూన్యస్థానాన్నే" శూన్యం అన్నారు మన గణితశాస్త్రజ్ఞులు. అటువంటి గణితం నిజంగా వేదాంగ శాస్త్రాలన్నింటిలో శిరోభూషణం, తలపై మాణిక్యం, కిరీటంలో కలికితురాయి. 

***************************************************
90
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే 
ఓం శాంతిః శాంతిః శాంతిః 

భావం: ఇది యజుర్వేదాంతమైన ఈశావాస్యోపనిషత్ లోని శాంతి మంత్రము. అది పూర్ణము. సంపూర్ణము. పూర్ణము నుంచి ఏమి వచ్చినా అది కూడా పూర్ణమే అవుతుంది. పూర్ణము నుంచి ఎంత తీసుకున్నా ఆ పూర్ణత్వము తగ్గదు. ఇచ్చినదీ పూర్ణమే, వచ్చినదీ పూర్ణమే. అందరికీ శాంతి కలుగుగాక. ఈ శ్లోకంలో పరబ్రహ్మ యొక్క అనంత స్వరూపం తెలుస్తుంది. ఆ పరబ్రహ్మ అనంతుడు. ఆ పరబ్రహ్మ నుంచి ఏర్పడిన సృష్టి అంతా కూడా అనంతమే. ఆ శక్తి పూర్ణం. దాని నుంచి ఉద్భవించినది అంతా పూర్ణం. ఓం శాంతి. పూర్ణము నుంచి ఉద్భవించినది కూడా పూర్ణమే. ఇదీ పూర్ణమే, అదీ పూర్ణమే. ఓం శాంతి. మన సనాతన సంసృతి నుంచే గణితం వచ్చింది. ఋగ్వేదం నుంచే ప్రారంభమయిన మన భారతీయ గణిత సంస్కృతికి ఈ అనంతత్వము పూర్ణత్వాన్ని సమకూర్చింది. అనంతము ఎప్పుడూ అనంతమే. అనంతము నుంచి వచ్చినది అనంతమే, మిగిలినది అనంతమే. గణితము లోని అనంతము అనే భావన ఇక్కడి నుంచే పుట్టింది. "∞" అనే భావన వలన గణితశాస్త్రం మరింత సుసంపన్నం అయింది. సంఖ్యలు అనంతం. అనంతం నుంచి ఎంత తీసినా అదీ అనంతమే, అనంతానికి ఎంత కలిపినా అదీ అనంతమే. భారతీయ వైదిక విజ్ఞానం ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప బహూకృతి మన గణితశాస్త్రం, దాని అపరిమిత విస్తృతి. మన సంస్కృతిలో వేదము, విద్య ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. వేదము చెప్పని విద్య లేదు. గణితము ఆ వేదవిద్యలో ఒక భాగం. సున్నను కూడా పూర్ణం అనడం మన సనాతన సంప్రదాయం. ఏ వస్తువైనా అయిపోతే, అది లేదు అనకుండా నిండుకుంది అని చెప్పడం లోనే ఈ పూర్ణత్వం దాగి వుంది. పూర్ణము, సంపూర్ణము అనే భావన ఒకసారి అర్థం అయితే అన్నా,  అన్నా, ఆ భావం ఒక ప్రహేళికగా అనిపించదు. సున్న, శూన్యం అనే భావన అర్థమైన తరువాత గణిత విస్తృతి అనంతమైంది. దశాంశభావనతో గణిత ప్రయోజనం విశ్వమంతా వ్యాపించింది. ఈ పూర్ణమునే అక్షరములలో పూర్ణానుస్వారం అంటున్నాం. ఈ పూర్ణానుస్వారం జత చేరనిదే బీజం బీజాక్షరం అవదు. ఈ బీజాక్షర మననమే మంత్రమై సదా వెన్నంటి రక్షిస్తూ ఉంటుంది. అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం.... మొదలైనవన్నీ మంత్రాలే. మాతృకా వర్ణ రూపాలు. సంఖ్యల పక్కన చేరినా, అక్షరం పక్కన చేరినా దాని విలువను పెంచే ఘనత పూర్ణానిది. "అమంత్రం అక్షరం నాస్తి" అనేది మన సనాతన ధర్మసూత్రం. 
ఓం శాంతిః  శాంతిః శాంతిః. 

***************************************************
91
ఓంకార పంజర శుకీం,
ఉపనిషదుద్యానకేళి కలకంఠీమ్,
ఆగమ విపిన మయూరీం,
ఆర్యాం అంతర్విభావయే గౌరీం.

భావం: మహాకవి కాళిదాసు చెప్పిన శ్లోకం ఇది. ఒక చక్కని చిలుక ఉంది. అది ఓంకారమనే ఒక పంజరంలో హాయిగా తిరుగాడుతోంది. ఉపనిషత్తులనే ఉద్యానవనంలో ఎంచక్కా ఆ చిలుక తన కిన్నెర కంఠంతో పాడుకుంటూ ఉంది. ఆగమాలనే వనాల్లో మయూరి వలె పురి విప్పి ఆడుకుంటూ ఉంది. ఆర్యుల అంతరంగములో గౌరీదేవిగా భావింపబడి, పూజింపబడుతున్న ఆ శ్రీమాతకు నమస్కారము. ఆ జగన్మాత ఎక్కడ ఉంటుందో ఈ శ్లోకంలో కాళిదాసు చెప్తున్నాడు. అమ్మ ఓంకారంలో ఉన్నది అనడానికి నిదర్శనంగా ఆ తల్లిని ఓంకార పంజర శుకీమ్ అన్నాడు. ఉపనిషత్తులే ఆ శుకము విహరించే ఉద్యానవనాలు. ఆ ఉపనిషత్తులలో వినిపించేది ఆ కిన్నెరకంఠంతో ఆ శ్రీమాత అలవోకగా చేస్తున్న అపూర్వ అద్భుత గానమే. వేదఘోష వినిపించే మహారణ్యంలో ఆనందంగా విహరించే నెమలి వలె, ఆ విశ్వమాత మయూరనృత్యం చేస్తూ ఉన్నది. ఇంత ముచ్చటైన అమ్మను మనసులో దర్శించే భక్తి,, శక్తి ఉన్న మహనీయులకు ఆ దృశ్యం ఎంత ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని కలుగచేస్తుందో కదా. వారు అంతరంగంలో దర్శిస్తున్న ఆ శ్రీగౌరికి వందనములు.

***************************************************
92
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః 
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ 

భావం: వేదవ్యాసుడు రచించిన మహాభారత అంతర్గతమైన శ్రీమద్భగవగీత లోని మొట్టమొదటి శ్లోకం ఇది. ధృతరాష్ట్రుడు తన సహాయకుడైన సంజయుని యుద్ధభూమి గురించి "సంజయా,  ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి జరుగుతోంది. ఎంతో ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు, పాండవులు ఏమి చేస్తున్నారు", అని అడుగుతున్నాడు. జన్మాంధుడైన ధృతరాష్ట్రుడు పుట్టుక నుంచీ తమ్ముడైన పాండురాజుపై ఈర్ష్య తోనే ఉన్నాడు. దృష్టి లోపం వలన, తాను అధిష్టించ లేకపోయిన సింహాసనం తన తమ్ముడికి దక్కిందన్న దుగ్ధను జీవితమంతా పెంచి పోషించాడు. అన్న బాధను గ్రహించిన తమ్ముడు పాండురాజు, తాను లేనప్పుడు అన్నకు సింహాసనంపై కూర్చునే అవకాశం ఇచ్చాడు. కానీ అది చాలలేదు అన్నగారికి. శాపకారణంగా పాండురాజు భార్యలతో అడవులకు వెళ్ళగానే, ధృతరాష్ట్రుడు తనకు ఆ సింహాసనం శాశ్వతం అని ఆనందించాడు. పాండురాజుకి ఔరసపుత్రులు జన్మించారని తెలియంగానే, ఎంతో దూరదృష్టితో   తన పుత్రులే కురువంశానికి నిజమైన వారసులు అని అర్థం వచ్చేట్టు వారికి కౌరవులు అనే పేరుతో ప్రాచుర్యం కల్పించాడు. అదే సమయంలో తమ్ముడు పుత్రులకు పాండవులు అని పేరు వచ్చేలా చేశాడు. అందరూ నా పుత్రులే అని పైకి చెప్తూనే 'మనసులోని మాట ఎవరూ దాచలేరు' అన్నట్టు, ఎప్పటికప్పుడు తన మత్సరబుద్ధి చూపిస్తూనే ఉన్నాడు. అందుకే ఈ శ్లోకంలో కూడా "మామకాః పాండవాః" అని బేధం చూపిస్తాడు. అందరూ కౌరవులే అయినా ఆతని దురాశ వలన ధార్తరాష్ట్రులు, పాండవుల మధ్య యుద్ధం అనివార్యం అయింది. యుద్ధం మొదలైంది అనే స్థితి వరకూ వచ్చినా, ధృతరాష్ట్రుడు తన మత్సరబుద్ధిని వీడలేదు. ఆ సమయంలో కూడా ఎంతో కుతూహలంతో "సంజయా, నా పిల్లలు, నా తమ్ముడి పిల్లలు ఎంతో ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమైనారు కదా, ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రంలో ఏమి జరుగుతోంది" అని అడుగుతున్నాడు.  

***************************************************
93
పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతః
అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టాచ ఖండశః

భావం: ఇది ఒక సుభాషితం. సుభాషితం అంటే ఒక మంచి మాట, సూక్తి అని అర్థం. ఈ శ్లోకంలో కొన్ని చేతి నుంచి జారిపోతే, అంటే పరహస్తగతం అయితే, చక్కగా తిరిగి  రావు, కనుక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని కవి చెప్తున్నాడు. అవి మూడు. మొదటిది పుస్తకం, ఇది ఎవరికైనా ఇస్తే తిరిగి రావడం కష్టం. ఒకవేళ పొరపాటున ఎవరైనా  తిరిగి ఇచ్చినా అప్పటికి ఆ పుస్తకం నలిగిపోయి, చిరిగిపోయి, జీర్ణస్థితిలో వస్తుంది అని సూచన. రెండవది వనిత, పరహస్తగతం అయిన స్త్రీ తిరిగి వచ్చినా భ్రష్టమై, చెడిపోయి వస్తుంది జాగ్రత్త, ఆడుది అపురూపమయినది కనుక జాగ్రత్తగా కాపాడుకోమనేది కవి చేస్తున్న హెచ్చరిక. మన సనాతన సంప్రదాయంలో స్త్రీని క్షేత్రంతో పోల్చారు. క్షేత్రం భ్రష్టమైతే, ఆరోగ్యకరమైన అంకురోత్పత్తి జరగదు కనుక స్త్రీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కవి చెప్తున్నాడు. ఇక మూడవది విత్తం, అంటే ధనం. డబ్బును ఎవరికైనా ఇస్తే, అది తిరిగిరాదు, ఒకవేళ వచ్చినా, మనం పెద్ద మొత్తంలో ఒక్కసారి ఇస్తే, తిరిగి అప్పు తీర్చవలసి వచ్చినప్పుడు, చిన్న చిన్న మొత్తాలుగా, అంటే ముక్కలుముక్కలుగా, చిన్న చిన్న ఖండములుగా వస్తుంది. అంతేకాక అప్పు ఇచ్చినందు వలన, ఒక్కోసారి స్నేహాలు, బంధుత్వాలు కూడా చెడిపోయి, శత్రుత్వం కూడా రావచ్చు. కనుక తస్మాత్ జాగ్రత్త. ఈ మూడింటి పట్ల జాగ్రత్త సుమా అని ఈ సుభాషితం చెప్తోంది. 

***************************************************
94
పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః 
అద్యాపి తత్తుల్యకవే రభావా, దనామికా సార్థవతీ బభూవ

భావం: ఈ శ్లోకం మహాకవి కాళిదాసు గురించి చెప్పింది. తమాషాగా మన ఉంగరం వేలుకు అనామిక అనే పేరు ఎందుకు వచ్చిందో ఏ శ్లోకంలో చెప్పారు. ఒకప్పుడు ఉజ్జయినిలో గొప్ప కవులు ఎవరు అని లెక్కించడం మొదలు పెట్టారు. లెక్క మొదలు పెట్టగానే చిటికెన వేలుపై అందరి కన్నా గొప్ప కవి అని కాళిదాసుని చేర్చారు. రెండవ వేలు అంటే ఉంగరం వేలు పైకి కాళిదాసు పక్కన  లెక్కించ దగ్గ కవి ఎవరూ దొరకలేదు. అందుకని ఆ వేలుకి అనామిక అని పేరు పెట్టారు. అందుకే, ఈనాటికీ ఎవరూ లేని వారిని, దిక్కూ మొక్కూ లేనివారిని, ఊరూ పేరూ లేనివారిని అనామకులు అనడం వాడుక అయిపోయింది. కాళిదాసు బాల్యంలో మూర్ఖుడు. కాళిదాసుని పండితుడు అనుకుని మోసపోయి, ఒక గొప్ప పండితురాలు విద్యోత్తమ అనే రాజకుమార్తె వివాహమాడుతుంది. కానీ వివాహానంతరం మొదటి సంభాషణలోనే ఆతడు మూర్ఖుడు అని తెలిసి కాళీమాత అనుగ్రహం పొందమని కాళీ ఆలయానికి పంపిస్తుంది. ఆ కాళీమాత అనుగ్రహంతోనే కాళిదాసు గొప్ప విద్వాంసుడు అయ్యాడు. ఆ తరువాత, విక్రమార్కుని ఆస్థానంలో నవరత్నాలలో ఒకడిగా కాళిదాసు ప్రఖ్యాతుడు కూడా అయ్యాడు. భోజుని ఆస్థానం లోనూ ఒక కాళిదాసు ఉన్నట్టు ప్రచారంలో ఉన్నది. సుమారు 4, 5 వ శతాబ్దం నాటి వాడని చెప్తారు. పండితురాలైన భార్య మొదటిసారిగా ప్రశ్నించిన "అస్తి కశ్చిత్ వాగ్విశేషా?", అనే మూడు పదాలను ఆధారంగా తీసుకుని, పండితుడైన తరువాత, మూడు మహా కావ్యాలను రచించాడు. అస్తి అనే పదంతో, 'అస్త్యుత్తరస్యాం' అంటూ కుమారసంభవం అనే కావ్యాన్నీ, కశ్చిత్ అనే పదంతో 'కశ్చిత్ కాంతా' అంటూ మేఘసందేశం అనే కావ్యాన్నీ, వాక్ అనే పదంతో, 'వాగర్థావివ సంపృక్తౌ' అంటూ రఘువంశం అనే కావ్యాన్నీ రచించాడు. కనిష్ఠికపై తాను అధిష్టించి, తన పక్కన ఎవరూ సాటియైన కవి లేడు కనుక, ఆ వేలుకు అనామిక అనే సార్థకనామం ఏర్పడేలా చేశాడు మహాకవి కాళిదాసు. 

***************************************************
95
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే 
జగతః పితరౌ వన్డే పార్వతీ పరమేశ్వరౌ 

భావం: ఈ శ్లోకంతోనే కాళిదాసు రఘువంశం అనే ఒక మహాకావ్య రచనకు శ్రీకారం చుట్టాడు. రఘువంశం కావ్యం లోని వస్తువు  ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్ర, సగర, దిలీప, భగీరథ, రఘు, అజ, దశరథ, శ్రీరామ మొదలైన సూర్యవంశపు రాజులైన రఘువంశము వారి గురించిన కథ.  వారందరినీ రఘువంశీ అనడం ఒక సంప్రదాయం. అందుకే ఈ కావ్యానికి కాళిదాసు రఘువంశం అని పేరు పెట్టాడు. ఆ కావ్య ప్రారంభంలో చేసే ప్రార్థనలో ఈ శ్లోకాన్ని చెప్పాడు కవి. తన భార్య అడిగిన "అస్తి కశ్చిత్ వాగ్విశేషా?" అనే ప్రశ్నలో వాక్ అనే పదాన్ని స్వీకరించి కాళిదాసు ఈ శ్లోకం చెప్పాడని అంటారు. ఈ శ్లోక భావాన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది, ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నదీ, "విడదీయలేని పదాలైన వాక్కు, అర్థము లవలె, ఎప్పుడూ ఒక్కటిగా ఉండే జగత్పితరులైన ఆ పార్వతీ పరమేశ్వరులకు వందనం". ఇక్కడ ఉపమానములుగా వాక్, అర్థాలను, ఉపమేయములుగా పార్వతీ పరమేశ్వరులను, ఈ రెండింటికీ సాదృశంగా కలిసి ఉండటం అనే సంపృక్తౌ అనే పదాన్ని వాడాడు కవి. వాక్కు అర్థం ఒకటి లేకపోతే మరొకటి ఎలా సంపూర్ణము కావో, అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు కూడా ఇద్దరూ కలిసి ఉంటేనే సంపూర్ణం అనే భావాన్ని చెప్తూ, అటువంటి జగత్పితరులకు వందనం అంటూ కావ్యం ప్రారంభించాడు కాళిదాసు. రెండవ అర్థం ఎక్కువ ప్రాచుర్యంలో లేకపోయినప్పటికీ, అదీ ప్రధానమైనదే. అక్కడ పదవిభజన పార్వతీప, రమేశ్వరౌ అని చేయబడింది. "విడదీయలేని పదము లైన వాక్కు, అర్థము లవలె, ఎప్పుడూ కలిసి వుండే జగత్పితరులైన పార్వతీపతి అయిన శివుడు, రమాపతి అయిన విష్ణువు లకు వందనం". ఇక్కడ జగత్తును తండ్రుల వలె రక్షిస్తున్న ఆ శివ కేశవులకు వందనం అని చెప్పడం మరొక అర్థం. ఈ భావంలో ఉపమానములుగా వాక్, అర్థాలను, ఉపమేయములుగా పార్వతీప, రమేశ్వరౌ అనే పదాలను తీసుకుని, ఈ రెండింటికీ సాదృశంగా కలిసి ఉండటం అనే సంపృక్తౌ అనే పదాన్ని వాడాడు కవి. వాక్కు అర్థం ఎలా ఒకటి లేకపోతే మరొకటి సంపూర్ణము కావో, అదే విధంగా పార్వతీపతి, రమాపతి కూడా ఇద్దరూ కలిసి ఉంటేనే జగత్తుకు సంపూర్ణరక్షణ అనే భావాన్ని చెప్తూ, జగత్తుకే మాతాపితరులైన పార్వతీపరమేశ్వరులను, రమానారాయణులను  ఇద్దరికీ వందనం అన్నాడు కాళిదాసు.   

***************************************************
96
అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః

భావం: ఈ శ్లోకం మహాకవి కాళిదాసు రచించిన కుమారసంభవం అనే మహాకావ్యం లోని మొదటి శ్లోకం. కుమారసంభవం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, కుమారస్వామి జననం మొదలైన విశేషాలకు సంబంధించిన కావ్యం. తన భార్య అడిగిన "అస్తి కశ్చిత్ వాగ్విశేషా?" అనే ప్రశ్నలో 'అస్తి' అనే పదాన్ని స్వీకరించి కాళిదాసు కావ్య ప్రారంభంలో ఈ శ్లోకం చెప్పాడని అంటారు. ఈ శ్లోక భావం ఇది. "ఉత్తర దిక్కులో ఉన్న దేవతల స్థానమైన హిమాలయము అనే పేరు గల గొప్ప కొండలరాజు, తూర్పు పడమరల సముద్రముల మధ్య నుంచి  చొచ్చుకు వచ్చినట్టుగా భూమికి ఒక కొలబద్ద వలె కనిపిస్తున్నాడు." దేవభూమి అయిన ఉత్తర దిక్కు వైపు హిమాలయాలనే మంచుకొండలు అందంగా అమరివున్నాయి. హిమవంతుడు అనే పర్వతరాజు భూమి పైకి ఎత్తుగా పొడుచుకు వచ్చినట్టుగా కనిపిస్తున్నాడు. ప్రాక్, పశ్చిమ దిశల మధ్యనున్న సముద్రంలో ఒక తులాదండము లాగా,  భూమిని చీల్చుకు వచ్చిందా అన్నట్టుగా ఈ మంచుకొండలు వ్యాపించి వున్నాయి, అని కవి వివరిస్తూ చెప్తున్నాడు. పరమశివుడు మంచుకొండల మధ్య మౌనముని వలె తపస్సులో ఉంటే  హిమవత్పుత్రి అయిన పార్వతీదేవి ఆయనను అనుక్షణం అనుసరిస్తూ సేవిస్తూ ఉన్నది. శివపార్వతుల పరిచయం ఎంత ఆహ్లాదకరమయిన  ప్రదేశంలో జరిగిందో కవి అభివర్ణిస్తున్నాడు. 

***************************************************
97
సుశీలో మాతృపుణ్యేన, పితృపుణ్యేన బుద్ధిమాన్, 
ధార్మికో పూర్వపుణ్యేన, స్వీయపుణ్యేన భాగ్యవాన్ 

భావం: ఇది ఒక సుభాషితం, అంటే చక్కని సూక్తి. "తల్లి చేసుకున్న పుణ్యం వలన పిల్లలు మంచి శీలవంతులవుతారు. తండ్రి చేసిన పుణ్యం వలన చక్కటి బుద్ధిమంతులవుతారు. గతంలోనూ, గతజన్మల్లోనూ చేసుకున్న పుణ్యం ఫలితంగా ధర్మాత్ములవుతారు. తాను స్వయంగా చేసుకున్న పుణ్యవిశేష ఫలితంగా భాగ్యవంతులవుతారు." పిల్లలు అంటే భావితరానికి వారసులు. వారు సౌశీల్యంతో ఉంటే, భావి సమాజంలో సంస్కృతీ, సంప్రదాయాలు బావుంటాయి. సమాజంలో గౌరవాదరాలు పొందుతారు. తల్లి పెంపకంలో సౌశీల్యమూ, సహనమూ గురించి తెలుసుకుంటే, తండ్రి పెంపకంలో బుద్ధీ, వివేకం నేర్చుకుంటారు పిల్లలు. ఆ తరువాత తన వివేకం, విచక్షణలతో ధర్మాధర్మ విశ్లేషణ చేసి ధర్మకార్యాలు చేయగలుగుతారు. 'ఉత్తమం స్వార్జితం విత్తం' అని ధర్మశాస్త్రం చెప్తోంది కదా, ఆ విధంగా ధర్మార్జన చేసి భాగ్యవంతులవుతారు. కనుక పిల్లలు సౌశీల్యంతో, బుద్ధిమంతులై, ధర్మపరులై, భాగ్యవంతులు కావాలంటే, ముందు తల్లితండ్రులు పుణ్యకార్యాలు చెయ్యాలి, ధార్మిక వర్తన అలవరచుకోవాలి. ఇటువంటి సూక్తులు విని ఆచరిస్తే, వ్యష్టి, సమష్టి జీవితాలు బాగుంటాయి. వ్యష్టి అంటే వ్యక్తిగత, సమష్టి అంటే సామాజిక. అందరికీ వారి పిల్లలు చక్కగా, నలుగురు మెచ్చుకునేలా ఉండాలనే కోరిక ఉంటుంది. అది సహజం కూడాను. కానీ పిల్లలు బాగుండాలంటే, తల్లితండ్రులు కూడా ఎలా ఉండాలో చెప్తోంది ఈ శ్లోకం. అంతేకాదు, పిల్లలకూ ఈ శ్లోకం మార్గనిర్దేశకత్వం చేస్తోంది. మీ తల్లితండ్రులను ఎవరూ దూషించకూడదు అనుకుంటే మీ ప్రవర్తన బాగుండాలి, మీరు ఏ చెడ్డపనులూ చేయకూడదు. సమాజానికి మేలు జరిగే కార్యాలు చేపట్టాలి. పిల్లలు తప్పులు చేస్తే ఏమి పెంపకం బాబూ,  అనుకుంటారు. పెద్దలే తప్పులు చేస్తే, వారి పిల్లలు జీవితంలో సరిగ్గా ఎదగరు. కనుక మనం నలుగురూ మెచ్చుకునే మార్గంలో నడుద్దాం, మన పిల్లలనూ అదే మార్గంలో నడిపిద్దాం. భావితరాలకు చక్కని సమాజాన్ని సిద్ధం చేద్దాం. 

***************************************************
98
కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తంగమితమహిమా వర్ష భోగ్యేణ భర్తుః      
యక్షాశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్థచ్చాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు 

భావం: ఈ శ్లోకం కవికుల గురువైన కాళిదాసు రచించిన మేఘసందేశం అనే కావ్యం లోనిది. తన భార్య అడిగిన "అస్తి కశ్చిత్ వాగ్విశేషా?" అనే ప్రశ్నలో 'కశ్చిత్' అనే పదాన్ని స్వీకరించి కాళిదాసు కావ్య ప్రారంభంలో ఈ శ్లోకం చెప్పాడని అంటారు. ఈ కావ్యానికి, మేఘదూతం, దూతమేఘం అనే పేర్లు కూడా వినిపిస్తాయి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషల లోకి కూడా అనువదించబడిన ప్రఖ్యాత కావ్యం ఇది. ఈ కావ్యంలో కాళిదాసు రచనాశైలి, వర్ణనాకౌశలం అద్భుతం. ఈశ్లోకంలో ఒక శాపగ్రస్తుడైన యక్షుని విరహబాధ గురించి చెప్తున్నాడు కవి. తన ప్రభువైన కుబేరుడు ఇచ్చిన శాపము వలన యక్షుడు అలకాపురి వదిలి చిత్రకూటములో రామగిరి వద్ద ఆశ్రమంలో ఒక సంవత్సరం పాటు ఉండవలసి వచ్చింది. 'ఒక యక్షుడు ఒకానొక కాంతపై ప్రేమతో కుబేరుని కొలువులో అప్రమత్తంగా ఉండలేదు.  అప్పుడు కుబేరుడు యక్షుడికి భూలోకంలో ఒక వర్షము పాటు ఉండమని శాపమిచ్చాడు. శాపము వలన యక్షుని శక్తి క్షీణించింది. ఆషాఢమాసంలో యక్షుని విరహం ఇంకా పెరిగింది. జానకీదేవి వనవాసంలో ఉన్నప్పుడు స్నానం చేసిన పుణ్యతీర్థాలు, చక్కటి చిక్కటి ఛాయను ఇస్తున్న గుబురైన తరువుల సమూహంతో కూడిన రామగిరిలో కనిపించే సుందరమైన ప్రకృతి యక్షుణ్ణి మరింత విరహవేదనకు గురి చేశాయి.'  ఆషాఢంలో కనిపించిన ఒక మేఘాన్ని తన ప్రియురాలికి విరహసందేశాన్ని వినిపించమని వేడుకుంటాడు యక్షుడు. జనకరాజతనయ స్నానం చేసిన పుణ్యోదకాలు, చక్కని నీడనిచ్చే చిక్కటి వృక్షాలు అని వర్ణించడంతో యక్షుడు వసతి చేసిన ఆశ్రమం ఉన్న ప్రదేశం చిత్రకూటంలో ఉన్న రామగిరి అని తెలుస్తోంది. రామగిరి, చిత్రకూటం అందాలు వర్ణించడంలో కవి కౌశలం విశేషంగా కనబడుతుంది. రామాయణంలో సుగ్రీవుడు, మేఘసందేశంలో యక్షుడు వారి వారి వివరణల్లో ఎంతో ప్రత్యేకంగా భౌగోళిక సమాచారం చెప్తారు. యక్షుడు, అతడికి వచ్చిన శాపం, సంవత్సరం పాటు ప్రేయసికి దూరంగా, భూలోకంలో తప్పనిసరిగా వుండవలసి రావడం, విరహబాధ, ఆషాఢంలో వర్షసూచనగా వచ్చిన మేఘాలు, ఆ మేఘాలతో యక్షుడు చేసే సంభాషణ, ఒక మేఘాన్ని తన దూతగా అలకాపురిలోని తన ప్రేయసికి ఈ విరహబాధ గురించి చెప్పమని ప్రాధేయపడటం, ఇవీ మేఘసందేశం కావ్యం లోని విశేషాంశాలు. 

***************************************************
99
ప్రచండ సూర్యః  స్పృహణీయ చంద్రమాః 
సదావగాహ క్షమవారి సంచయః 
దినాంతరమ్యః అభ్యుపశాంత మన్మథో 
నిదాఘకాలః  అయముపాగతః ప్రియే 

భావం: ఈశ్లోకం మహాకవి కాళిదాసు విరచించిన ఋతుసంహారం కావ్యం లోనిది. సంవత్సరంలో వచ్చే గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర, వసంత మొదలైన ఆరు ఋతువులనూ వర్ణిస్తూ  ఋతుసంహారం కావ్యాన్ని రచించాడు కాళిదాసు. ఋతుసంహారం అంటే ఋతువుల సమూహం. గ్రీష్మంతో మొదలుపెట్టి వసంతం వరకూ వచ్చే ఆయా ఋతువుల్లో ప్రకృతి సౌందర్యాన్ని కమనీయంగా, రమణీయంగా వర్ణించాడు. కాళిదాసు ఈ కావ్యంలో ప్రతి ఋతువు లోనూ సుఖం, సౌందర్యం రెండూ ఉంటాయని చెప్పాడు. "ఓ ప్రియా, ఈ గ్రీష్మ ఋతువు గొప్పదనం చూడు, ప్రచండమైన సూర్యతాపము వలన పగళ్లలో నదీ, తటాకముల వంటి చల్లని జలాశయములను  ఆశ్రయించి సుఖముగా ఈదులాడి స్నానములు చేయవచ్చును. రాత్రులలో రమణీయమైన ఆరుబయళ్లలో వెన్నెలలో విశ్రమిస్తూ, మధుర శీతల పానీయములు సేవిస్తూ, సంగీత, నృత్యాదులతో సేదదీరుతూ,  కామకేళీ సుఖమును ఆస్వాదిస్తూ, సకల సుఖోపభోగాలనూ అనుభవించుటకు ఎంతో యోగ్యమైన కాలము ఈ గ్రీష్మము". ఈవిధంగా వేడిమినిచ్చే వేసవిలో కూడా సుఖము, సౌందర్యము అనుభవించి ఆనందించవచ్చని కాళిదాసు ఋతుసంహారం కావ్యంలోని గ్రీష్మరుతు వర్ణనలో చెప్తున్నాడు. 

***************************************************
100
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా 
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా
ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ 
భావం: ఈ శ్లోకం దేవీ అశ్వధాటీ స్తోత్రం అనబడే అంబాస్తుతి లోనిది. ఈ స్తోత్రం శృంగార భక్తి రస ప్రధానమైనది. "ఆ లలితాపరాభట్టారిక తన సఖులైన దేవతా స్త్రీలందరినీ తన కదంబవనంలోనే ఉంచుకుంది. ఆ సఖులందరూ భక్తిగా తమ శిరస్సులను, ఆ పరమేశ్వరి పాదాలపై ఉంచి ప్రణమిల్లుతూ ఉన్నారు. ఆ సమయంలో వారి కిరీట మణిమయ కాంతులు ఆ జగదాంబ పాదాలపై పడి, ఆమె పాదపద్మాలు రత్నప్రభలతో మెరిసిపోతూ ఉన్నాయి. ఆ శ్రీలలిత చందనద్రవదిగ్ధాంగీ కదా, సుగంధపూరితమైన అంగముల నుంచి వచ్చిన పరిమళంతో కంచుకము కూడా చందన గంధంతో గుబాళిస్తోంది. ఆ పర్వతరాజపుత్రి తనను సేవించిన వారికి మహత్వ కవిత్వ పటిమను ప్రసాదిస్తోంది. సౌభాగ్యవశాత్తూ జగన్మాత సేవిస్తున్న తాంబూలరసం పొందినవారు దాని మహిమ వలన, అశ్వధాటీని మించిన వేగంతో ఆశుకవిత్వం చెప్పగలరు". లలితాదేవి ఉండే చింతామణీ గృహం కదంబవనంలో ఉన్నది. శ్రీలలిత ఆ కదంబవనంలోనే, తనను సేవించే దేవతా స్త్రీలందరికీ ఆశ్రయమిచ్చింది. వారు ఆ శ్రీదేవిని సేవిస్తూ సదా ఆ శ్రీమాత చరణకమలాలకు సకిరీట నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఆ కిరీటమణుల చిత్ర విచిత్ర వర్ణములతో  ఆ మహారాజ్ఞి పాదాలు మెరిసిపోతూ ఉన్నాయి. ఆ దివ్యగంధాఢ్యకు చేసిన చందన సేవ వలన ఆ శ్రీమాత ధరించిన కుచశాటీ కూడా సుగంధభరితమై వాసనలీనుతోంది. ఆ మహాకాళి సేవించే తాంబూలపు రసలేశమైనా లభిస్తే, అశ్వధాటి కన్నా వేగంగా కవిత్వం చెప్పే పటుత్వం వస్తుంది. అమ్మా, నాకా వరమీయవూ అని భక్తుడు కాళిదాసు వేడుకున్నాడు. కాళీ ప్రసన్నత పొందిన అదృష్టవంతుడు కాళిదాసు రచనాపటుత్వం గురించి వేరే చెప్పాలా. ఈ సందర్భంగా మహాకవి పోతన చెప్పిన పద్యం కూడా చెప్పాలనిపిస్తోంది.
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
***************************************************
101
జగన్మాతర్మాతస్తవ చరణసేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా 
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి 

భావం: ఈ శ్లోకం శ్రీదేవ్యపరాధక్షమాపణా స్తోత్రం లోనిది. ఈ స్తోత్రం ఆదిశంకరుడు చెప్పాడు అనే విషయం కూడా ప్రచారంలో ఉంది. కానీ ఈ స్తోత్రం లోనే ఉన్న మరొక శ్లోకంలో రచయిత నా వయసు ఎనభైయైదు వత్సరాలు మీరిపోయింది అంటాడు. ఆదిశంకరుడు అంతకాలం జీవించలేదు కనుక, ఈ స్తోత్రం బహుశా జగద్గురు శంకరాచార్య పరంపరలోని మరియొక శంకరాచార్యుడు చెప్పి ఉండవచ్చు. "ఓ జగన్మాతా, నీ పాదసేవ చెయ్యలేదు, నీకు విస్తారంగా ధనము కానీ, బంగారము కానీ సమర్పించుకోలేదు. అయినప్పటికీ నీవు నాపై అపారమైన స్నేహము, ప్రేమ కురిపిస్తున్నావు తల్లీ. ఎందుకంటే, ఈ లోకంలో ఎక్కడైనా పొరపాటున చెడ్డకొడుకు ఉంటాడేమో కానీ, చెడ్డతల్లి వుండదు కదా." అంటూ తానూ ఆ జగన్మాత కుమారుడనే అని నిర్ధారణ చేశాడు కవి. ఆ తల్లి తనపై చూపించే అనుపమానమైన స్నేహాదరాలు, ప్రేమ, కరుణ తలచుకుంటూ, 'అమ్మా, నీకు నేను, ధనం కానీ, విలువైన సువర్ణాభరణములు కానీ ఇవ్వలేదమ్మా, నీ పాదపద్మాలనైనా సేవించుకోలేదు తల్లీ. అయినప్పటికీ నీవు నా తల్లివి కదా, నీ నిరుపమానమైన స్నేహం నాపట్ల చెక్కు చెదరలేదమ్మా. నీవు తల్లివి, నేను నీ బిడ్డను. ఈ లోకంలో పొరపాటున ఎక్కడో చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ, చెడ్డ తల్లులు లేరు కదమ్మా. తల్లి ఎప్పుడూ తన బిడ్డల సర్వతోముఖాభివృద్దికై, వారిని సర్వతోభద్రమండలం వలె కాచుకుంటూనే ఉంటుంది. ఈ శ్లోకం ద్వారా భగవతి, భక్తుల మధ్య ఉండేది ఎల్లప్పుడూ తల్లీబిడ్డల సంబంధమేనని స్పష్టం చేశాడు  శంకరాచార్యుడు. ఓం శ్రీ జగన్మాతృకాయై నమః 
 
***************************************************
102
అశ్వత్థామః బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః 
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం
జీవేద్వర్షశ్శతమ్ సోపి సర్వవ్యాధి వివర్జిత

భావం: ఈ శ్లోకాన్ని నిత్యమూ స్మరించుకుంటూ ఉంటే, నూరేళ్లు  ఏ వ్యాధులూ రాకుండా జీవిస్తారు అని భావం. "మన సనాతన గ్రంధాలు అశ్వత్థామ, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురినీ చిరంజీవులని చెప్తున్నాయి, వీరితో పాటు ఎనిమిదవవాడుగా మార్కండేయుడిని కూడా కలిపి నిత్యమూ స్మరించుకునేవారు ఎటువంటి ఆధివ్యాధులు వేధించకుండా శతసంవత్సరాలు జీవిస్తారని ఈ శ్లోకం చెప్తోంది. ఈ ఎనిమిది మందీ చిరంజీవులు, అంటే చిరకాలం జీవించేవారని అర్థం. అటువంటి చిరంజీవులని నిత్యమూ తలచుకుంటే ఏ రోగబాధలూ లేకుండా వందేళ్లు బ్రతుకుతారని విశ్వాసం. అశ్వత్థామ నిద్రిస్తున్న ఉపపాండవులను హతమార్చినందు వలన శ్రీకృష్ణుడిచ్చిన శాపకారణంగా చిరకాలం వ్యాధిగ్రస్తుడై బ్రతకవలసి వచ్చింది. బలి దానగుణాన్ని మెచ్చి వామనుడు చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చాడు. వ్యాసుడు లోకానికి చేసిన హితం వలన చిరంజీవి అయ్యాడు. హనుమంతుడు సీతారాముల అనుగ్రహం వలన చిరంజీవి అయితే, శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో విభీషణుడి భక్తికి మెచ్చి, చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చాడు. కృపుడు తనలోని రుద్రాంశ వలన, పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఇచ్చిన వరం వలన, మార్కండేయుడు శివానుగ్రహం వలన చిరంజీవులు అయ్యారు. ఈ వివరాలన్నీ రామాయణ, భారత, భాగవత పురాణాలలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. 

***************************************************
103
అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మానందమయ మాత్మా 
మే శుధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్గ్ స్వాహా  
భావం: ఇది కృష్ణ యజుర్వేదములో తైత్తిరీయ అరణ్యకంలో మహానారాయణోపనిషత్తులో 66వ అనువాకంలో 9వ శ్లోకం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేవి అయిదు కోశాలు. మనం తినే ఆహారం వలన ఏర్పడినది అన్నమయకోశం. పంచకర్మేంద్రియాలతో పంచప్రాణాల శక్తితో ఏర్పడినది ప్రాణమయకోశం. పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సుతో కలిసి ఏర్పడినది మనోమయకోశం. పంచజ్ఞానేంద్రియాల వలన బుద్ధి, ప్రజ్ఞలతో ఏర్పడినది విజ్ఞానమయకోశం. అకారణంగా దైవికమైన ఆనందాన్ని అనుభవించేలా చేసేది ఆనందమయకోశం. అన్నమయకోశం లోపల ప్రాణమయకోశం, దాని లోపల మనోమయకోశం, దాని లోపల విజ్ఞానమయకోశం, దాని లోపల ఆనందమయకోశం,  దాని లోపల ఆత్మ ఉన్నాయి. "ఆత్మ ఈ అయిదు కోశాలనూ ఆవరించి ఉంది. ఈ అయిదు కోశాలనూ పొంది జీవి దేహి అవుతాడు. నాలో ఉన్న ఈ అయిదు కోశాలూ శుధ్ధిగా ఉండాలి, వాటిలోని జ్యోతి ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, వాటికి ఏ ధూళీ, రజస్సూ అంటకూడదు, వాటికి ఏ పాపాలూ అంటకుండా నిష్కళంకముగా ఉండాలి, అవి ఎల్లప్పుడూ నిర్మలమైన జ్యోతి రూపంలో ఆ పరమాత్మలో లీనమవాలనేదే నా కోరిక." లలితాంబిక పంచకోశాంతరస్థిత అని శ్రీలలితాసహస్రనామస్తోత్రం చెప్తోంది. అమ్మ పంచకోశాల లోపల ఉన్నది అని అర్థం. నాలోనే ఉన్న శ్రీలలితాత్రిపురసుందరిలో నాయొక్క నిష్కళంక జ్యోతిరాత్మ ఐక్యమవ్వాలని నా కోరిక. దానిని నేను ఆహ్వానిస్తున్నాను. అన్ని జీవులలో ఈ అయిదు కోశాలూ ఉంటాయి, వాటి లోపల ఆత్మా ఉంటుంది. ఆ ఆత్మను స్వచ్ఛంగా జ్యోతిరూపంలో పరమాత్మను చేర్చడమే అసలైన తపోయజ్ఞం. సాధారణంగా ఈ మంత్రాలన్నీ హవనం చేసేటప్పుడు ఉపయోగిస్తారు. అందుకే చివరిలో స్వాహాకారం. 
***************************************************
104
మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తిబంధు సహోదరః
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత
జన్మదుఃఖం జరాదుఃఖం జాయాదుఃఖం పునఃపునః
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత
కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠన్తి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత


భావం: ఈ తస్మాత్ జాగ్రత జాగ్రత శ్లోకాలు ధారానగరంలో ఒకప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించినవి. ధారానగరంలో ఒకానొక చర్మకారుడు తన వృత్తిలో భాగంగా ప్రతిరాత్రీ డప్పును వాయిస్తూ ఊరివారిని మెలకువగా ఉండమని హెచ్చరిస్తూ ఉండేవాడు. ఒకరాత్రి ఆతడి బదులుగా అతని పుత్రుడు ఆ పని చేయవలసి వచ్చింది. ఈ పిల్లవాడు గతజన్మలో గొప్పయోగి. ఈ చర్మకారునితో ఏర్పడిన ఒక ప్రత్యేక ఋణం వలన, ఆ ఇంటిలో పుత్రుడుగా పుట్టవలసి వచ్చింది. గొప్ప యోగి కనుక పూర్వజన్మ పాండిత్యం ఆతడు మరచిపోలేదు. తండ్రికి బదులు తాను పహరా కాయవలసి వచ్చినప్పుడు, తండ్రి వలె కేవలం డప్పు మాత్రమే కొట్టక, దానితో పాటు ఒక శ్లోకం కూడా చెప్పసాగాడు. అది విన్న ఆ దేశపు రాజు, ఆ పిల్లవాడిని మరుసటి ఉదయం పిలిచి ఘనంగా బహుమతులిచ్చి సత్కరించాడు. ఆ ధనాన్ని పిల్లవాడు తండ్రి చేతికి ఇస్తూనే, ఋణానుబంధం తీరి దేహం వదిలిపెట్టినట్టు చెప్తారు. అందుకే అంటారు, "ఋణానుబంధరూపేణా పశు పత్నీ సుతా ఆలయ" అని. అంటే, పశువులు, భార్య లేదా భర్త, పిల్లలు, ఇల్లు ఇవి అన్నీ కేవలమూ ఋణానుబంధం వలననే జతపడతాయి, అని అర్థం. ఈ శ్లోకాలలో "తల్లి, తండ్రి, బంధువులు, సహోదరులు, డబ్బు, ఇల్లు ఇవి అన్నీ శాశ్వతం కాదు. ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో తెలియదు. వీటిమీద వ్యామోహం వదిలి, కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఈ పుట్టుకలు, ఆ తరువాత వచ్చే వృద్హాప్యబాధలు, ఈ భార్యా,భర్తల వలన కలిగే దుఃఖాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అసలు ఈ భవసాగరమే దుఃఖాల నిలయం. ఈ విషయం తెలుసుకుని కొద్దిగా జాగ్రత్తగా ఉండు. నీవు అమాయకంగా సంపాదించిన ధన, కనక, మాణిక్యాలను రక్షించుకునే ప్రయత్నంలో ఉంటున్నావు, కానీ, నీ నిజమైన జ్ఞానరత్నాలను దొంగిలించడానికి, నీలోనే తిష్ఠ వేసుకుని కూర్చున్న నీ శత్రువుల నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండు." ఆ శత్రువులే అరి(శత్రువు) షట్(ఆరు) వర్గాలైన(కూటమి), కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు. ఇవి మనలోనే ఉంటూ మన జ్ఞానరత్నాలను అపహరిస్తూ, మూర్ఖుణ్ణి చేస్తూ ఉంటాయి. అసలు కాపాడుకోవలసిన వాటిని పట్టించుకోక, క్షణభంగురాలైన విషయాల వెనుక పడకు అని హెచ్చరిస్తున్నాడు ఆ బాలుడి రూపంలో ఉన్న యోగి. కనుక, తస్మాత్ జాగ్రత జాగ్రత. 

***************************************************
105
యద్దృష్ట్వా నాపరం దృశ్యం, యద్భూత్వా న పునర్భవః, 
యత్‌ జ్ఞాత్వా నా పరం జ్ఞేయం, తద్బ్రహ్మేత్యవధారయేత్‌. 

భావం: ఈ శ్లోకం ఆదిశంకరుడు చెప్పిన ఆత్మబోధ లోనిది. "ఏది చూశాక ఇక ఏమీ చూడనవసరం లేదో, ఏది పొందాక ఇక జన్మించవలసిన పనే లేదో, ఏది తెలుసుకున్నాక ఇక తెలుసుకోవలసినది ఏమీ ఉండదో, అదే బ్రహ్మము అని తెలుసుకోవాలి." మనిషి కోరికల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. ఈ వాంఛల సుడిగుండంలో పడి ఉక్కిరిబిక్కిరౌతుంటాడు. అయినా దాని నుంచి బయటపడాలని కోరుకోడు. ఆ కర్మబంధాలే ఎంతో సుఖాన్నిస్తున్నాయని భ్రమపడి, అక్కడే ఆ కర్మలనే ఆ అవిద్యతోనే ఆనందిస్తూ ఉంటాడు. కోరికలు ఉన్నంతవరకూ ఆ జీవి తాను ఇంకా పరిపూర్ణత్వాన్ని పొందలేదని గ్రహించడు. కోరికే దుఃఖానికి మూలం, అవిద్యకు ఆధారం. అసంపూర్ణత్వానికి సంకేతం. మనిషి ఆ సాలెగూటి నుంచి బయటకు రావాలి. కర్మబంధాలు బానిసత్వానికి దారిచూపుతుంటే, నిజమైన ఆనందానికి మూలమేదో వెతుక్కోవాలి. ఏది దొరికితే, ఇక ఏమీ అక్కరలేదో, ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఏ దృశ్యాన్నైతే ఒకసారి చూస్తే మనసంతా నిండిపోయి, మరి ఏ ఇతర దృశ్యానికీ చోటు ఉండదో, ఆ దృశ్యం చూసే ప్రయత్నం చేయాలి. ఏ వస్తువు పొందితే, మరి ఇక ఏ ఇతర వస్తువుయందూ దృష్టి పోదో, ఆ వస్తువు కోసం ఆరాటపడాలి. ఏ విషయం తెలిస్తే, ఇక ఈ ప్రపంచంలో మరి ఇక తెలుసుకోవలసినది ఏమీ ఉండదో, ఆ విషయాన్వేషణ చేయాలి. ఆ జ్ఞానాన్ని పొందిన జీవికి బ్రహ్మ అంటే మరి ఏదో కాదు, తానే అనే విషయం అవగాహనకు వస్తుంది. అప్పుడు కలిగే ఆనందం అనుభవైకవైద్యం. అది మాటలకు అందనిది, మనసుకు బోధపడినది, చైతన్యానికి మరో రూపమైనది. ఆ సత్తైన చిత్తు ఆనందం ఒకసారి అనుభవిస్తే అదే ఆత్మానందం. శంకరుడు ఆత్మబోధలో చెప్పినది ఇదే. ప్రయత్నించు, వాంఛా వలయం నుంచి బయటకు రా,  కర్మబంధాలను భావించకు, స్వేచ్ఛను పొందు, చూడు, పొందు, తెలుసుకో,  ఆనందించు. ఆ ఆత్మానందాన్ని అనుభవించు. ఇదే శంకర సందేశం.    
***************************************************
106
అతిపరిచయాత్ అవజ్ఞా సంతత గమనాత్  అనాదరో భవతి 
మలయే భిల్లాపురంధ్రీ చందన తరు కాష్ఠం  ఇంధనం కురుతే 

భావం: ఇది అందరూ పాటించదగ్గ ఒక చక్కని సూక్తి. "మలయపర్వతం వద్ద నివసించే భిల్లస్త్రీలు అక్కడ విస్తృతంగా పెరిగే గంధపు చెట్లను వాటి విలువ తెలియక వంటచెరకుగా వాడుకున్నట్టు, ఎవరితోనైనా అతిగా పరిచయము పెంచుకుంటే దాని వలన అవజ్ఞ, ఎక్కడికైనా తరచూ వెళ్తే అనాదరము లభిస్తాయి. "మలయపర్వతంపై గంధపు చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. అక్కడ నివసించే కొండజాతి మహిళలు వాటిని నిత్యమూ చూస్తూ ఉండటంతో, ఆ చెట్ల విలువగానీ, ప్రత్యేకతగానీ వారికి తెలియవు. రోజూ చూసే చెట్టే కదా అనే చులకనభావంతో ఆ గంధపు చెట్ల కలపను వంటచెరకుగా వాడుకుంటారు. అలాగే, ఎవరితోనైనా అనవసరంగా అతిగా పరిచయాలు పెంచుకుంటే, వారికి మన విలువ తెలియక, వారు అవజ్ఞ అంటే చులకన భావం, తిరస్కారభావం చూపిస్తారు. అదేవిధంగా ఎవరి దగ్గరకైనా, ఎవరి ఇంటికైనా 'సంతత గమనాత్' అంటే ఎక్కువగా వెళ్తూవుంటే, వారు కూడా మన విలువను గ్రహించక, రోజూ వచ్చేవారే కదా అని అనాదరం చేస్తారు. అతి పరిచయం, సంతతగమనము మన విలువను తగ్గిస్తాయి, తస్మాత్ జాగ్రత అని కవి హెచ్చరిస్తూ చెప్తున్నాడు. శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో 'సర్వానుల్లంఘ్యశాసనా' అనే నామం ఉంది. మన అమ్మే కదా అని, అమ్మతో కూడా చులకనగా వ్యవహరిస్తే, తల్లి కూడా ఊరుకోదు, తన శాసనాలను తాను మాత్రమే అధిగమించే శక్తి కల ఆ తల్లి తన పిల్లలకు తన శక్తి ఏమిటో చూపిస్తుంది. తల్లిని కూడా చులకనగా చూడవద్దు అని శ్రీలలిత చెప్పింది. శ్రీమాత్రేనమః 

***************************************************
107
ఓం శం నో మిత్రః, శం వరుణః, శం నో భవత్యర్యమా, శం న ఇంద్రో బృహస్పతిః,
శం నో విష్ణురురు క్రమః, నమో బ్రహ్మణే, నమస్తే వాయో, త్వమే వ ప్రత్యక్షం బ్రహ్మాసి, 
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, 
తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మామ్, అవతు వక్తారమ్, 
ఓం శాంతిః శాంతిః శాంతిః,
ఓం సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీతమస్తు,
మా విద్విషావహై, ఓం శాంతిః శాంతిః శాంతిః
భావం: ఈ శాంతిమంత్రం తైత్తిరీయోపనిషత్తు లోనిది. "మిత్రుడు, వరుణుడు, అర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు, ఉరుక్రముడు అనుగ్రహముతో శాంతిని, సుఖమును ప్రసాదించి మనకు అనుకూలురుగా ఉండెదరు గాక. బ్రహ్మకు, వాయువుకు నమస్కారం. నీవే ప్రత్యక్షబ్రహ్మవి. నీవే నా ప్రత్యక్షబ్రహ్మవని చెప్తాను. నేను అనృతమును చెప్పను, ఋతమునే పలుకుతాను. సత్యమునే వచిస్తాను. నేను పాటిస్తున్న ఆ సత్య, ఋతు పాలనే నన్ను రక్షించు గాక. ఆ సత్య, ఋతు వాక్కులను పలికే ఆచార్యులను రక్షించు గాక. ఆ బ్రహ్మయే నన్ను రక్షించు గాక, నా ఆచార్యులను రక్షించు గాక. ఓం శాంతి, శాంతి, శాంతి. ఆ బ్రహ్మయే మా ఇద్దరినీ (గురుశిష్యులు) రక్షించు గాక, మా ఇద్దరినీ పోషించు గాక. మేమిద్దరమూ గొప్పశక్తితో కలసి పనిచేయుదుము గాక. కలసి అధ్యయనము చేసి ఇరువురమూ జ్ఞానమును పెంపొందించు కొనెదము గాక. మా ఇరువురి మధ్య ఏ విధమైన బేధభావములు, ద్వేషభావములు లేకుండు గాక. ఓం శాంతి, శాంతి, శాంతి."  మన ఉపనిషత్తులు అన్నింటిలోనూ శాంతి మంత్రములు చెప్పారు. విశ్వశాంతియే మన వేద, వేదాంతముల ధ్యేయము, లక్ష్యము. ద్వాదశాదిత్యులలో మిత్రుడనే సూర్యుడు ఒకడు. జలాధిదేవతగా వర్షములు కురిపించు వాడు వరుణుడు. ఆ మిత్రావరుణులు మనకు శాంతిని, సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. పితృదేవతలలో ఒకడైన అర్యముడు మనపై అనుగ్రహముతో శాంతిని, సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. దేవతల రాజైన ఇంద్రుడు, దేవతల గురువైన బృహస్పతి మనకు శాంతిని, సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. స్థితికారకుడైన విష్ణువు, ముల్లోకాలనూ తన పాదములతో ఆక్రమించగల ఉరుక్రముడైన త్రివిక్రముడు మనకు శాంతిని, సుఖాన్ని కలగచేస్తూ ఉంటారు. సృష్టించిన బ్రహ్మదేవునికి, ఊపిరినిచ్చిన వాయుదేవునికి నమస్కారములు. మా రక్షకుడైన నీవే ఆ ప్రత్యక్షబ్రహ్మవనే సత్యమును, ఋతమును పలుకుతున్నాను. నన్నూ, నాకు ఈ జ్ఞానమును బోధించిన ఆచార్యులనూ కూడా రక్షించేవాడవు నీవే. మా గురుశిష్యులను రక్షించి, పోషించేవాడవు నీవే. మేమిద్దరమూ కలసి చేసే అధ్యయనమును సంపూర్ణము చేస్తూ, మా ఇద్దరి మధ్య ఏ ద్వేషాలూ, భేదాలూ లేకుండా, రాకుండా చూస్తున్నవాడివి నీవే. అప్పుడు ముమ్మాటికీ ఇక సర్వమూ, సకలమూ శాంతిమయమే. ఓం శాంతిః శాంతిః శాంతిః. 

***************************************************
108
ఓం ద్యౌః శాన్తిరన్తరిక్షం శాన్తిః, పృథివీ శాన్తిరాపః శాన్తిరోషధయః శాన్తిః ,
వనస్పతయః శాన్తిర్విశ్వేదేవాః శాన్తిర్బ్రహ్మ శాన్తిః,
సర్వం శాన్తిః శాన్తిరేవ శాంతిః సా మా శాన్తిరేధి
ఓం శాంతిః శాంతిః శాంతిః. 

భావం: ఈ మంత్రములు వేదములో చెప్పిన శాంతిసూక్తము లోనివి. "ఆకాశం, అంతరిక్షం, భూమి, నీరు, ఓషధులు, వనస్పతులు, విశ్వదేవతలు, బ్రహ్మ, సర్వమూ శాంతితో ఉండు గాక. ఆ శాంతి నాలో కూడా ఉండు గాక. ఓం శాంతిః శాంతిః శాంతిః." ప్రతి మనిషి తన జీవితం శాంతిగా గడవాలని కోరుకోవడం సహజం. శాంతి అంటే శమం, శమనం, ఉపశమనం. ఈ శాంతి లోపించడానికి కారణం మనిషికి ఉన్న తాపత్రయాలు. ఈ తాపత్రయాలు ఏమిటంటే, ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మికతలు. ఈ మూడే దుఃఖానికి హేతువులు. ఈ మూడింటి వలననే ఎవరైనా శాంతిని కోల్పోతారు. కనుక ఈ మూడు దుఃఖాలనూ అధిగమించాలి. ఆధిదైవిక దుఃఖము అంటే, దైవికంగా సంభవించే ఆపదలు, గండాలు మొదలైన వాటివల్ల కలిగే బాధలు. ఆధిభౌతిక దుఃఖము అంటే పృథ్వి, నీరు వంటి పంచ భూతాల వలన జరిగే ప్రమాదాలు, అపాయాలు వలన కలిగిన కష్టాలు. ఆధ్యాత్మికము అంటే ఆత్మకు సంబంధించినది. ఈ ఆత్మను ఆ పరమాత్మ దగ్గరకు ఎలా చేర్చాలో, ఆ తపన, ఆ వేదన, ఆ సాధన, ఆ తపస్సు, ఇదే ఆధ్యాత్మిక తాపత్రయం అంటే. ఆ దేవుడి కోసం, ఆ సన్నిధానం కోసం, ఆ పరమపదం కోసం, ఆ కైవల్యం కోసం, ఒకటా, రెండా, అనేక బాధలు, కష్టాలు, దుఃఖాలు, నిరాశలు, మధ్యలో ఎదుర్కొనే కఠినపరీక్షలు  అన్నీ ఆధ్యాత్మిక దుఃఖాలే. ఏ అశాంతి కైనా, ఏ దుఃఖాని కైనా, ఏ కష్టాని కైనా కారణాలు ఈ మూడే. పరిశీలనగా గమనించి చూస్తే, మనకు కలిగే ఎన్నో అశాంతులకు కారణం మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిసరాలు, వాతావరణం, అంటే ఆకాశము, అంతరిక్షము, భూమి, నీరు మొదలైనవి. ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే, అవి అన్నీ శాంతిగా ఉండాలి. ఆ శాంతికై మనం విశేషంగా ప్రార్ధించాలి. ఆకాశం శాంతిగా ఉండాలి. అంతరిక్షం శాంతిగా ఉండాలి. భూమి శాంతిగా ఉండాలి. నీరు శాంతిగా ఉండాలి. ఓషధులు శాంతిగా ఉండాలి. వనస్పతులు శాంతిగా ఉండాలి. మనలను నిత్యమూ కాపాడే విశ్వేదేవతలు శాంతిగా ఉండాలి. మనలను సృష్టించి, రక్షించే ఆ బ్రహ్మ శాంతిగా ఉండాలి. సర్వం శాంతిగా ఉండాలి. కేవలము శాంతి మాత్రమే ఉండాలి. అంతటా ఆవరించుకుని ఉన్న ఆ శాంతి నాకూ కలగాలి. ఆ విశ్వశాంతి నాలోనూ పెరగాలి. నాకు ఆ శాంతిని ప్రసాదించు అని మనం వేడుకోవాలి. అదే పై ప్రార్ధన అర్థం. ఈ శాంతిసూక్తములో ఉన్నవి మంత్రాలు కనుక, ఆ మంత్రాలను మననం చేస్తే అవి మనకు శాంతిని కలుగచేస్తాయి. హవనం చేస్తే ఆ హవిస్సులు మన చుట్టూ ఉన్న పృథ్వి, నీరు, వాయువు, ఆకాశం, అంతరిక్షం మొదలైన వాటిని శుద్ధిచేసి, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాలను ఉపశమింపచేసి, శాంతిని కలుగచేస్తాయి. "ద్యౌః శాంతిః" అంటే ఆ మంత్రం ప్రభావం సూర్యుడు మొదలైన దేవతలు ఉండే ద్యులోకానికి కూడా చేరి అధిదైవిక దుఃఖాల నుంచి కూడా రక్షణనిస్తుంది. "ఓం శాంతిః శాంతిః శాంతిః". "యాదేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః". స్వస్తి.

***************************************************





గాయత్రీ మంత్రములు 

  1. సవితాగాయత్రి: ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
  2. సర్వగాయత్రి: ఓం సర్వ చైతన్య రూపం తాం ఆద్యం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్
  3. హంసగాయత్రి: ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్
  4. గణేశగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్
  5. గణేశగాయత్రి: ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్
  6. రుద్రగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
  7. శివగాయత్రి: ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్
  8. శివగాయత్రి: ఓం సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్
  9. దుర్గాగాయత్రి: ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్
  10. స్కందగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్
  11. స్కందగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్
  12. స్కందగాయత్రి: ఓం షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్
  13. సుబ్రహ్మణ్యగాయత్రి: ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్
  14. సుబ్రహ్మణ్యగాయత్రి: ఓం భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్
  15. చండీశ్వరగాయత్రి: ఓం ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్
  16. చండీశ్వరగాయత్రి: ఓం చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్
  17. భృంగేశ్వరగాయత్రి: ఓం భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నో భృంగి ప్రచోదయాత్
  18. వీరభద్రగాయత్రి: ఓం కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్
  19. వీరభద్రగాయత్రి: ఓం చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్
  20. భైరవగాయత్రి: ఓం భైరవాయ విద్మహే హరిహరబ్రహ్మాత్మాయ ధీమహీ తన్నో భైరవః ప్రచోదయాత్ 
  21. సీతాగాయత్రి: ఓం జనకనందిన్యైచ విద్మహే భూమిజాయైచ ధీమహి తన్నోసీతాః ప్రచోదయాత్
  22. వృషభగాయత్రి: ఓం తీక్ష్ణశృంగాయ విద్మహే వేద హస్తాయ ధీమహి తన్నో వృషభః ప్రచోదయాత్
  23. నందిగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్
  24. విష్ణుగాయత్రి: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
  25. విష్ణుగాయత్రి: ఓం దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
  26. నారాయణగాయత్రి: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణః ప్రచోదయాత్
  27. లక్ష్మీగాయత్రి: ఓం మహాలక్ష్మ్యైచ విద్మహే విష్ణుప్రియాయైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
  28. గరుడగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్
  29. అనంతగాయత్రి: ఓం అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో అనంతః ప్రచోదయాత్
  30. సుదర్శన గాయత్రి: ఓం సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్
  31. రామగాయత్రి: ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్
  32. సీతాగాయత్రి: ఓం జనకనందిన్యైచ విద్మహే భూమిజాయైచ ధీమహి తన్నో సీతాః ప్రచోదయాత్
  33. లక్ష్మణగాయత్రి: ఓం రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్
  34. హనుమద్గాయత్రి: ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమః ప్రచోదయాత్
  35. ఆంజనేయ గాయత్రి: ఓం పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్
  36. నృసింహగాయత్రి: ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్
  37. కృష్ణగాయత్రి: ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నోకృష్ణః ప్రచోదయాత్
  38. కృష్ణగాయత్రి: ఓం గోపాలకాయ విద్మహే గోపీప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్
  39. కృష్ణగాయత్రి: ఓం వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్
  40. రాధా గాయత్రి: ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణప్రియాయై ధీమహి తన్నోరాధా ప్రచోదయాత్
  41. తులసీగాయత్రి: ఓం శ్రీతులస్యైచ విద్మహే విష్ణుప్రియాయైచ ధీమహి తన్నో బృందాః ప్రచోదయాత్
  42. దత్తాత్రేయగాయత్రి: ఓం దత్తాత్రేయాయ విద్మహే యోగీశ్వరాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్
  43. దత్తాత్రేయగాయత్రి: ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్
  44. వేంకటేశ్వరగాయత్రి: ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి తన్నో వేంకట ప్రచోదయాత్
  45. అయ్యప్పగాయత్రి: ఓం భూతాధిపాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నః శాస్తః ప్రచోదయాత్
  46. కామ గాయత్రి: ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నోఅనంగః ప్రచోదయాత్
  47. బ్రహ్మగాయత్రి: ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్
  48. బ్రహ్మగాయత్రి: ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్
  49. సరస్వతీగాయత్రి: ఓం వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్
  50. వాస్తుపురుష గాయత్రి: ఓం వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్
  51. ఇంద్రగాయత్రి: ఓం దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్
  52. అగ్నిగాయత్రి: ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్
  53. యమగాయత్రి: ఓం కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్
  54. నైరుతిగాయత్రి: ఓం ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్
  55. వరుణగాయత్రి: ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్నోవరుణః ప్రచోదయాత్
  56. వాయుగాయత్రి: ఓం ధ్వజహస్తాయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్
  57. కుబేరగాయత్రి: ఓం శంఖహస్తాయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్
  58. ఈశానగాయత్రి: ఓం శూలహస్తాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్
  59. యంత్రగాయత్రి: ఓం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్
  60. మంత్రగాయత్రి: ఓం మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్
  61. ఆదిత్యగాయత్రి: ఓం భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
  62. చంద్రగాయత్రి: ఓం అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్
  63. కుజగాయత్రి: ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్
  64. బుధగాయత్రి: ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్
  65. గురుగాయత్రి: ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్
  66. శుక్రగాయత్రి: ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్
  67. శనిగాయత్రి: ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్
  68. రాహుగాయత్రి: ఓం శీర్షరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్
  69. కేతుగాయత్రి: ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్
  70. శ్యామలాగాయత్రి: ఓం శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్
  71. పృథ్వీగాయత్రి: ఓం పృథ్వీదేవ్యైచ విద్మహే సహస్రమూర్త్యైచ ధీమహి తన్నోపృథ్వీ ప్రచోదయాత్
  72. గంగాగాయత్రి: ఓం త్రిపధగామినీచ విద్మహే రుద్రపత్న్యైచ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్
  73. గంగాగాయత్రి: ఓం రుద్రపత్న్యైచ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్
  74. యమునాగాయత్రి: ఓం యమునాదేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్
  75. మత్స్యగాయత్రి: ఓం జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్
  76. కూర్మ గాయత్రి: ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మః ప్రచోదయాత్
  77. హయగ్రీవగాయత్రి: ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవ ప్రచోదయాత్ 
  78. ధన్వంతరిగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే అమృతకలశహస్తాయ ధీమహి తన్నో  ధన్వంతరిః ప్రచోదయాత్ 
  79. ధన్వంతరిగాయత్రి: ఓం ఆదివైద్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో    ధన్వంతరిః ప్రచోదయాత్ 
  80. దక్షిణామూర్తిగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే విద్యావాసాయ ధీమహి తన్నో  దక్షిణామూర్తిః ప్రచోదయాత్ 
  81. గౌరిగాయత్రి: ఓం గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్
  82. గౌరిగాయత్రి: ఓం మహాదేవ్యైచ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్
  83. బాలాగాయత్రి: ఓం త్రిపురాదేవీచ విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్
  84. ధాన్యలక్ష్మీగాయత్రి: ఓం సస్యరూపాయైచ విద్మహే ధాన్యదాయిన్యైచ ధీమహీ తన్నో ధాన్యః ప్రచోదయాత్   
  85. ధైర్యలక్షిగాయత్రి: ఓం ధైర్యరూపిణ్యైచ విద్మహే శౌర్యనార్యైచ ధీమహీ తన్నో ధైర్య ప్రచోదయాత్   
  86. రాజ్యలక్షిగాయత్రి: ఓం రాజ్యదాయైచ విద్మహే రమణీయైచ ధీమహీ తన్నో లక్ష్మీః  ప్రచోదయాత్   
  87. సంతానలక్షిగాయత్రి: ఓం ప్రజాపాలిన్యైచ విద్మహే సర్వమాత్రేచ ధీమహీ తన్నో సన్తుః  ప్రచోదయాత్     
  88. విజయలక్షిగాయత్రి: ఓం జయరూపిణ్యైచ  విద్మహే విజయదాత్ర్యైచ  ధీమహీ తన్నో జయః  ప్రచోదయాత్   
  89. విద్యాలక్షిగాయత్రి: ఓం వాణీరూపిణ్యైచ విద్మహే జ్ఞానదాయైచ  ధీమహీ తన్నో విద్యా ప్రచోదయాత్   
  90. ధనలక్షిగాయత్రి: ఓం ధనాదాయైచ విద్మహే వసురూపిణ్యై ధీమహీ తన్నో లక్ష్మీః  ప్రచోదయాత్   
  91. శాంకరీశక్తిపీఠగాయత్రి: ఓం లంకేశ్వర్యైచ విద్మహే శ్రీశాంకర్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్   
  92. కామాక్షీశక్తిపీఠగాయత్రి: ఓం కాంచీపుర్యైచ విద్మహే శ్రీకామాక్ష్యైచ ధీమహీ తన్నో శక్తిః  ప్రచోదయాత్   
  93. శృంఖలాశక్తిపీఠగాయత్రి: ఓం ప్రద్యుమ్నవాస్యైచ విద్మహే శృంఖలిన్యైచ ధీమహీ తన్నో శక్తిః  ప్రచోదయాత్   
  94. చాముండాశక్తిపీఠగాయత్రి: ఓం క్రౌంచవాసిన్యైచ విద్మహే చాముండాయైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్   
  95. జోగులాంబాశక్తిపీఠగాయత్రి: ఓం అలంపుర్యైచ విద్మహే జోగులాంబాయైచ ధీమహీ తన్నో శక్తిః   ప్రచోదయాత్   
  96. భ్రామరీశక్తిపీఠగాయత్రి: ఓం శైలశ్రియైచ విద్మహే భ్రామర్యైశ్చ ధీమహీ తన్నో శక్తిః      ప్రచోదయాత్   
  97. మహాలక్ష్మీశక్తిపీఠగాయత్రి: ఓం కొల్హాపుర్యైచ విద్మహే మహాలక్ష్మ్యైచ ధీమహీ తన్నో శక్తిః  ప్రచోదయాత్   
  98. ఏకవీరాశక్తిపీఠగాయత్రి: ఓం శ్రీమాహుర్యైచ విద్మహే ఏకవీరాయైచ ధీమహీ తన్నో శక్తిః    ప్రచోదయాత్   
  99. మహాకాళీశక్తిపీఠగాయత్రి: ఓం ఉజ్జయిన్యైచ విద్మహే మహాకాళ్యైచ ధీమహీ  తన్నో శక్తిః      ప్రచోదయాత్ 
  100. పురూహుతికాశక్తిపీఠగాయత్రి: ఓం పిఠాపుర్యైశ్చ విద్మహే పురూహుత్యైచ ధీమహీ తన్నో శక్తిః       ప్రచోదయాత్   
  101. గిరిజాశక్తిపీఠగాయత్రి: ఓం ఓఢ్యస్థిత్యైచ విద్మహే గిరిజాంబాయై ధీమహీ తన్నో శక్తిః  ప్రచోదయాత్   
  102. మాణిక్యాంబాశక్తిపీఠగాయత్రి: ఓం దక్షపుర్యైచ విద్మహే మాణిక్యాంబాచ ధీమహీ తన్నో శక్తిః  ప్రచోదయాత్   
  103. కామాఖ్యాశక్తిపీఠగాయత్రి: ఓం హరిక్షేత్ర్యైచ విద్మహే కామరూపిణ్యైచ ధీమహీ తన్నో శక్తిః   ప్రచోదయాత్   
  104. మాధవేశ్వరీశక్తిపీఠగాయత్రి: ఓం ప్రయాగిన్యైచ విద్మహే వేణీమాధవ్యైచ ధీమహీ తన్నో శక్తిః   ప్రచోదయాత్   
  105. వైష్ణవీశక్తిపీఠగాయత్రి: ఓం జ్వాలావాసిన్యై విద్మహే వైష్ణవ్యైచ ధీమహీ తన్నో శక్తిః  ప్రచోదయాత్   
  106. మంగళగౌరీశక్తిపీఠగాయత్రి: ఓం గయావాసిన్యైచ విద్మహే మంగళగౌర్యైచ ధీమహీ తన్నో శక్తిః   ప్రచోదయాత్   
  107. విశాలాక్షీశక్తిపీఠగాయత్రి: ఓం వారణాస్యైచ విద్మహే విశాలాక్ష్యైచ ధీమహీ తన్నో శక్తిః  ప్రచోదయాత్   
  108. సరస్వతీశక్తిపీఠగాయత్రి: ఓం శ్రీకాశ్మీర్యైచ విద్మహే సరస్వత్యైచ ధీమహీ తన్నో శక్తిః  ప్రచోదయాత్   
***************************************************

రచయిత్రి ఇతర రచనలు 



1. శ్రీలలితావిజయం
  • Blog Address .....  https://moddeep.blogspot.com/
  • YouTube link  .....   https://www.youtube.com/watch?v=GbpVqTSN6wM&list=PLlcQJt4byZ6wk6-Hy9uqnXd7x8nMlVpKb
  • పుస్తకప్రతులకు...9885010650, 9885803015

2. ముఖే ముఖే ----- YouTube link  

https://www.youtube.com/watch?v=dSf52Q4jnJo&list=PLlcQJt4byZ6yUOSPEb2zZITI6_CjBQHD9&pp=gAQB


3. ప్రయాణోపనిషత్ -----  Blog Address ..... https://moddeep2.blogspot.com/


4. జ్ఞాపకాలదొంతర -----  Blog Address .....  http://moddeep1.blogspot.com/


5. పద్యకాదంబరి...అష్టోత్తరశతం ------  http://moddeep5.blogspot.com/

  • Blog Address .....  http://moddeep5.blogspot.com/
  • పుస్తకప్రతులకు...9885010650, 9885803015

6. ఇతర వీడియోల లింకులు ----- Go to Playlists of My YouTube Channel link  

https://youtube.com/@vijayalakshmibhattiprolu8750?si=yLm5uORdZtmge1hQ


***************************************************















Comments

Popular posts from this blog

గాయత్రీ మంత్రములు Edited

కవితలు